10, ఆగస్టు 2020, సోమవారం

నల్లనయ్య .

నల్లనయ్య ... వెన్న దొంగ, ఇలా ముద్దుగా మనమందరమూ పిలుచుకునే  శ్రీ కృష్ణుని ప్రతి చర్యలలోనూ జీవన విధానంలోనూ ఎదో ఒక అమూల్యమైన సందేశం ఉంది  ..!

బాలకృష్ణుడు ఇంటింటా తన స్నేహితులతో చేసిన వెన్నముద్దల దొంగతనంలో కూడా మానవులకు అందని దేవరహస్యం ఉందట.

వెన్న జ్ఞానానికి సంకేతంగా చెప్తారు. పెరుగును మధించగా మధించగా కాని వెన్న లభ్యంకాదు కదా! అట్టి తెల్లని వెన్నను తాను తింటూ, ఆ అజ్ఞానమనే నల్లని కుండను బద్దలుకొట్టి మానవులలో జ్ఞానజ్యోతిని వెలిగించడమే
గోవిందుని సందేశంగా భావించాలి అని చెప్తూ వుంటారు !

అలాగే, బాలకృష్ణుని మరో చిన్నారి చేష్టలోని సందేశం:  గోపికలు కుండలలో ఇండ్లకు నీళ్లను యమునానదిలో నుండి తీసుకుని వెళుతూవుంటే, రాళ్లను విసిరి వాటికి చిల్లు పడేలా చేసేవాడట. అలా ఆ కుండని  మానవశరీరము అనుకుంటే ఆకుండలోని నీరు 'అహంకారం' ఆ అహంకారం కారిపోతేనేగాని జీవికి ముక్తి లభించదని ఇలా వారి లీలలోని అంతర్యాన్ని భాగవతోత్తములు వివరిస్తూ ఉంటారు.

ఇంకా, ప్రముఖ భాగవతోత్తములు మనకు అందించే సమాచారాన్ని బట్టి యిప్పటికి సుమారు 30వ శతాబ్దమునకు పూర్వం అంటే క్రీస్తు పూర్వం 3122లో ద్వారకా పట్టణమందు కృష్ణభగవానుడు నిర్యాణము చెందినట్లు తెలియుచున్నది. నాటినుండే కలి ప్రవేశముతో "కలియుగం" ఆరంభమైనదని చెప్తారు. దుష్ట శిక్షణ కోసం భూమిపై శ్రీకృష్ణుడిగా పుట్టిన కృష్ణుడిని జన్మాష్టమి రోజున పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.

నల్లనయ్య.. కన్నయ్య.. కిట్టయ్య.. గోపాలుడు.. ఇలా ఏ పేరుతో పిలిచినా.. పలికే దేవుడు కృష్ణుడు..  జీవితాన్ని చాలా సంతోషంగా, ఆడి పాడుతూ.. అహ్లదంగా చేయమని చెప్పిన ఆనందరూపం. వెన్న దొంగ అయినా.. మన్ను తిన్నా.. అందులో ఓ పరమార్ధం ఉంది.. కాళీయ మర్దనం జరిపినా.. వేల గోపికలతో సరసాలాడినా.. సంజయ రాయబారం నెరపినా.. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునునికి దిశానిర్దేశం చేసినా.. ఒక్కో ఘట్టంలోనూ ఒక్కో సందేశం ఇమిడి ఉంది.. అందుకే యావత్ ప్రపంచం ఈవేళ కృష్ణ తత్వంపై ఆసక్తి పెంచుకుంటోంది.. కృష్ణ తత్వాన్ని మనసారా మననం చేసుకుంటుంది.

జీవితం ఒక బాధ్యత. మనిషి జీవితంలో ఉత్థాన పతనాలు సర్వ సాధారణం.. ప్రతికూల పరిస్థితుల్లో అనుకూలతను సాధించడం ఒక సవాల్.. కృష్ణుడు మనకి బోధించినది ఇదే.. చిన్ని కృష్ణుడు చిన్ననాటి నుంచి అష్టకష్టాలు పడ్డాడు.. లైఫ్‌లో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కొనాలో తన అవతారంతో వివరించాడు..
ఇక చిన్న తనమునుండే అనేకమంది రాక్షసులను సంహరిస్తూ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కావిస్తూ తద్వారా మానవాళికి రాక్షస తత్వాన్ని ఎదుర్కొని వధించమనే సందేశమిచ్చాడు !

కృష్ణుడు సర్వాంతర్యామి.. ఇందుగలడందులేడను సందేహం వలదు.. ఈ కాలానికి.. ప్రత్యేకించి ఇప్పటి తరానికి రిలవెన్స్ ఉన్న ఒకే ఒక దేవుడు కృష్ణుడు.

కృష్ణతత్వం అంటే మానవాళిని మంచి పథంలో నడిపించే ఒక డైరీ.. ఒక జీవన సారం.. ఒక మార్గదర్శి.. ఒక దిక్సూచి.. కృష్ణుడు మానవ జీవితానికి చాలా దగ్గరగా మెలిగిన అవతారపురుషుడు.. ఒక మామూలు మనిషిలో ఉండే కామ, క్రోధ, మద, లోభ మాత్సర్యాలన్నీ మనకి కృష్ణుడి క్యారక్టర్‌లో కనిపిస్తాయి.. మనిషి జీవితంలో ఉండే అన్ని కోణాలు మనకి కృష్ణుడి వ్యక్తిత్వంలో కనిపిస్తాయ్‌.

అసలు ఈ భూమిపై కృష్ణావతారం ఎత్తడమే ఒక సంచలనం.. శ్రీకృష్ణుడు మంచి వ్యూహకర్త.. పరిస్థితులకు తగిన విధంగా ప్రవర్తించాడు.. నీపని నువ్వు చేయి.. ఫలితాన్ని నాకు వదిలిపెట్టు అనే సందేశాన్ని చాటాడు.. ప్రపంచాన్ని కారుచీకట్లు కమ్ముకుంటున్న వేళ.. పనిలో వేగం పెరిగి.. ఒత్తిడి పెరుగుతున్న వేళ అందరూ మరోసారి కృష్ణ తత్వాన్ని ఆశ్రయించాల్సిన తరుణమిది.. కృష్ణతత్వం అంటే ప్రేమమయం ఇదే జీవన పరమార్ధం.. యావత్ మానవాళి తెలుసుకోవాల్సిన విషయం..

కృష్ణుడి జీవితమే ఒక మానవ జీవన అనుభవసారం:

మూర్తీ భవించిన వ్యక్తిత్వ వికాసం.. శ్రీకృష్ణుని రూపం నల్లనిది.. మనసు మాత్రం వెన్న పూసలా తెల్లనిది..  దేనికీ భయపడని వ్యక్తిత్వంతో చేపట్టిన ప్రతీ పనిలోనూ విజయం సాధించాడు.. నమ్మిన వారికి కొండంత అండగా నిలిచాడు.

చిన్నప్పుడే కృష్ణయ్య... కన్న తల్లిదండ్రులకు దూరమయ్యాడు. సొంత మేనమామే శత్రువై సంహరించాలని చూసినా చలించ లేదు.. తామరాకు మీద నీటి బొట్టులా ఉన్నాడు... గోవుల మధ్య గోపన్నలా తిరిగాడు.. గోధూళి వేళ మురళిని వాయిస్తూ తన ఈడు పిల్లలతో చక్కగా కలసి పోయాడు... కాళీయ మర్దనం చేశాడు.. శత్రు సంహారం ఎలా చేయాలో చేసి చూపించాడు.. చిటికెన వేలితో గోవర్ధన గిరిని ఎత్తి తన మహిమను ప్రదర్శించాడు.. యశోదమ్మ దగ్గర పెరిగాడు..  అమాయక బాలునిలా మన్ను తిన్నాడు.. అదేమని చెవి మెలేసిన తల్లికి నోటిలో 14 భువన భాండాలు చూపించాడు..  తల్లి ప్రేమ పాశానికి లొంగిపోయి గంధర్వులకి శాపవిముక్తి కలిగించాడు.... ఉట్టి కొట్టాడు.. వెన్న దొంగలించాడు.. ఇదే ఇప్పటికీ కృష్ణాష్టమి రోజున ఉట్టి పండగగా మనం జరుపుకుంటున్నాం..

అసలు కృష్ణుడంటేనే అలౌకిక ఆనందానికి ప్రతిరూపం..  సచ్చిదానంద రూపం.. సత్‌చిత్ ఆనంద స్వరూపం.. పాపాల్ని నాశనం చేసేదే కృష్ణ తత్వం.. శ్రీ మహా విష్ణువు అష్టమ అవతారమే కృష్ణుడు.. కృష్ఱుడి పేరు తలుచుకుంటేనే అమరత్వం సిద్ధిస్తుంది.. జవసత్వాలు ఉట్టి పడతాయి.. కృష్ణ నామం కర్ణపేయంగా ఉంటుంది..

కృష్ణుడు అవతార పురుషుడే అయినా.. అన్నగారు బలరాముడంటే.. అమితమైన సోదర బంధం... అంతకన్నా మించిన గురు భావన.. కుటుంబంలో చిన్నవారు రక్త బంధాన్ని ఎలా గౌరవించాలో కృష్ణుడి క్యారక్టర్ చెబుతుంది.. అలాగే స్నేహంపై కూడా కృష్ణుడి వ్యక్తిత్వం నుంచి ఈతరం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.. కుచేలుడు కృష్ణుడికన్నా.. ఎంతో కింది స్థాయి వ్యక్తి.. స్నేహ బంధమనేది వీటన్నింటికీ అతీతమైనది అని నిరూపించాడు ..... కుచేలుడు ప్రేమతో తెచ్చిన అటుకులనే ఇష్టంగా తిన్నాడు..

యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత !
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహమ్ !!

ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే అన్నాడు కృష్ణుడు. కృష్ణుడు కారణజన్ముడు.. అందుకే తన అవసరం ఉంటే మళ్లీ మళ్లీ పుడతానన్నాడు.. కృష్ణుడిలో మంచి రాజకీయ వేత్త ఉన్నాడు..  కృష్ణుని ప్రమేయం లేకుండా మహాభారత యుద్ధం కానీ, భగవద్గీత పుట్టుక కానీ జరిగేది కాదు..  దుష్ట శిక్షణ కోసం.. శిష్ట రక్షణ కోసం పాటు పడ్డాడు..

కృష్ణుడు కారణజన్ముడు.. రామావతారంలో నరుడిగా జన్మించినా కృష్ణావతారంలో తానే దేవుడినని ప్రకటించాడు.. ప్రజలు అశాంతి, అధర్మ మార్గాల్లో పయనించినప్పుడు..  దుష్టులు చెలరేగి ధర్మం క్షీణిస్తున్న సమయంలో ధర్మ సంస్థాపనకు తాను మళ్లీ మళ్లీ పుడుతూనే ఉంటానని కృష్ణ పరమాత్మ చెప్పాడు.. దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు తగిన సమయం కోసం ఆగలేదు..  దానికోెసం పుట్టిన నాటి నుంచే పాటుపడ్డాడు..  పసి పిల్లాడిలా ఉండగానే మహిమలు ప్రదర్శించాడు.. భోగ లాలసుడిగా, నర్తకుడిగా, మహా యోధుడిగా, ప్రేమకు ప్రతిరూపంగా కృష్ణావతారాన్ని మనం చూడొచ్చు..

కృష్ణుడు మంచి రాజనీతి శాస్త్రవేత్త.. మహాభారతంలో పొలిటికల్ డైమన్షన్స్‌లో కృష్ణుడిదే కీలక పాత్ర.. సర్వ వేదాంత సారమయిన గీతా శాస్త్రాన్ని మనకి అందించిన మహాపురుషుడు.. కురుక్షేత్ర రణరంగంలో రథసారధిగా ఉంటూ అర్జునునికి గీతోపదేశం చేశాడు. అస్త్ర శస్త్రాలు త్యజించి వెన్నుచూపిన అర్జునుడిని కార్యోన్ముఖుడిని చేసిన  మార్గదర్శి..  ధర్మాన్ని రక్షించడానికి పాండవుల పక్షాన నిలిచి వారికి వెన్ను దన్నుగా నిలిచాడు..అసలు కృష్ణావతారంలో ప్రతీ ఘట్టం మన జీవితాలకు వర్తిస్తాయి.. సహాయం కోరిన వారికి ఒట్టి చెయ్యి ఎప్పుడూ చూపించలేదు. మోసాన్ని మోసంతోనే జయించాలని, ముల్లును ముల్లుతోనే తీయాలని, తగిన ఉపాయముంటే ఎంతటి అపాయం నుంచయినా బయట పడవచ్చునని రుజువు చేసి చూపాడు.

యుద్ధంలో విజయం సాధించడానికి భుజబలమే కాదు, బుద్ధిబలం ఉంటే చాలునని చూపింది కృష్ణుడే.  ఈ సూత్రం ఇవాల్టి తరానికి కూడా అతికినట్లు సరిపోతుంది.. కండ బలం కన్నా.. గుండె బలం.. బుద్ధి బలం గొప్పదని మనం మిత్రలాభం, మిత్రబేధం కథల ద్వారా తెలుసుకున్నాం కానీ.. ద్వాపర యుగంలోనే ఈ నిజాన్ని కృష్ణుడు చెప్పడమే కాదు.. చేసి చూపించాడు. దుష్ట శిక్షణ కోసం కొన్ని మహిమలు  ప్రయోగించాడు.. కౌరవుల దుర్మార్గాన్ని, దుర్బుద్ధిని దెబ్బ తీయడానికి తానే స్వయంగా సంధి వహించాడు. పాండవ పక్షపాతి అని అనిపించుకున్నా.. కౌరవులూ తనకు ముఖ్యమేనన్నట్లు నటించాడు.. కురుక్షేత్ర యుద్ధంలో  కౌరవులను తాను కావాలా లేక కోట్లది మంది సైన్యం కావాలా అని తెలివిగా ప్రశ్నించాడు.. మంద మతి అయిన దుర్యోధనుడు ఒక్క కృష్ణుడికన్నా.. కోట్లాది సైన్యం బెటర్ అనుకున్నాడు కానీ..,భగవత్ స్వరూపుడైన శ్రీకృష్ణుని శక్తిని, మహిమను గుర్తించలేకపోయాడు.. రథ, గజ, తురగ పదాతి దళాలను కౌరవుల పరం చేసి, తానొక్కడు మాత్రం పాండవుల పక్షం వహించి, వారిని విజయం వైపు నడిపించి నిరూపించాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒకటే..  సంఖ్య కాదు గొప్పది ..జ్ఞానం గొప్పది.. బుద్ధి బలం గొప్పది అని..

కృష్ణ రాయబార ఘట్టమూ అంతే.. పాండవులకు అయిదూళ్లిమ్మని అడగడం ద్వారా దుర్యోధనుడి అసలు బుద్ధిని బయట పెట్టిస్తాడు..ఇదంతా చేసింది కేవలం ధర్మ రక్షణ కోసమే.. కురు, పాండవ సంగ్రామం ఆపడానికి ప్రయత్నిస్తాడు మహాభారత కథలో..  దుష్ట శిక్షణ లక్ష్యాన్ని ఎజెండాగా పెట్టుకుని ముందుకు నడుస్తాడు. పాండవ పక్షపాతిలా కనిపించినా.. వారికీ ఏమీ చేసినట్లుండడు.. దుర్యోధనుడితోనూ మంచిగానే ఉన్నట్లు కనిపించినా.. ఏ సహాయమూ చేయడు.. ఇవన్నీ కూడా ఈ కాలానికీ  వర్తిస్తాయి. దుష్టులకు దూరంగా ఉండటమే కాదు.. అపాయంలో ఉపాయం ఎలా ఆలోచించాలో చెబుతాయి.దుర్మార్గులను చెండాడాలి.. ధర్మాన్ని నిలబెట్టాలి అని బోధిస్తాడు..  పెద్దలు తప్పులు చేస్తే పిల్లలు వాటిని అనుకరిస్తారు.. కాబట్టి లీడ్ రోల్ లో ఉండే వారు ఎంత జాగ్రత్తగా ఉండాలో కృష్ణ పరమాత్మ తన జీవితం ద్వారా చాటి చెప్పాడు..

ఇవాళ్టీతరం కృష్ణ తత్వాన్ని అర్ధం చేసుకోవడం చాలా అవసరం.. కృష్ణుడు న్యాయం వైపు ఉన్నాడు.. పరిస్థితులకి తగ్గట్లుగా ప్రవర్తించాడు... సర్వాంతర్యామే అయినా.. అందరితోనూ చాలా దూరంగా ఉన్నట్లు ఉంటాడు.. అదే సమయంలో కోరి పిలిస్తే.. క్షణాల్లో ఆదుకుంటాడు. ఏమీ తెలీనట్లే ఉంటాడు.. కానీ న్యాయం ఎక్కడుంటే అక్కడుంటాడు.. విజ్ఞానమే సర్వస్వం.. ఈ సూత్రం చెప్పినది కూడా  కన్నయ్యే..  భగవద్గీతలో జ్ఞాన సంపదని దోచుకోలేరని చెబుతాడు.. కష్టాలు, సవాళ్లు ఎదురయినప్పుడు.. ధైర్యంగా అడుగు ముందుకు వేయమంటాడు.. లక్ష్యాన్ని నిర్దేశించుకోమంటాడు.. మానసిక ధైర్యాన్ని అలవరచుకోమంటాడు.. ఇప్పటి తరంలో  వేగంతో పోటీ పడే ఉద్యోగులు, ముఖ్యంగా యువత కృష్ణాతత్వాన్ని ఒంట బట్టించుకోవాలి. పుస్తకాలు చదవడమే విజ్ఞానం కాదు.. భగవత్ తత్వాన్ని చూసిన వాడే సమదర్శకుడు అంటాడు.. మన భగవద్గీతను చూసి విదేశీయులు కూడా స్ఫూర్తి పొందుతున్నారు.. భగవద్గీతకు కులం లేదు.. మతం లేదు.. మానవాళికి వెలుగు రేఖలు చూపించే మార్గదర్శి ఆ గ్రంథం.. ఇప్పటితరం పరిష్కరించుకోలేని కొన్ని సమస్యలకి అందులో సమాధానాలు ఉన్నాయి.. కష్టాల కడలిని ఎలా ఈదాలో తెలుసుకోవాలంటే కృష్ణుడి జీవితమే ఒక ఉదాహారణ.. అందుకే ఈ తరం కూడా కృష్ణుడిని ఓ మేనేజ్‌మెంట్ గురుగా కొలుస్తోంది..

కృష్ణ తత్వం మానవాళిని ముందుకు నడిపించే మార్గం..  సమస్యల సుడిగుండంలో కూరుకుపోయిన వారికి అదొక రిలీవర్.. ఒత్తిడితో సతమతమయ్యే వారికి అదొక టానిక్.. అందుకే ప్రపంచ దేశాలు సైతం కృష్ణ తత్వంపై ఆసక్తి పెంచుకుంటున్నాయి.సమస్యలను ఛేదించే నిత్య జీవన సూత్రాలను తెలిపే గీతాసారం..  కృష్ణ తత్వం మనమూ తెలుసుకోవాలి.. ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి

ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ తనదైన శైలిలో కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో ఉన్న వాగ్దేవి విలాస్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో శ్రీకృష్ణుడి సైకత శిల్పాన్ని 2018 లో రూపొందించారు, ఇపుడు ఉందొ లేదో నాకు తెలియదు !

బాలకృష్ణుడి ఆకారంలో సుదర్శన్ పట్నాయక్ రూపొందించిన ఈ శిల్పం అప్పట్లో చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. సైకత శిల్పం ముందుభాగంలో చిన్నికృష్ణుడి రూపం, వేణువు, వెన్నముద్ద ఆకారాలను తీర్చిదిద్దాడు. కృష్ణుడి వెనకభాగంలో విశ్వంలోని సౌరకుటుంబం, నక్షత్రాలు, పాలపుంతలు.. ఇలా నీలివర్ణ శోభితంలో ఉండేలా సైకతశిల్పాన్ని రూపొందించాడు. కృష్ణం వందే జగద్గురుం అనే సందేశం పట్నాయక్ రూపొందించిన సైకత శిల్పంలో స్పష్టమవుతోంది.

ఈ విధంగా కృష్ణకధలో ప్రతి సంఘటనలో ఎంతో తత్వం దాగి ఉంది.మీకూ మీ కుటుంబానికీ గోకులాష్టమి శుభాకాంక్షలు.
💐🙏💐

కామెంట్‌లు లేవు: