26, ఫిబ్రవరి 2025, బుధవారం

యజ్ఞాలు చేస్తే

 *యజ్ఞాలు చేస్తే వర్షాలు పడతాయా?*   

                      ➖➖➖✍️

```

యజ్ఞాలు చేస్తే వర్షాలు పడతాయా అనే అంశం పై ఆమధ్య టీవీ 9 వారు  చర్చా కార్యక్రమం ఒకటి పునఃప్రసారం చేశారు. దానిలో యధాప్రకారం ఒక నాస్తికుడు, ఒక ఆధునిక శాస్త్రము చదువుకున్న వారు, మన పండితులు ఇరువురు పాల్గొన్నారు. 


నాస్తికులు “మీరు స్టూడియోలో యజ్ఞము చేసి వర్షం కురిపిస్తేనే కానీ నేను నమ్మను” అనే పంథాలోనే మాట్లాడారు.


ఇక సైంటిస్టు అనే ఆవిడ  క్లౌడ్ సీడింగ్ గురించి తనకు తెలిసిన భాషలో ఆ యాంకర్, వీక్షకులకు తెలిపే ప్రయత్నం చేసింది. 


మన పండితులు ఒకరు స్టూడియోలోనే ఉండి శ్రమపడి ‘వరుణ యాగం’  వంటివి చెబుతూంటే, యాంకరమ్మ మాములుగానే అడ్డుతగులుతూ    విషయాన్ని నాస్తికుని చేతిలో పెట్టే విఫల ప్రయత్నం చేసింది. 


కార్యక్రమం గాడి తప్పి నవ్వుల పాలయింది. 



సరే!


అసలు యజ్ఞాలు చేస్తే వర్షాలు పడతాయా? అని కదా ప్రశ్న. 


ఈ ప్రశ్నకు జవాబు తిరుమల తిరుపతి దేవస్థానపు ప్రధానాధికారిగా పనిచేసిన కీ.శే. పీ.వీ ఆర్.కే. ప్రసాదు గారు వ్రాసిన అనుభవాల సారం “నాహం కర్తా, హరిః కర్తా” అనే గ్రంధం చదవాలి. 


నేను చాలా సంవత్సరాల క్రితం చదివాను. జ్ఞాపకం ఉన్నంతవరకు విన్నవిస్తాను…


మీలో చాలామంది ఆ ఘట్టం చదివి పులకాంకితులయ్యే ఉంటారు.``` 


   *“నాహం కర్తా, హరిః కర్తా“*```


కొన్ని సంవత్సరాల క్రితం తిరుమలలో వర్షాభావం వలన చాలా పెద్ద నీటి ఎద్దడి వచ్చింది. 


పాపనాశనం డాం, ఆకాశగంగ లో కూడా నీరు అడుగంటి, తిరుపతి నుండి తిరుమల వచ్చే యాత్రీకులను రాకుండా కట్టడి చేసే పరిస్థితి వచ్చింది. 


అప్పుడు శ్రీ ప్రసాదు గారు అన్ని విధాలా ప్రయత్నాలు చేసి, నీరు తిరుపతి చుట్టుపక్కల కూడా లేకపోవడంతో  పండితులను సంప్రదించారు. 


పండితులు ’వరుణయాగం’ చేస్తే వర్షం పడుతుందని సలహా ఇచ్చారు. 


ప్రసాదు గారు మండలిలో సంప్రదించి "వరుణ యాగం" మొదలు పెట్టారు. అది నాలుగు వారాల పాటు సాగే యజ్ఞము. మాధ్యమాలలో చాలా విమర్శలు వచ్చాయి. "శ్రీవారి డబ్బు అనవసరంగా ఖర్చు చేస్తున్నారు. ఇది మూర్ఖం" అన్నారు.  మాధ్యమాల విమర్శలు లెక్క చేయక యాగం కొనసాగించారు. చివరి రోజు మాడ వీధులలో శ్రీవారు ఊరేగుతుంటే, పత్రికలవారు "ఇంత డబ్బు మూర్ఖంగా ప్రసాద్ ఖర్చు చేశాడు. వర్షం కాదు కదా ఒక్క తునక మబ్బు కూడా లేదు" అంటూ నానా విధాలుగా తూలనాడుతుంటే, ప్రసాదు గారు.. "తండ్రీ! నాకు ఇదేమి పరీక్ష" అంటూ హృదయావేదన చెందుతూ అలాగే మాడ వీధులలో రధం దగ్గరకి వచ్చేసరికి ఒక్కసారిగా నల్లటి మబ్బులు, ఉరుములు మెరుపులతో పెద్ద పెద్ద చినుకులతో వర్షం కురిసింది. అది ఎంత పెద్దవర్షం అంటే.., రధం దగ్గరనుండి శ్రీవారు మహాద్వారం దగ్గరకి వచ్చేసరికి అందరూ తడిసి ముద్దయిపోయారు. వర్షం లేదు కదా అని చత్రచామార సేవ చేసేవారు కూడా శ్రీవారికి రాచమర్యాదలు కూడా హడావుడిగా చేస్తూ కంగారు పడిపోయారు. 


ఆ కుంభవృష్టి కొన్ని గంటలపాటు సాగింది. రాత్రి ఇంజనీర్లు ప్రసాదు గారికి ఫోన్ చేసి ”సార్! పాపనాశనం, ఆకాశగంగలో నీరు పుష్కలంగా వచ్చి చేరింది. ఇక మూడేళ్ళపాటు తిరుమలలో నీటి కొరత ఉండదు" అని పలికినప్పుడు శ్రీవారి దయకు ప్రసాదు గారు పరవశించి, మరునాడు "వరుణయాగం" చేసిన పండితులను యధావిధిగా సత్కరించారు. 


ఇది శ్రీ ప్రసాదు గారు తిరుమలలో భక్తులకొరకు నిర్వహించిన వరుణయాగ ఫలితం! 


వారి అనుభవం ఆ గ్రంధంలో నిక్షిప్తం చేశారు. మన శాస్త్రాలలో చెప్పిన ఎన్నో విషయాలు విదేశాలలోనివారు  నిజమని నమ్మి ఆ శాస్త్రాల అధ్యయనం విశేషంగా చేస్తుంటే, మన టీవీ, పత్రికా మాధ్యమాలు అవి ఏవో మూఢనమ్మకాలు అని కొట్టేస్తే నష్టపోయేది మనమే అని వారు తెలుసుకోవాలి.✍️```


*“అన్నాద్భవంతి భూతాని* *పర్జన్యాదన్న సంభవః।*

*యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః* *కర్మసముద్భవః॥”*

                      -భగవద్గీత 3-14.

-సేకరణ.

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷

కామెంట్‌లు లేవు: