19, జనవరి 2021, మంగళవారం

కథ

 *✍🏼 నేటి కథ ✍🏼*



*తలపాగా ఖరీదు*



ఒకరోజు నస్రుద్దీన్‌ ఒక కొత్త తలపాగా తీసుకుని రాజు దగ్గరికి వచ్చాడు.

"రాజా ఈ తలపాగా మీరు కొంటారని తీసుకువచ్చాను" అన్నాడు.

"అలాగా! దీని ఖరీదు ఎంత?" అన్నాడు రాజు.


"వెయ్యి వరహాలు రాజా" అన్నాడు నస్రు. ఇంతలో రాజు పక్కనే ఉన్న మంత్రి ఒకరు "రాజా! ఈ నస్రుద్దీన్‌ మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నాడు. ఈ తలపాగా అంత ఖరీదు చెయ్యదు." అని చెవిలో చెప్పాడు.


మంత్రి చెప్పింది నిజమే అనిపించింది రాజుకి. అయినా తలపాగా నచ్చడంతో, "నస్రుద్దీన్‌! ఈ తలపాగాకి అంత విలువ లేనట్టుందే. ఎందుకంత ధర?" అని అడిగాడు.


"రాజా! దీన్ని చూడగానే ఇది అత్యంత గొప్పవాళ్ల తలపైనే ఉండే తలపాగా అనిపించింది. అంత గొప్పవాళ్లు ఎవరా అని ఆలోచిస్తే నాకు మీరు తప్ప మరెవరూ లేరనిపించింది. అందుకే బేరం కూడా చేయకుండా వెయ్యి వరహాలు పెట్టి కొన్నాను రాజా!" అన్నాడు నస్రు.


నస్రు మాటలకి రాజు పొంగిపోయాడు. వెంటనే వెయ్యి వరహాలిప్పించి, ఆ తలపాగా తీసుకున్నాడు.

వరహాలు తీసుకుని వెళ్తున్న నస్రుకి బయట మంత్రి కనిపించాడు. అతని దగ్గరకి వెళ్లి, మంత్రిగారూ! మీకు తలపాగా గొప్పదనం తెలుసు, కాని నాకు రాజుగారి బలహీనత తెలుసు" అని నవ్వుకుంటూ వెళ్లిపోయాడు.

కామెంట్‌లు లేవు: