సదాచారము వైజ్ఞానిక విలువలు 27
డా॥ అన్నదానం చిదంబర శాస్త్రి గారు
పసుపు యాంటీబయాటిక్ అన్న విషయం అందరూ ఎరిగినదే. 'ముత్తెమంతా పసుపు ముఖమంత చాయ' అని సినీ రచయిత వ్రాసినట్లుగా ముఖానికి పసుపు మంచి కాంతినిస్తుంది. సుమంగళులు నదీస్నానం చేసేటప్పుడు తమవంటి పుణ్యస్త్రీ అయిన నదీమతల్లికి పసుపు, కుంకుమ సమర్పిస్తారు. అలా జల కాలుష్యం తొలగించినవా రవుతారు. అనంతరం ముఖానికి పసుపు రాసుకుని, శిరోజాలు విప్పి ముందుగా దోసిలితో నీటిని తలపై పోసుకుని స్నానం చేయాలి. తల తుడుచుకున్నాక జుట్టు ఆరబెట్టుకోడానికి కొసలు ముడి వేసి, ఆరబెట్టుకోవాలి తప్ప జుట్టు విరబోసుకుని ఆరబెట్టుకోరాదు. స్త్రీలు జుట్టు విరబోసుకోవడం చాలా దోషంగా చెప్పబడింది. జుట్టు విరబోసుకోవడం సమాజానికే అనర్థదాయకం. ఆ అనర్థమే నేడు నాగరికతగా పరిణమించడం ఒక దురదృష్టం..
స్త్రీలు నదీస్నానానికి వెళ్తూ ఇంటివద్దే జడలు విప్పి బయలుదేరాలి. నది వద్ద విప్పరాదు. కాన దూముడితో వెళ్ళాలి. విరబోసుకొని వెళ్ళరాదు. చేతిలో పాత్ర ఉండాలి. పసుపు కుంకుమలు తీసికొని వెళ్లాలి. నదీమాతకు సమర్పించటానికి, తనకు, అవసరమయితే ప్రక్కవారికి వినియోగించాలి. పాత్ర, పై బట్ట లేకుండుట అశుభము. ముత్తయిదువులు మునిగి స్నానం చేయరాదు. పోసుకోవాలి. జలం పై భాగాన బ్రహ్మహత్య ఉంటుంది. కాబట్టి ప్రవాహంపై నీటిని ప్రక్కను నెట్టి స్నానం చేయాలి. చాకి బండ వద్ద స్నానం చేయరాదు. నగ్నంగా స్నానం చేయరాదు. దేహం రాక్షసగ్రస్త మవుతుందంటారు. స్త్రీలు బొట్టు పెట్టుకొనేటప్పుడు
"కాశ్మీరం దధా మ్యరుణం - శోభాయమాన మాననే ! విష్ణుప్రియే ! సదా దేవి ! దేహి సౌభాగ్యతాం చ మే ||
కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం | ధారణే నాస్య శుభదం - శాంతి రస్తు సదా మమ ||"
అనేవి చదువుకొనాలి. బొట్టువల్ల లౌకిక, అలౌకిక ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. బాహ్యాభ్యంతర సౌందర్యా లున్నాయి. బొట్టు లక్ష్మీకరం. చూస్తే లక్ష్మీకళ ఉట్టిపడాలనీ, బొట్టుపెట్టుకో అనీ సూచిస్తారు. దైవకార్యాలకు బొట్టు తప్పక ఉండాలి కాబట్టే దేవాలయాలలో బొట్టుని అందరికీ అందుబాటులో ఉంచుతారు. బొట్టు పరాక్రమ చిహ్నం. బొట్టు విజయచిహ్నం కూడా. చరిత్రను పరిశీలిస్తే రాజులు యుద్ధానికి వెళ్లే సమయంలో స్త్రీలు వారికి వీరతిలకం దిద్దడాన్ని చూస్తాము.
పూజా కార్యక్రమములందు దీపారాధన స్త్రీలు చేయటమే విధి. విధానమును గ్రహించి దీపారాధన స్త్రీలు చేయాలి. పూజకు కూర్చొనేటపుడు స్త్రీలు లక్ష్మీదేవిలా ఉండాలని పెద్ద లంటారు. చినిగినవి కాని మాసినవికాని కట్టుకొనరాదు. పట్టుచీరెలు ధరించి తలలో పూలు పెట్టుకొని నిండుగా బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని పూజకు ఉపక్రమించాలి. ఆచమనము భర్తచే వేయించుకొనుట, చివరకు పరమేశ్వరార్పణలో భర్త చేతిలో నీరు తాను వేయుట స్త్రీ కర్తవ్యం. ఆచమనం కూడా భర్తకు స్త్రీయే వేయాలి అను నియమంలో కొందరు అలా చేసేవారు ఉంటారు. పురుషులు స్వయంగా ఆపోశనం, ఆసనం, శయనం వేసికొన కూడదు, కాబట్టి స్త్రీలు భర్తకు ఆసనం శయనం వేయాలి. అమ్మవారి పూజ, నోములకు సంబంధించిన పూజలు స్త్రీలే నిర్వహించుకొనాలి. అలాగే నిత్యమూ తులసీ పూజ నిర్వహించటం స్త్రీ కర్తవ్యం. అందులో ఎంతో విశేషం ఉంది. ఏ పూజకయినా ముందు దీపారాధన చేయాలి. తులసికోట ఆరుబయట ఉంటుంది. కాబట్టి గాలికి నిలపటం కష్టం. అందుకై ఇంట్లోనే దీపారాధన చేయాలి. భర్త పూజచేసే సమయములో కూడా దీపారాధన చేసే బాధ్యత స్త్రీదే. అలా దీపారాధన చేసి,
"దీపదేవి! మహాదేవి! శుభం భవతు మే సదా యావత్ పూజా సమాప్తి స్స్యాత్ తావత్ ప్రజ్ఞ్వల సుస్థిరా”
అని ప్రార్ధించాలి. సాయం సంధ్యాసమయములో దీపారాధన చేసి "దీపంజ్యోతిః పరంబ్రహ్మ, దీపం సర్వ తమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప! నమోస్తుతే" అని దీపానికి నమస్కరించాలి. అనంతరం తులసి పూజ చేయటం, అందులో భాగంగా ప్రదక్షిణాలు చేయటం, తులసి మూలంలో నీళ్ళుపోసి నెత్తిన చల్లుకొనటం వంటి వన్నీ చేస్తారు. “ఇయం సాక్షాస్మహాలక్ష్మీః" అని లక్ష్మిగా చెప్పినందున ఈ లక్ష్మీపూజ సంపత్ప్రదమే కాకుండా విశేషంగా ఆరోగ్యప్రదం. తులసి గాలివల్ల, స్పర్శవల్ల దీర్ఘకాలం జీవించవచ్చని పరిశోధకులు తెల్పారు. ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన వ్యాధులకు తులసి విశేష చికిత్స. కావుననే తులసీపూజను స్త్రీలకు విధించారు. అనేకవ్యాధులను పోగొట్టగల తులసి కాన్సరును కూడా నిరోధిస్తుందని తెల్పారు. చలిజ్వరము, జీర్ణాశయము, కాలేయ వ్యాధులకును తులసిచికిత్స ఉంది. క్రిమిసంహారకమయిన తులసిని యింటింటా నాటే వ్యవస్థను మహర్షులు ఏర్పరచటం జరిగింది. అమెరికన్ శాస్త్రజ్ఞులు తులసి బాక్టీరియా వ్యాప్తిని త్వరగా అరికడుతుందని గుర్తించారు. తులసికి పరిసరాల వాయువునంతను పవిత్రం చేసే శక్తి ఉంది. తులసి విషయంలో కొన్ని నియమాలున్నాయి. వాటిని తప్పక పాటించాలి. తులసిని కోసేటప్పుడు
"తుల స్యమృతజన్మాసి - సదా త్వం కేశవప్రియే! కేశవార్థం లునామి త్వాం వరదా భవ శోభనే॥
అని చదువుతూ కోయాలి. దాని అర్థం "ఓ తులసీ! నీవు అమృతమందు పుట్టావు. విష్ణుమూర్తి భార్యవు. నిన్ను నీ పతిఅయిన విష్ణుమూర్తి సన్నిధికి చేర్చటానికే కోస్తున్నాను. నన్ను అనుగ్రహించు" అని. లక్ష్మీ స్వరూపిణి అయిన ఆమెను తుంచటం తప్పే. ఆమె పతిని చేర్చటంకోసమే కాబట్టి ఆమె సంతోషించి అనుగ్రహిస్తుంది. అలా అనిన మనం భగవంతునకు పూజ చేసి అనంతరమే మందుకొర కయినా వినియోగించాలి. కోసి నేరుగా వాడుకొనరాదు. అలాగే పూజ చేసే తులసిచెట్టునుండి దళాలు కోయకూడదు.
వేరే చెట్టువే కోయాలి. తులసికి నీరు పోసి ఆనీటిని నెత్తిన చల్లుకొంటూ, అలాగే నమస్కరిస్తూ
“యన్మూలే సర్వతీర్థాని - యన్మధ్యే సర్వదేవతాః యదగ్రే సర్వ వేదాశ్చ - తులసి! త్వాం నమా మ్యహమ్.”
అని చదువుకోవాలి. లౌకికంగా ఆరోగ్య పరంగాను, అలౌకికంగా లక్ష్మీరూపిణిగాను అనుగ్రహించే తులసిని తప్పక ఇంటింటా నాటుకొని స్త్రీలు నిత్యం పూజించాలి. తులసితో నిత్యసంబంధం కల్గిఉండాలి. పూజ అయ్యాక ప్రదక్షిణం చేసిన అనంతరం స్త్రీలు సాష్టాంగ నమస్కారం కాక పంచాంగ నమస్కారం చేయాలి. ఆ విధానం ఇలా చెప్పబడింది.
“పాదాంగుళిభ్యాం జానుభ్యాం శిరసా చాపనీం స్పృశన్; బద్ధాంజలి ర్నమస్కుర్యాత్ స పంచాంగ ఉదీరితః |
సాష్టాంగ నమస్కారానికి బదులు స్త్రీలు ఇలా రెండు కాళ్లవేళ్లు, రెండు మోకాళ్లు, శిరస్సు ఈ ఐదు అవయవాలు భూమికి తాకేటట్లు చేసేది పంచాంగ నమస్కారం. స్త్రీలు ఇలా ఎందుకు నమస్కారం చేయా అనేటందుకు కారణాన్ని శాస్త్రం చెప్పింది.
'నత్తం గుదం చ విప్రాణాం నారీణాం స్తనమండలం – పవిత్ర గ్రంధి దర్భాంశ్చ – సోధుం న క్షమతే క్షమా!'
అంటే శంఖంయొక్క పృష్ఠము అనగా క్రింది భాగము, బ్రాహ్మణుని పృష్ఠ భాగము, స్త్రీల స్తనములు, దర్భలతో ముడివేసిన పవిత్రము, దర్భలను కూడా భూదేవి భరించలేదు. స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేస్తే వారి స్తనములు భూమికి తగులుతాయి. కాబట్టి వారు పంచాంగ నమస్కారమే చేయాలి తప్ప సాష్టాంగం చేయరాదు. పంచాంగ నమస్కారంలో మార్జాలాసనం ఇమిడి ఉంది. దానివలన జననేంద్రీయోత్తేజం కలుగుతుంది. అది స్త్రీలకు ఆరోగ్యప్రదం కూడా.
పురుషులకంటె స్త్రీల భిన్నత ప్రథమ రజస్వల, బహిష్టు, ప్రసవము అనే వానియెడ ఉంటుంది. వాటివిషయాలో సదాచారం పాటించటం స్త్రీ విషయంలో ముఖ్యమైనది. ఆడపిల్లగా శారీరకమయిన మార్పులు పొందే ముఖ్యమయిన సమయం రజస్వల అవటం. మానసికంగా కూడ అప్పటినుండి పరిణతి ఉంటుంది. తల్లి తన కుమార్తెకు ముందుగానే దానినిగూర్చి అవగాహన ఇవ్వాలి. పరాయిచోట ప్రథమరజస్వల అవటంవల్ల జీవితంలో కొన్ని చెడులకు అవకాశం ఉటుందని చెప్తారు. అనుభవములో కూడా అది యథార్థమనటానికి నిదర్శనా లున్నాయి. కాన ఆకాలంలో వీలయినంతవరకు తల్లిదండ్రులకడ స్వగృహంలో ఉండేటట్లు చూడాలి. పిల్లకు అవగాహన కల్గించటంపల్ల వెంటనే తల్లికి చెప్పటం, తగు జాగ్రత్తలు తీసికొనటం జరుగుతుంది. అలాగే సరియైన సమయాన్ని గ్రహించి సమయ దోషాలు ఉంటే వాటికి పరిహారం చేసుకొనే అవకాశం ఉంటుంది. తిథి, వార, నక్షత్ర, లగ్న, వర్జ్య, దుర్ముహూర్త దోషములు ఉంటే వాటికి తగిన పరిహారం చేసికొనాలి.
రాత్రిపూట అయినప్పుడు రాత్రి ప్రొద్దు మూడుభాగాలు చేసి మొదటి రెండు భాగములు క్రిందటిరోజుగాను, మూడవభాగంలో జరిగితే మరుసటి రోజుగాను పరిగణించాలి. ఆసమయంలో చినిగిన వస్త్రాలు, అశుభ్రవస్త్రాలతో ఉండటం మంచిది కాదు. కాబట్టి ఆకాలంలో మంచి వస్త్రాలు ధరింపజేస్తూ ఉండాలి. అందునా తెల్లటి వస్త్రాలు శుభప్రదం. ఆరోజులలో పథ్యము చాలా ముఖ్యము. అప్పటి అజాగ్రత్త జీవితాంతము ప్రభావం చూపుతుంది. కాబట్టి విధి నిషేధాలు తెలిసికొని ఆహారం ఇవ్వాలి. పులగము, బెల్లము, బెల్లముతో చేసిన పిండివంటలు ఆరోజులలో పెడతారు. అది ఆచారము కాదు. ఆరోగ్యము, ఆరోజులలో వాతం చేయకూడదు. కాబట్టి వేడిచేసే పదార్థాలు అలా వాడతారు. పాలు వాడవచ్చు కాని మజ్జిగ వాడకూడదు. ఆ నాల్గు రోజులు పరగడుపున మంచి పసుపుతో చిన్న ఉండలు చేసి తినిపించాలి. పుసుపు గుణం చాలా గొప్పది. అందులో శుచి, ఆరోగ్యం రెండూ ఉన్నాయి. అందుకే స్నానం రోజున పసుపు రాసుకొని స్నానం చేయటం, కథ చెప్పిన పసుపునీళ్ళు ఆమె వాడిన వస్తువులన్నిటిపై చల్లటం చేయించాలి. నాల్గవరోజు అట్లబంతి పెట్టటం, ఆరోజు తప్పక కంద బచ్చలి కూర చేయటం జరుగుతుంది. అదికూడా ప్రథమ రజస్వల అయిన అమ్మాయి ఆరోగ్యమును దృష్టియం దుంచుకొని ఏర్పరచిన నియమమే. ఆ నాల్గవనాడు పసుపు, నువ్వులు నేతితో కల్పి మూడు ఉండలు తింటే నాభి శీతలం పోతుంది. ఆ దశలో శీతవాత దోషములు తగిలే అవకాశం ఉంటుంది. అది చాలా ప్రమాదకారి అవుతుంది. అటువంటి సమస్యలేవీ రాకుండా ఆ నియమా లేర్పరచారు.
హిందూ ఆచారవ్యవహారాలు స్త్రీని దూరం పెట్టాయి అని విమర్శిస్తూ ఉంటారు. నిజానికి ముట్టు దోషం ఇతర మతాలు కూడా అంగీకరించాయి. పూజాపురస్కారాలు, జపతపాలు వంటి ఆధ్యాత్మిక, దైవ కార్యక్రమాలన్నిటి విషయంలో ముట్టువారిని తాకటం, దగ్గరకు రానివ్వటం దోషంగా మన శాస్త్రాలు చెప్పాయి. ఆధ్యాత్మిక గ్రంథాలేకాదు చాణక్యుడు తన అర్థశాస్త్రంలోకూడా ఋతుకాలాన్ని దాచిన స్త్రీకి, ఋతుమతి అయిన భార్యను కూడిన పురుషునకు దండన విధించాడు. ధర్మశాస్త్రాలయితే అట్టి స్త్రీలు పుణ్యకార్యక్రమాలలో పాల్గొనటం, వారిని తాకినవారు పాల్గొనటం చాలా పాపంగా చెప్పాయి. హిందూ శోత్రియ కుటుంబాలలో తప్ప ఆ నియమాన్ని ఇప్పుడు ఎవ్వరూ పాటించటం లేదు. కాని దోషమే అని గ్రహించాలి. దుర్గంధపూరితమైన ఋతుస్రావం ఆ మూడురోజులు స్త్రీలనుండి వెలువడుతుంది. అది సక్రమంగా వెడలకుండుటయే స్త్రీల అనారోగ్యా లన్నిటికీ కారణం. అది ఆగినరోజులలోనే స్త్రీలకు మెనోపాజ్ అని అనారోగ్యముల అవస్థ లుంటాయి. కాబట్టి అది చెడురక్తమనటం స్పష్టం. దానిని పౌరాణిక గాథలు బ్రహ్మహత్యాపాతకంగా చెప్తున్నాయి. విశ్వరూపుని సంహరించినందువల్ల ఇంద్రుని కేర్పడిన బ్రహ్మహత్యాపాతకాన్నిస్త్రీలుకూడా పంచుకున్నారు. ఆ బ్రహ్మహత్య స్త్రీల ఋతు రక్తమునందు ఉంటుంది.
స్త్రీల రజస్వలా కాలాన్ని "బహిష్టు" అంటారు. అంటే బహిః అంటే బయట స్థ అంటే ఉండటం. ముట్టు అంటే తాకుట అది తగదని ఆ పదాలే చెప్తున్నాయి. ఆ నాల్గురోజులు స్త్రీకి పూర్తి విశ్రాంతి నీయటం ఆమె ఆరోగ్యానికి అవసరం. ఆమె అన్నిటినీ ముట్టుకొనకుండటం మిగిలినవారి ఆరోగ్యాని కవసరం. అన్నీ దృష్టియందు ఉంచుకొని ఆరోజులలో దూరంగా ఉండే విధానమును మన పెద్దలు ఏర్పరచారు. ముట్టువారు మంచివారిని తాకటమే కాదు, మరో ముట్టు స్త్రీనికూడా తాకరాదంటే అందలి దోషం గ్రహించవలసి ఉంది. చంటిబిడ్డలను కన్నతల్లి తప్ప మరో ముట్టు స్త్రీ తాకరాదు. ఇటువంటి విషయాలపై చాల పరిశోధనలు కూడా జరిగాయి. ఒక ప్రకృతి శాస్త్ర పరిశోధకుడీవిషయంలో గుర్తించినరీతి గమనింపదగినది.
విదేశీ ప్రకృతిశాస్త్ర పరిశోధకుడు మేడమీద ఉండి క్రింద పూలతోటలో రమ్యంగా ఉన్న ఒక పూవుని చూచి పనిపిల్లతో దానిని కోసుకురమ్మని చెప్పాడు. ఆ అమ్మాయి అలాగే తెచ్చింది. కాని తాను చూచిన రమ్యత అందులో కానరాలేదు. ఏదో పొరపాటు జరిగిందని మరో పూవు మంచిది చూపి తెమ్మన్నాడు. అదీ అలాగే అయింది. ఎందుకలా అవుతోందా అని విచారిస్తే ఆ అమ్మాయి చెప్పింది. ఇలా తన చేత ఎన్నిసార్లు తెప్పించినా ఆ పూలు రమ్యత కోల్పోతాయని. తాను బహిష్టు అయి ఉన్నానని, ఆరోజులలో ఏపూవు తాకినా అలాగే అవుతుందని చెప్పింది. ఇది నీ విషయంలోనేనా స్త్రీలు అందరివిషయంలో ఇలా జరుగుతుందా? అని ఆ పరిశోధకుడు ప్రశ్నించగా “అందరికీ ఇంతే" అని ఆమె బదులిచ్చింది. అంతట ఆ పరిశోధకుడు అనేక బహిష్టు స్త్రీల రక్తం తెప్పించి మామూలు స్త్రీల రక్తంతో పోల్చి తన పరిశోధనలద్వారా స్త్రీల బహిష్టు రక్తంలో ఒకవిధమయిన విషం ఉంటుందని గుర్తించి తెల్పాడు. ఆకాలంలో వారితోడి సంసర్గంవల్ల ఆ
విషప్రభావం మగవారిపైకూడా పడుతుందని తెల్పాడు. కాబట్టి బహిష్ఠ స్త్రీలను సాధ్యమయినంత దూరం ఉంచటం అవసరమని చెప్పాడు. రజస్వల (ముట్టు) అయిన స్త్రీ తాకటంవల్ల పదార్థం విషపూరిత మౌతుందని జర్నల్ ఆఫ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 1949 అక్టోబరులో వచ్చింది. ఈవిషయం చిరకాలం పరిశోధించిన జర్మను, అమెరికా పరిశోధకులు అంగీకరించారు. ఈ విషయాలన్నీ తెలిసియే మన మహర్షులు వారియెడ నియమాలు చెప్పారు. అవి సమాజ శ్రేయస్సుకోసం ఏర్పరచినవే అని గ్రహించాలి. అత్యంతము ప్రేమించే తన భార్య, కుమార్తెల విషయంలో వారు ఆ నియమాలు పాటిస్తున్నారంటే అది ఏ ద్వేషంతోనూ కాదని, అందరి శ్రేయః కాంక్షతోనే అని గ్రహించాలి. స్త్రీలు బహిష్టు నాలుగు రోజులు ఎట్టి వ్యాయామం చేయరాదు. అలాగే గర్భవతులు 4వ నెల తర్వాత, పురుడు వచ్చిన అనంతరం నాలుగు నెలలు గడిచేదాకా క్రమంగా తగ్గిస్తూ ఆపాలి.
ఈ విషయంలో పరాశర స్మృతి 'పతితునకు ఒక బారెడు దూరంలోను, బహిష్ఠయైన స్త్రీకి రెండు బారల దూరంలోను, ప్రసవమయిన స్త్రీకి మూడు బారల దూరంలోనూ ఉండాలని తెల్పింది. భవిష్యోత్తర పురాణంలో శ్రీకృష్ణుడు బహిష్ఠ స్త్రీల విషయమై ధర్మరాజుతో చెప్పిన వృత్తాంతంచే బహిష్ఠ స్త్రీలు ఇంట్లో అన్ని వస్తువులను తాకి యింటిని దోషగ్రస్తం చేయుటవల్ల వారు అనంతరం ఎటువంటి దుస్థితులు పొందుతారో తెలుస్తుంది, కాబట్టి బహిష్ఠ స్త్రీలగూర్చి మహర్షులు చెప్పిన సదాచారం పూర్తి విజ్ఞానశాస్త్ర సమ్మతం.
ఇందుకు కొన్ని పరిహారాలు, ప్రాయశ్చిత్తాలు కూడా వారే చెప్పారు. విషయంలో తెలియక జరిగిన పొరపాట్లకు ఋషిపంచమి వ్రతం, లక్షవర్తి వ్రతం చెప్పబడ్డాయి. స్త్రీల ఋతుదోష పాపం సేతుస్నానంవల్ల కూడా పోతుంది. పెద్దవారయాక రామేశ్వరం వెళ్ళిన అక్కడ ఋతు సంబంధమయిన పాపాలకు ప్రాయశ్చిత్తం జరిపిస్తారు. ముట్టు స్నానము, బాలెంత స్నానము వంటివి సూర్యోదయం అయిన పిదపనే చేయాలి. అప్పుడే దోష పరిహారము. ధర్మ కార్యాలు, దైవకార్యాలు బహిష్ఠ అయిన స్త్రీలు చేయకుండా ఉండటమేకాక చేసేవారిని తాకటంకూడా చేయరాదు. కాబట్టి తగినంత దూరములో ఉండాలి. ఐదవ రోజు స్నానం చేసిన తరువాతే వారు అన్ని పుణ్యకార్యాలు చేయటానికి అర్హత పొందుతారు. గంగ కూడా తీసికొంటే పూర్తి పవిత్రతయే
గర్భవతిగా ఉన్న కాలంలో కూడా స్త్రీకి కొన్ని నియమాలు చెప్పబడ్డాయి. గర్భధారణ తరువాత ఐదవమాసం వచ్చేదాకా వేడిచేసే పదార్ధాలు తినకూడదు. నువ్వులతో చేసిన పదార్ధాలు, బొప్పాయికాయ వంటివి తినరాదు. అందువలన గర్భస్రావం జరిగే ప్రమాదం ఉంది. గర్భిణీ స్త్రీలు నదీస్నానాలు, సముద్రస్నానాలు, కొండలు ఎక్కటాలు చేయకూడదు. సూర్యగ్రహణము, చంద్రగ్రహణములలో జాగ్రత్తగా ఉండాలి. ఆ గ్రహణ తేజస్సు ప్రభావం అపరిపక్వ దశలో ఉన్న శిశువుపై పడితే ఆయా అవయవభాగాల అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది. అందుకే గ్రహణ సమయంలో గర్భిణీస్త్రీలను బయటకు రానీక పరుండబెడతారు. గ్రహణసమయంలో వ్యాపించే ఒక విధమయిన బాక్టీరియా, గర్భస్థంగా ఊరే రసాలుకూడా గర్భస్థ శిశువుకు ఇబ్బంది చేస్తాయి కాన ఆ జాగ్రత్తలు అవసరం. గర్భిణులు కొబ్బరికాయలు కొట్టటం, ముత్తయిదువులకు పండ్లు తమ చేతులమీదుగా ఈయటం, శంకుస్థాపన చేయటం, చెట్లు, మొక్కలు పీకివేయటం చేయరాదు. ఉపనయనంలోని కొన్ని మంత్రాలు, స్నాతకమందలి మంత్రాలు వినకూడదు. కాబట్టి అవి వినబడని దూరంలో ఉండటం మంచిది. గృహప్రవేశ సమయంలో చేసే కూష్మాండబలి అం గుమ్మడికాయ పగులగొట్టటము చూడకూడదు. వివాహసమయంల బలిమంత్రాలు, సూర్యనమస్కారాల అరుణంలోనివి కొన్ని మంత్రాల ప్రభావం గర్భస్థ శిశువుపై పడి వారికి కీడు కల్గిస్తుంది. కాబట్టి అట్టివానికి గర్భిణీస్త్రీలు దూరంగా ఉండాలి.
'నాతిచరామి' అని భర్త చెప్పాడు కాబట్టి అది పాటించాల్సినది ఆయనే అనుకోకూడదు. 'నాతిచరే త్రికరణయా భర్తారం' అని గౌతమ మహర్షి చెప్పారు. కాబట్టి స్త్రీ కూడా మనసా, వాచా, కర్మణా భర్తను అతిక్రమించకూడదు. 1840లో ఫక్కి లక్ష్మీనరసింహకవి రచించిన కుమారీశతకం అంతా స్త్రీల సదాచారాన్ని తెల్పేది. ఒకప్పుడు ప్రతి బాలికచేతా దానిని చదివించేవారు. పెనిమిటి వలదని చెప్పిన పనియెన్నడు చేయరాదు' అని మొదలుగా అందు తెల్పిన కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి. అందరిచే కొనియాడబడేటట్లు అత్తమామలకు, భర్తకు సేవ చేయాలి. బిగ్గరగా మాట్లాడటం, నిందావాక్యాలు పల్కటం తగదు. పెద్దలు వచ్చినపుడు ఆసనంనుండి దిగాలి. చెడుమార్గాన పోయే భర్త మనస్సు మంచిగా మార్చగల్గాలి. పుట్టినింటికి, మెట్టినింటికి వన్నె తేవాలి. భర్త దీనుడైనా, రాజ్యహీనుడైనా నాకు నా భర్తయే గొప్పవాడని సీత అన్నట్లు ఉండాలి. మృతియైనా బ్రతుకైనా పతితోనే సతికి చెల్లు పతిబాసిన ఆ బ్రతుకొక బ్రతుకా? తల్లిదండ్రులు, అన్నదమ్ములు బంగారంతో తులతూగుతున్నా వారి యింట స్త్రీ కలకాలం ఉండటం మర్యాద కాదు. భర్త ఏమీ అనటంలేదుకదా! అని చెడుపనులు చేయకూడదు. నీ కిష్టమయిన పనులు చేస్తున్నారని పనివాళ్ళకు ఎక్కువ చనువు ఈయవద్దు. సంధ్యాసమయంలో నిద్రపోవద్దు. దానిచే దరిద్రం ప్రాప్తిస్తుంది. వేకువజామున లేచి పాచిపనులు చేసుకో. వీధి గుమ్మంవద్ద నిలబడి ఉండక. కులదేవతలను పూజించు. అతిగా నవ్వకు. వేళాకోళం, గయ్యాళితనం, చాడీలుచెప్పడం, తగాదాలు పనికిరావు. ఎన్ని నగలున్నా పసుపు కుంకుమలు వానికి మించినవే. వడ్డనలో భేదభావాలు చూపక. ఇల్లు, ఒళ్ళు, బట్టలు, తల అపరిశుభ్రంగా ఎప్పుడూ ఉంచుకొన అసత్య మాడకు. కష్టములకు చలింపకు. అతిథులను కాదనకు.
వస్త్రాభరణములను ఎరువు తెచ్చుకోకు. తగువులాడుకొనే యింటికి లక్ష్మి రాదని గ్రహించు. నీ భర్తకు మంత్రివలె సలహాలిస్తూ, రంభవలె సుఖాన్నిస్తూ, దాసివలె సేవ చేస్తూ, తల్లివలె తృప్తిగా భోజనం పెడుతూ, భూదేవివలె ఓర్పుతో జీవించు. దీపపు నీడలో, మనిషినీడలో, మంచపు నీడలో, తాడిచెట్టు నీడలో ఎప్పుడూ నిలబడకు. తలవెంట్రుకల నుండి నీరు జారి ఇంట్లో పడనీక అని ఇలా సకలశ్రేయస్సులు, యశస్సులు పొందటానికి కావలసిన సదాచార మంతా చెప్పబడింది.
సశేషం......
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి