27, సెప్టెంబర్ 2021, సోమవారం

సంస్కృత మహాభాగవతం

 *27.09.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - ఎనిమిదవ అధ్యాయము*


*అవధూతోపాఖ్యానము - అజగరము మొదలుకొని పింగళము వరకు గల తొమ్మిదిమంది గురువుల కథలు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*8.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*


*తేనోపకృతమాదాయ శిరసా గ్రామ్యసంగతాః|*


*త్యక్త్వా దురాశాః శరణం వ్రజామి తమధీశ్వరమ్॥12538॥*


భగవదను గ్రహముతో నాకు ఈ వైరాగ్యము కలిగినది. ఆ స్వామి చేసిన ఉపకారమును సాదరముగా శిరసు వంచి, వినమ్రతతో స్వీకరించుచున్నాను. అందువలన విషయసుఖముల యందలి దురాశలను పరిత్యజించి, ఆ సర్వేశ్వరుని త్రికరణశుద్ధిగా శరణుజొచ్చుచున్నాను.


*8.40 (నలుబదియవ శ్లోకము)*


*సంతుష్టా శ్రద్దధత్యేతద్యథా లాభేన జీవతీ|*


*విహరామ్యమునైవాహమాత్మనా రమణేన వై॥12539॥*


ఇకమీదట ఏ పరపురుషునివైపు కన్నెత్తియైనను చూడను. ఆత్మారాముడైన ఆ పరమపురుషునితో భక్తిశ్రద్ధాపూర్వకముగా విహరింతును. ప్రారబ్ధానుసారముగా లభించిన దానితో తృప్తిపడుచు సంతోషముగా జీవింతును.


*8.41 (నలుబది ఒకటవ శ్లోకము)*


*సంసారకూపే పతితం విషయైర్ముషితేక్షణమ్|*


*గ్రస్తం కాలాహినాఽఽత్మానం కోఽన్యస్త్రాతుమధీశ్వరః॥12540॥*


సంసారకూపములోబడి, విషయసుఖములలో మునిగి వివేకమును కోల్పోయినవానిని, కాలసర్పము నోటిలో పడినవానిని ఆ భగవంతుడు తప్ప మరియెవ్వడును రక్షింపజాలడు.


*8.42 (నలుబది రెండవ శ్లోకము)*


*ఆత్మైవ హ్యాత్మనో గోప్తా నిర్విద్యేత యదాఖిలాత్|*


*అప్రమత్త ఇదం పశ్యేద్గ్రస్తం కాలాహినా జగత్॥12541॥*


సకల విషయ సుఖముల నుండి విరక్తుడై, జగత్తంతయును కాలసర్పముచే గ్రహింప బడుచుండునని ఎరిగినవాడు, అప్రమత్తుడై (మిగుల జాగరూకుడై) తనను రక్షించువాడు పరమాత్ముడు మాత్రమే అని గ్రహింపవలెను.


*బ్రాహ్మణ ఉవాచ*


*8.43 (నలుబది మూడవ శ్లోకము)*


*ఏవం వ్యవసితమతిర్దురాశాం కాంతతర్షజామ్|*


*ఛిత్త్వోపశమమాస్థాయ శయ్యాముపవివేశ సా॥12542॥*


*అవధూతయైన దత్తాత్రేయుడు ఇట్లు పలికెను* "యదుమహారాజా! ఆ పింగళయను వేశ్య ఇట్లు నిశ్చయించుకొనినదై, విటులను సంతృప్తిపఱచుచు ధనమును సంపాదింపవలెననెడి దురాశను ఫూర్తిగా వీడి, ప్రశాంతచిత్తయయ్యెను. పిమ్మట ఆమె ఎట్టి చీకూచింతా లేక కంటి నిండా నిద్రపోయెను.


*8.44 (నలుబది నాలుగవ శ్లోకము)*


*ఆశా హి పరమం దుఃఖం నైరాశ్యం పరమం సుఖమ్|*


*యథా సంఛిద్య కాంతాశాం సుఖం సుష్వాప పింగళా॥12543॥*


పింగళ పురుషులపై ఆశను వదలుకొనుటతో హాయిగా నిదురింపగలిగెను. *ఆశయే పరమదుఃఖము. వైరాగ్యమే పరమసుఖము' అనునది పింగళ వృత్తాంతమువలన గ్రహింపదగిన నీతి*.


*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ఏకాదశస్కంధే అష్టమోఽధ్యాయః (8)*


ఇది భాగవత మహాపురాణమునందలి ఏకాదశస్కంధము నందలి *అవధూతోపాఖ్యానము - అజగరము మొదలుకొని పింగళ వరకు గల తొమ్మిదిమంది గురువుల కథలు* అను ఎనిమిదవ అధ్యాయము (8)


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఎనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కామెంట్‌లు లేవు: