10, ఏప్రిల్ 2023, సోమవారం

మహాస్వామి

 


 మహాస్వామి - మానసిక చికిత్స


బుద్ధిమాంద్యంతో ఉన్న తమ పిల్లాణ్ణి తీసుకుని దంపతులొకరు కాంచీపురానికి వచ్చి, పిల్లవాడు చాలా దీన స్థితిలో ఉన్నాడని, అతని స్థితి బాగుపడేలాగా ఆశీర్వదించమని మహాస్వామివారితో మొరపెట్టుకున్నారు.


అప్పుడు వారికి, మహాస్వామివారికి జరిగిన సంభాషణలో నేను గ్రహించినది.


మహాస్వామి : “పిల్లాడు ఏదేని నెప్పితో బాధపడుతున్నాడా?”

తల్లితండ్రులు : “లేదు పెరియవా”


మహాస్వామి : “ఆహారం కావాలని లేదా తిననని మారాం చేస్తున్నాడా?”

తల్లితండ్రులు : “లేదు, ఏది పెడితే అది తింటున్నాడు”


మహాస్వామి : “తన ఈ స్థితి వల్ల మానసిక కృంగుబాటుకు లోనవుతున్నడా?”

తల్లితండ్రులు : “లేదు, తను అందరిలాంటి పిల్లవాడు కాదని తనకు అస్సలు తెలియదు”


మహాస్వామి : “కోరిక, బాధ, ఆకలి, ఆశ, నిరాశ లేని ఉత్తమ స్థితి కోసం మన మహర్షులు కొన్ని వందల సంవత్సరాల పాటు తపస్సు చేశారు. మీ పిల్లాడి స్థితి అటువంటిది. అది భగవంతుడు తనకి ఇచ్చిన గొప్ప వరం. అతనికి శారీరక, మానసిక సమస్యలు ఏవీ లేవు. ఆ స్థితిని పోగొట్టి అతనికి బాధను ఎందుకు కలగజేయాలని అనుకుంటున్నారు? మీరు ఇచ్చే మందులు పూర్తిగా అతడి సమస్యను తీర్చి, సాధారణ పిల్లాడిలా మార్చగలిగితే మీరు ప్రయత్నించవచ్చు. కాని అది సాధ్యం కాదని వైద్యులు తేల్చేశారు”


ఇది సాధారణ ఆలోచనలకు అతీతంగా ఉన్న విషయం. కాని సరైనది, స్థిరమైనది కూడా!


ఒకసారి పోస్ట్ మేనింజిటిక్ హెమిపరెసిస్ తో బాధపడుతున్న బిడ్డతో తల్లితండ్రులు మహాస్వామివారి వద్దకు వచ్చారు. వారు మధ్యతరగతి ఆదాయానికి చెందినవారు. చాలా బాధలో ఉన్నారు. వారు స్వామివారితో, “ఇలా మాకే ఎందుకు జరిగింది? ఏమి తప్పు చేశామని మాకు ఈ బిడ్డ బరువుని ఇచ్చారు? వేలకొలది తల్లితండ్రులకు మంచి పిల్లల్ని ఇచ్చిన భగవంతుడు మాకు మాత్రం ఇలాంటి బిడ్డను ఎందుకు ఇచ్చాడు?” అని బాధపడ్డారు.


స్వామివారు ఆ దంపతులతో, “భగవంతుడు మిమ్మల్ని శిక్షించలేదు. నిజానికి మీరు దేవునిచేత ఎన్నుకోబడ్డారు. ఏదో పూర్వజన్మ పాపకర్మ వల్ల ఈ పిల్లాడు ఇలా అనుభవిస్తున్నాడు. అంతేకాక ఈ బాధ తనకి ఎక్కువగా ఉండరాదు అని భగవంతుడు ఆలోచించాడు. ఈ పిల్లాడికి మంచి ధనవంతులైన తల్లితండ్రులను ఇచ్చుంటే, బహుశా వారు పిల్లాడి బాగోగులు చూడటానికి పనివారిని నియమించేవారు. దాని వల్ల తల్లితండ్రుల నిజమైన ప్రేమ, ఆప్యాయత, అనురాగం తనకి లభించేవి కాదు. అలాకాక, పేదవారైన తల్లితండ్రులైతే, వారికే తినడానికి తిండి లేకపోవడంతో, పిల్లాణ్ణి చూసుకోవడానికి వారికి సమయము, డబ్బు రెండూ ఉండేవి కావు. వేలమంది తల్లితండ్రులలో భగవంతుడు మిమ్మల్నే ఇతనికి తల్లితండ్రులుగా ఇచ్చాడు కావున అతను మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాడు. అతని బాధ కూడా కొద్దిగా ఉపశమనం పొందుతుంది. ఈ పనికి మీరు మాత్రమే సరైనవారని దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. భగవానుడు మిమ్మల్ని శిక్షించడంలేదు” అని తెలిపారు.


మరలా పూర్తి భిన్నమైన కోణంలో ఆలోచన, కానీ ఇదొక పూర్తిగా కొత్తదైన మానసిక చికిత్సా విధానం.


--- ప్రొ. యస్. కళ్యాణరామన్, న్యూరోసర్జన్, చెన్నై. “మూమెంట్స్ ఆఫ్ ఎ లైఫ్ టైం” నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం



గుంటూరు జిల్లా 


మంగళగిరి 


*యర్రబాలెం శ్రీనగర్ కాలనీ*


కంచి  పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి మహా స్వామి సోమవారం సాయంత్రం 5గంటలకు మంగళగిరి -తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి యర్రబాలెం శ్రీనగర్ కాలనీ లక్ష్మీ సూర్యా ఎస్టేట్స్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరై భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేయనున్నట్లు కార్యనిర్వాహక కమిటీ సభ్యులు తెలిపారు. శంకర విజయేంద్ర సరస్వతి మహా స్వామి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో కార్యనిర్వాహక కమిటీ సభ్యులు డాక్టర్ విష్ణుబట్ల సుబ్రహ్మణ్యం సలక్షణ ఘనపాటి, జి కామేశ్వర శర్మ మాట్లాడుతు కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి మహా స్వామి తెలంగాణా -ఆంధ్ర  రాష్ట్ర పర్యటనలో భాగంగా నగర పరిధిలోని యర్రబాలెంకు విచ్చేయడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నటరాజ శర్మ, రాధాకృష్ణ, నరసింహారావు, బాబ్జి తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు: