23, ఆగస్టు 2020, ఆదివారం

రామాయణమ్.. 39

అమ్మా ,నాన్నగారి ఆజ్ఞ ప్రకారము రేపు నాకు రాజ్యపట్టాభిషేకము !
.
మేమిరువురమూ దీక్షలో ఉండ వలె నని రాజపురోహితులు తెలిపినారు,అందుకు అవసరమైన కార్యక్రమములు నీ చేతుల మీదుగా జరిపించమ్మా అని వినయంగా తల్లిని ప్రార్దించాడు కౌసల్యానందనుడు!.
.
నాయనా నా చిరకాలపు నోములన్నీ ఫలించినవిరా నేడు !
నీవు మహారాజువై ఈ వసుంధరను పరిపాలించాలని ఆ
శ్రీ మహావిష్ణువుకు నేను పెట్టుకొన్న మొరలాలకించాడురా ఆ దేవదేవుడు! .అని దగ్గరకు తీసుకున్నది కౌసల్య తన ప్రియ పుత్రుడిని.
.
ప్రక్కనే వున్న ప్రాణాధికుడయిన తమ్ముడు లక్ష్మణుని చూసి ,లక్ష్మణా ఈ రాజ్యము నీది, ఈ రాజ్యపాలన బాధ్యత నీకోసమే నేనంగీకరించాను . నీ కిష్టమైనభోగములు ,సుఖములు అన్నీ ఆనందంగా అనుభవించు! .అని పలికి రాముడు భార్యతో కూడి దీక్షస్వీకరించటానికి తన మందిరానికి వెళ్ళిపోయాడు.
.
శ్రీరాముని మందిరానికి రాజుకోరిక మీద వశిష్ఠుడు విచ్చేశాడు .
.
రామునిచేత దీక్షాస్వీకారం ఏ విధమైన లోటుపాట్లులేకుండా జరగాలని దశరధుడి కోరిక.
.
అనుకోని అతిధి ఆగమనానికి తొందరతొందరగా తొట్రుపడుతూ వెళ్ళి ఆహ్వానించి ఆయనకు తగిన మర్యాదలు జరిపాడు రాముడు.
.
వశిష్ఠులవారు రాముని చూసి నాయనా నీవూ ,సీతా ఈ రోజు ఉపవాసదీక్షలో ఉండి దర్భలమీదనే విశ్రమించాలి .
రేపు ప్రాతఃకాలముహూర్తమందు నీకు పట్టాభిషేకం జరుగగలదు అని పలికి వైదేహీసహితుడయిన రామునికి మంత్రపూర్వకముగా ఉపవాసము చేయించాడు.
.
ఈ వార్త అప్పుడే నగరమంతా వ్యాపించింది !
ఎవరికి వారు తమకే  పట్టాభిషేకం అన్నట్లుగా కేరింతలు ,త్రుళ్ళింతలు.
.
 వీధులలో ఉత్సవాలు! అయోధ్యానగరవాసుల సంబరాలు అంబరాన్ని చుంబించాయి.అన్ని దారులు రాముడి ఇంటివైపే దౌడుతీసాయి.
.
ఎవరినోట విన్నా ఇవే ముచ్చట్లు ,
.
రాబోయే అద్భుతమైన రోజులగూర్చి ఇప్పడే కలలు !
.
ఆ కలలను గురించిన కబుర్లు!.
.
రాముడి మందిరంకోలాహంగా వున్నది!
స్వచ్ఛమైన నీటితోనిండిన  ఒక సరస్సులో వేలకొద్దీ పద్మాలు విచ్చుకుంటే చూపరులకు ఎంత ఆహ్లాదకరంగా వుంటుందో రాముని భవనంలోకి వచ్చీపోయే పురజనుల ముఖపద్మాలు విచ్చుకొని అంత ఆహ్లాదకరంగా వున్నదట!
.
జనులందరి మదిలో ఒకటే చింత !
ఇంకా తెలవారదేమి? ఈ చీకటివిడిపోదేమీ! ఎవరికీ నిద్దురలేదు...
.
 .తెల్లవారగనే తమ రాజు రాముడు ! ఈ భావనే వారిమదిలో బ్రహ్మానందాన్ని కలుగజేసింది!.
.
రాముని గృహమునుండి వచ్చిన వశిష్ట మహర్షిని చూసి దశరధుడు అన్నీ అనుకున్నట్లుగా సవ్యముగానే జరుగుతున్నవిగదా ! అని ప్రశ్నించి తెలుసుకొని  ,సభచాలించి ,
సింహం గుహలో అడుగుపెడుతున్న విధంగా అంతఃపుర ప్రవేశం చేశాడు.
.

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక
******************

కామెంట్‌లు లేవు: