11, సెప్టెంబర్ 2020, శుక్రవారం

వేమన పద్యం

గుణయుతునకు మేలు గోరంత జేసిన,
గొండయౌను  వాని గుణము చేత,
కొండ కొలది మేలు గుణహీనుడెఱుగునా,
విశ్వదాభిరామ వినుర వేమ *

భావము =

సాధారణంగా మన సమాజంలో చాలా మంది ఏవేవో ఇబ్బందులు పడుతూ, వాటిని ఎదుర్కోవటానికి ఏదో సహాయం అడుగుతూనే వుంటారు. అలాంటి సందర్భాలలో సహాయం చేయగలిగే స్థోమత వున్నప్పుడు వెనక ముందు ఆలోచన లేకుండా సాటి మనిషిని, వీలైనంత  వరకు ఆదుకోవటమే మనిషికి పరమోత్క్రుష్టము. సహాయం పొందినవాడు గుణవంతుడైతే మనం చేసిన చిన్న సహాయాన్ని కుడా తన జీవిత పర్యంతం గుర్తుపెట్టుకుంటాడు.అదో పెద్ద సహాయంగా భావిస్తాడు, అందరికి ఆయన వల్ల నేను సహాయం పొందాను అని చెప్పుకొంటాడు.  అందుకే పెద్దలు చెపుతారు "నీవు ఎవరి ద్వారా నైనా సహాయం పొందితే నీ  జీవితాంతం మరిచిపోవద్దు అని, అదే నీవు ఎవరికైనా సహాయం చేస్తే, దాన్ని మరచిపొమ్మని. ఎంత గొప్ప మాట ఇది. మరి కొందరు గుణహీనులు,  ఓ పెద్ద సహాయాన్ని మనవల్ల పొందినా దానిని, అ ఏముందిలే అని తీసి పారేస్తారు, అది బుద్ధిహీనులు, గుణహీనులు చేసే పని .ఏది ఏమైనా మానవ సేవే మాధవ సేవగా భావించి ముందుకు పోతే ప్రతి ఫలం అ భగవంతుడు ఇస్తాడు, ఇది  ఈనాటి వేమన పద్య భావన.

మీ రాజా బాబు 

కామెంట్‌లు లేవు: