23, ఆగస్టు 2020, ఆదివారం

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*



*అష్టమ స్కంధము - పదునైదవ అధ్యాయము*

*బలిచక్రవర్తి స్వర్గమును జయించుట*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*15.19 (పందొమ్మిదవ శ్లోకము)*

*హేమజాలాక్షనిర్గచ్ఛద్ధూమేనాగురుగంధినా|*

*పాండురేణ ప్రతిచ్ఛన్నమార్గే యాంతి సురప్రియాః॥6878॥*

బంగారు కిటికీల ద్వారా అగరు సుగంధములతో గూడిన తెల్లని ధూమములు బయలువెడలి అచటి మార్గములను కప్పివేయుచుండెను. ఆ మార్గములలో దివ్యభామినులు సంచరించుచుండిరి.

*15.20 (ఇరువదియవ శ్లోకము)*

*ముక్తావితానైర్మణిహేమకేతుభిర్నానాపతాకావలభీభిరావృతామ్|*

*శిఖండిపారావతభృంగనాదితాం   వైమానికస్త్రీకలగీతమంగళామ్॥6879॥*

అచ్చటచ్చట ముత్యములు గూర్చిన మేలుకట్టులు వ్రేలాడుచుండెను. మణిమయములైన బంగారు పతాకములు, చిన్న చిన్న జెండాలు రెపరెపలాడుచుండెను. నెమళ్ళ క్రేంకారములు, పావురముల మధుర ధ్వనులు, తుమ్మెదల ఝంకారములు వినసొంపుగా ఉండెను. దేవాంగనలు మధురముగా మంగళ గీతములను ఆలపించుచుండిరి.

*15.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*

*మృదంగశంఖానకదుందుభిస్వనైః  సతాళవీణామురజర్ష్టివేణుభిః|*

*నృత్యైః సవాద్యైరుపదేవగీతకైర్మనోరమాం స్వప్రభయా జితప్రభామ్॥6880॥*

ఆ నగరమున మృదంగములు, శంఖములు, నగారాలు, డోళ్ళు, వీణలు, వేణువులు, మురజములు, ఋష్టివాద్యములు శ్రావ్యముగా మ్రోగుచుండెను. గంధర్వులు, వాద్యములతో గానములను ఆలపించుచుండిరి. అప్సరసలు నృత్యములు చేయుచుండిరి. ఈ విశేషములతో అమరావతీ శోభ ఆ నగరాధిష్ఠాత్రియగు దేవి వైభవమును మించియుండెను.

*15.22 (ఇరువదియవ శ్లోకము)*

*యాం న వ్రజంత్యధర్మిష్ఠాః ఖలా భూతద్రుహః శఠాః|*

*మానినః కామినో లుబ్ధా ఏభిర్హీనా వ్రజంతి యత్॥6881॥*

ఆ పురమునందు అధర్మపరులు, దుష్టులు, ప్రాణులకుహాని గూర్చువారు, మోసకారులు, అహంకారులు, విషయలోలురు, కాముకులు, లోభులు ఎవరును ప్రవేశింపజాలరు. ఈ దోషములులేని వారు మాత్రమే ఆ పురమునందు ప్రవేశింతురు.

*15.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*తాం దేవధానీం స వరూథినీపతిర్బహిః  సమంతాద్రురుధే పృతన్యయా|*

*ఆచార్యదత్తం జలజం మహాస్వనం దధ్మౌ ప్రయుంజన్ భయమింద్రయోషితామ్॥6882॥*

దైత్యాసేనలకు ప్రభువైన బలిచక్రవర్తి తమ గొప్ప సైన్యములతోగూడి, అమరావతీ నగరమును అన్ని వైపుల నుండి ముట్టడించెను. అతడు శుక్రాచార్యుడు ఇచ్చిన మహాశంఖమును పూరించెను. ఆ శంఖధ్వని సర్వత్ర వ్యాపించి, ఇంద్రుని భార్యల హృదయములలో భయమును కలిగించెను.

*15.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*

*మఘవాంస్తమభిప్రేత్య బలేః పరమముద్యమమ్|*

*సర్వదేవగణోపేతో గురుమేతదువాచ హ॥6883॥*

బలిచక్రవర్తి పూర్తిగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన విషయమును ఇంద్రుడు గమనించెను. అందు వలన  అతడు దేవతలందరితో గూడి తమ గురువైన బృహస్పతియొద్ద చేరి అతనితో ఇట్లు పలికెను-

*15.25 (ఇరువది ఐదవ శ్లోకము)*

*భగవన్నుద్యమో భూయాన్ బలేర్నః పూర్వవైరిణః|*

*అవిషహ్యమిమం మన్యే కేనాసీత్తేజసోర్జితః॥6884॥*

మహాత్మా! నాకు పూర్వశత్రువైన బలి పూర్తిగా యుద్ధమునకు సన్నద్ధుడై వచ్చినాడు. మేము అతనిని ఎదిరించుటకు సాధ్యముకాదని అనుకొనుచున్నాము. అతనికి ఇంతటి శక్తి ఎట్లు వచ్చినదో తెలియుటలేదు.

*15.26 (ఇరువది ఆరవ శ్లోకము)*

*నైనం కశ్చిత్కుతో వాపి ప్రతివ్యోఢుమధీశ్వరః|*

*పిబన్నివ ముఖేనేదం లిహన్నివ దిశో దశ|*

*దహన్నివ దిశో దృగ్భిః సంవర్తాగ్నిరివోత్థితః॥6885॥*

ఈ సమయముస బలిచక్రవర్తిని ఎవ్వరుగూడ  ఎదుర్కొనజాలరు. అతడు ప్రళయాగ్నివలె మన మీదికి విజృంభించుచున్నాడు. నోటితో ఈ విశ్వములను కబళించి వేయుచున్నట్లును, పదిదిక్కులను మ్రింగివేయుచున్నట్లును చూపులతో    దశదిశలను దహించివేయు చున్నట్లును కనబడుచున్నాడు.

*15.27 (ఇరువది ఏడవ శ్లోకము)*

*బ్రూహి కారణమేతస్య దుర్ధర్షత్వస్య మద్రిపోః|*

*ఓజః సహో బలం తేజో యత ఏతత్సముద్యమః॥6886॥*

గురువర్యా! నా శత్రువైన బలిచక్రవర్తి యొక్క ఎదురు లేని శక్తికి కారణమేమో తెలుపుడు. అతనికి శారీరక, మానసిక, ఇంద్రియముల యొక్క బలము ఇంతటి తేజస్సు ఎక్కడినుండి వచ్చినది? వీటి కారణముననే అతడు మనపై దండయాత్రకు సిద్ధమైనట్లున్నాడు.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని పదునైదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుఫ🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319
***************

కామెంట్‌లు లేవు: