10, ఆగస్టు 2020, సోమవారం

ధనవంతుడిని కావాలంటే

సందేహం;- నేను ధనవంతుడిని కావాలంటే ఏ పూజలు చెయ్యాలో చెప్పండి?

సమాధానం;- ధనం కావాలంటే లక్ష్మీదేవినే కదా అందరూ పూజిస్తారు. ధనం ఒక్కటే కోరుకోవడంకంటే, ఐశ్వర్యం కావాలని కోరుకోవడం బాగుంటుంది. అయితే ఈ రెండిటికీ తేడా ఏమిటి?

ఐశ్వర్యం అంటే కేవలం ధనం ఒక్కటే కాదు. శరీర ఆరోగ్యం, మనోస్థైర్యం, కుటుంబ శ్రేయం, సామాజిక హోదా, కీర్తి ప్రతిష్టలు, ఉపాధి భద్రత, అభివృద్ధి ఇవన్నీ వస్తాయి.

మన కర్మలనుబట్టే మనకు ఇవి లభిస్తాయి. అయితే ఏ కర్మను ఎప్పుడు మనచేత అనుభవింప చేయాలో నిర్ణయించేది భగవంతుడే. అందువల్ల ఆయన్ను ఆరాధించడం మన కర్తవ్యం. అలా భగవంతుడిని ప్రేమించి, ప్రార్ధించే వారిని కృపతో చూసి, వారి పూర్వ జన్మల్లో చేసిన పుణ్య కర్మలను ముందుకు తెచ్చి అనుభవింప చేస్తాడు. ఇక ముందు కూడా పుణ్య కర్మలే చేసేటట్లు అనుగ్రహిస్తాడు కూడా.

అయితే శ్రీమహావిష్ణువును మనవైపు త్రిప్పి, మనల్ని కటాక్షింపజేసేది ఎప్పుడూ ఆయన వక్ష స్థలంలో ఉండే లక్ష్మీదేవే. మనల్ని సంస్కరించి, భగవానునికి అందించే పురుషకారం (రికమండేషన్) ఆమెదే.

అందువల్ల ఐశ్వర్యాదులు కోరేవారు నారాయణమూర్తిని లక్ష్మీదేవి ద్వారా ఆశ్రయించాలి. ఇద్దరినీ కలిపి పూజించాలి. స్తోత్రం చెయ్యాలి. దీనికి లక్ష్మీ అష్టోత్తరంతో అనుసంధించే శ్రీవిష్ణు సహస్ర నామ స్తోత్రం అత్యుత్తమం.

*శుభంభూయాత్* 

కామెంట్‌లు లేవు: