10, సెప్టెంబర్ 2023, ఆదివారం

బ్రతుకు తెరువు

 బ్రతుకు తెరువు

కొంచము తెలివితేటలు ఉండి కష్టపడే మనస్తత్వం వున్నవారికి ఈ ప్రపంచంలో బ్రతకటానికి ఏమాత్రం లోటు లేదు.  కాకపోతే చాలామంది ఒక రకమైన అబద్దపు డాంబికానికి (False Prestige )పోవడం వలన వారు జీవితంలో కష్టాలను కొని తెచ్చుకుంటారు. ముఖ్యంగా సాధారణ జీవనం గడిపే అనేక మందిలో  ఈ గుణం ఉండటం వలన జీవితంలో ఎదగలేకపోతారా అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. కొంతమంది నేను డిగ్రీ చదివాను ఈ పని చేస్తావా అని కూడా అంటారు.  చివరకు నీకు డిగ్రీలో ఎన్ని మార్కులు వచ్చాయి అని విచారిస్తే ఏవుంది అత్తెసరు మార్కులతో  ఉత్తిరుణుడు అయివుంటాడు. ఇట్లా అనేక మందిని మనం చూస్తూ ఉంటాం.  నిజానికి జీవితంలో ఎదగాలి అనే భావన ఉన్న వారు ముందుగా చిన్న చిన్న పనులు చేస్తూ అంచెలంచెలుగా ఎదిగి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు.  పట్టుదల వున్నవారికి సాధించలేనిది ఏమీ లేదు. ఏ పని చేయడానికి కూడా నేను వెనుకాడను నాకు కావలసిందల్లా నీతిగా కష్టపడి సంపాదించడం అనే తత్వము అది ఉంటే చాలు.

నిన్న నేను చూసిన ఒక సంఘటన ఇక్కడ పేర్కొంటున్నాను. ఒక సెంటరుకు అది ఏమి పెద్ద సెంటరు ఏమీ కాదు మామూలు సెంటరుకు ఉదయం 7 గంటల సమయానికి నేను వేరే పనిమీద వెళ్ళవలసి వచ్చింది. అక్కడ ఒక 50 సంవత్సరాల వయస్సు వున్న ఒక మహిళ నాలుగు చక్రాల బండి మీద ఒక డజను అరటి పండ్లు పెట్టుకుని వున్నది. కొంతసేపటికి అక్కడికి ఒక చిన్న ట్రక్కు వచ్చి ఆగింది. అందులో ఏముంది అని నేను ఆసక్తితో చూసాను.  ఆ ట్రక్కు నిండా ప్లాస్టిక్ డబ్బాలు,  అన్ని అరటి పండ్లు వున్నవి వున్నాయి.  ఆ ట్రక్కు వానితో ఆ  మహిళ నాకు 4 బాక్స్ కావాలని అడిగింది.  దానికి అతను ఈ రోజు నీకు 3 బోక్స్టులే దొరుకుతాయి అని చెప్పి బోక్స్టులను దింపి వాటిలోని పండ్లను ఆమె నాలుగు చక్రాల బండి మీద సర్ది వెళ్ళాడు.  అప్పుడు ఆ మహిళను నేను విచారించగా ఆమె ఒక్కొక్క బాక్స్టులో 10 నుండి 12 డజనుల పండ్లు వుంటాయని తెలిపింది అవి ఒక్కొక్క బాక్సు యెంత అని అడిగితె దానికి జవాబు చెప్పటానికి నిరాకరించింది.  వ్యాపార రహస్యం ఎవ్వరు చెప్పారు కదా. నేను ఆమెను అడిగితె ఈ పండ్లు సాయంత్రం 3గంటలవరకు అమ్ముడు పోతాయని చెప్పింది.  4 బాక్సులు అయితే సాయంత్రం నాలుగు ఐదు గంటలవరకు అమ్ముతాను.  కానీ ఈ రోజు నేను తొందరగా ఇంటికి వెళతాను అని చెప్పింది.

ఆమె ఇచ్చిన వివరాలు విశ్లేషిస్తే నాకు తట్టిన సమాచారం ఇలా వున్నది. ఆమె దగ్గర దాదాపు 35 నుండి 40 డజనుల పండ్లు ఉన్నాయి.  ఒక్కొక్క డజను పండ్లకు ఆమెకు ఎంతలేదన్నా 15 నుంచి 20 రూపాయల వరకు లాభము రావచ్చు ఆ లెక్కన అంటే 15 రూపాయల వంతున లెక్కిస్తే అంటే 15 x 40= 600 రూపాయల కనీస ఆదాయము కలిగి ఉంటుంది.  నిజానికి అంతకంటే ఎక్కువే వుంది ఉంటుంది.  నా ఉద్దేశం ప్రకారం ఆమెకు రోజుకు 1000/- రూపాయల ఆదాయం వరకు వుంది ఉంటుంది.  ఇందులో ఆమెకు ఏమాత్రం పెట్టుబడి లేదు.  అధవా పెట్టుబడి పెట్టి వ్యాపారము చేసినా కూడా కేవలము 2,000 నుండి  3,000 రూపాయల  వరకు ఉండవచ్చు అంతకంటే అధికంగా ఎట్టిపరిస్థితిలో ఉండదు.
ఎంతోమంది పేదవారు నాకు ఏ పని లేదు అని బాధపడే బదులు ఇటువంటి పనులు చేసుకొని బ్రతకవచ్చు.  వారు బ్రతకడమే కాకుండా పలువురికి ఉపయోగకరంగా కూడా ఉండవచ్చు.
ఇట్లు
మీ భార్గవ శర్మ.


కామెంట్‌లు లేవు: