23, ఆగస్టు 2020, ఆదివారం

వినాయకుడు

మొట్టమొదటిగా పూజింపబడవలసిన దైవం వినాయకుడు. ఎందుచేత ఆయన్ని అలా ప్రారంభంలో పూజ చేయవలసి ఉంటుంది అంటే ఆయన విఘ్నకారకుడు. అలాగే విఘ్న నాశకుడు. ఆయనే విఘ్నాలు నశింప చేస్తాడు. అదేమిటి ఆయన విఘ్నాలు నశింపచేస్తాడు బాగానే ఉంది. కానీ విఘ్నాలు కలుగచేస్తాడు అన్నమాట అంత సమంజసంగా ఉంటుందా? అలా తత్త్వం ఎందుకుంటుంది? సాధారణంగా ఏదైనా కార్యక్రమం మనం ప్రారంభించినపుడు మనం చెప్పవలసిన శ్లోకం ఒకటి ఉంటుంది. ఏదైనా ఒక పెద్ద కార్యాన్ని ప్రారంభించే ముందు ఆ రోజు దినచర్యని ప్రారంభించే ముందు పూజ కార్యక్రమము మొట్టమొదట చెప్పవలసిన శ్లోకం:
“సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణికః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః
ధూమకేతుః గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః
వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కంద పూర్వజః
షోడశైతాని నామాని పఠేశృణుయాదపి
విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తథా
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే!!
ఇందులో విఘ్నేశ్వరుడికి 16నామాలు చెపుతారు. ఈ పదహారు నామాలు షోడశైతాని నామాని. విఘ్నేశ్వరుడికి ఎప్పుడూ కూడా 21 అంకెమీదే ఉంటాయి. ఏవైనా కూడా 21 అంకెమీదే ఉంటాయి. ఏకవింశతి పత్రాణి అని 21 పత్రులతో పూజ. అలాగే 21 రకముల పుష్పాలతో పూజ. అలాగే 21 సంఖ్యతో పిండివంటలు చేసి నివేదించడం అనే పధ్ధతి కూడా ఒకటి ఉంది. కానీ ఈ శ్లోకములో షోడశైతాని నామాని పఠేశృణుయాదపి అంటే 16 అంకె గురించి చెప్తున్నారు. మేము విఘ్నేశ్వరుడికి 16 నామాలు చెప్తున్నాము. ఈ 16 నామాలు కూడా మీరు చెప్పండి అని చెప్పట్లేదు. మీరు చెపితే మంచిది. చెప్పకపోతే కనీసం వినండి అంటున్నారు. మీరు చెప్పగలిగి ఉండాలి. యః పఠేశృణుయాదపి మీరు చెప్పగలిగి ఉండాలి. ఒకవేళ ఏ కారణం చేతనయినా మేము 16 నామాలు చెప్పలేము. మాకు నోరు తిరగదు అనో లేకపోతే మేము ధారణ చెయ్యలేము అనో చూసి చదవడం కూడా చేతకాదని అంటే ఇంట్లో ఈ 16 నామాలు చెప్పేవాడు తప్పకుండా ఉండాలి. ప్రతి ఇంట్లో కూడా ఈ 16 నామాలు చెప్పబడాలి. చెపితే మిగిలిన వాళ్ళు వినాలి. అంటే ఈ శ్లోకాన్ని ప్రతిరోజూ పైకే చదవాలి అని గుర్తు. ఇంట్లో మిగిలిన వారు దీన్ని చదవలేరు అంటే యింటి యజమాని దీనిని పైకి చెప్పాలి. చెపితే మిగిలిన వాళ్ళు వినవలసి ఉంటుంది. పూజ ప్రారంభం అయితే మిగిలిన వాళ్ళు వినవలసి ఉంటుంది. పూజ ప్రారంభమైతే మిగిలిన వాళ్ళు వెళ్లి అక్కడ నిలబడడం కష్టం కాదుగా. పూజ మధ్యలో ఏదైనా అంగము అంటే మాకు తెలియదండీ ఆ సమయానికి ఏడో పనిలో ఉంటాము. ఎలా వెడతాము అనచ్చు. పూజ ప్రారంభం చేసి ఘంటారావం వినబడగానే వెళ్లి అక్కడ నిలబడడం పెద్ద విశేషం ఏమీ కాదు. కాబట్టి ప్రతిరోజూ మనం ఈ 16 నామాలు చెప్పాలి. కనీసంలో కనీసం పెద్దలు చెప్తున్నప్పుడు వినాలి. 21కి కదా విఘ్నేశ్వరుడికి పూజకు వాడబడే సంఖ్య. మరి ఈ శ్లోకం దగ్గరకు వచ్చేటప్పటికి 16మాత్రమే ఎందుకు వాడారు. షోడశైతాని నామాని 21ని 16 ఎందుకు చెయ్యవలసి వచ్చింది. చంద్రుడు షోడశకళా ప్రపూర్ణుడు. చంద్రుడికి 16కళలు. 16 కళలు చంద్రుడికి ఉంటే మనిషి జీవితం కూడా 16 సంస్కారములతో ఉంటుంది. చిట్టచివరి సంస్కారం అంత్యేష్టి సంస్కారం అంటారు. 16 సంస్కారములు నడుస్తాయి. మనిషికి పుట్టుకకు పూర్వం తల్లి గర్భంలో ప్రవేశించినపుడు జరిగేటటువంటి సంస్కారము సీమంతము అంటుంటారు. కానీ అసలు నిజానికి అది సీమంతోన్నయనము ఉత్సవము. పాపట భర్త తీస్తాడు. పాపట భర్త తీసేటటువంటి సంస్కారానికి ఆ పేరు. అక్కడ ప్రారంభం చేసి శరీరము పడిపోయిన తర్వాత చేసేటటువంటి అంత్యేష్టి సంస్కారంతో 16 నడుస్తాయి. మీరొక పూజ చేశారు అనుకోండి. షోడశోపచార పూజ అంటారు. 16 ఉపచారములు తప్పకుండా ఈశ్వరుడికి నడవాలి. ఎట్టి పరిస్థితులలోను ప్రతిరోజూ 16 ఉపచారములతో ఇంట్లో పూజ చేయాలి. అసలు న్యాయంగా కొన్ని వేల ఉపచారాలు అన్ని చాతకావాలంటే 64. 64 కూడా నావల్ల కాదంటే 5 ఉపచారాలు. పంచ సంఖ్యోప చారిణి. అయిదు కూడా చెయ్యలేను అంటే క్షమాపణ లేదు. ప్రతిరోజూ గృహస్థాశ్రమంలో ఐదు ఉపచారాలు ప్రతిరోజూ తప్పకుండా చెయ్యవలసిందే. ప్రతి యింటిలో కూడా దేవతార్చన జరిగినప్పుడు ఐదు ఉపచారములతో సింహాసనం అర్చింపబడాలి. గంధపుష్పదూపదీపనైవేద్యములు అని 5 జరగాలి.

కామెంట్‌లు లేవు: