21, సెప్టెంబర్ 2023, గురువారం

రామాయణమ్ 331

 రామాయణమ్ 331

...

లంకానగర దక్షిణద్వారము వద్ద లక్షమంది యోధులు, పశ్చిమద్వారము వద్ద పది లక్షల సైనికులు,ఉత్తరద్వారమువద్ద కోటి మంది భటులు,తూరుపు ద్వారము వద్ద పదివేల మంది రాక్షసులు కాపలా కాయుచున్నారు.

.

నేను నాలుగు వంతెనలను,ప్రాకారములను మహావీరులైన రాక్షస సైన్యములో ఒక భాగమును నశింపచేసితిని.

.

మనము ,మన సైన్యము సముద్రము ఏదోవిధముగా దాటినచో లంక నాశనమైనట్లే !

.

అయినా ! రామచంద్రా సైన్యమెందులకు ?

.

నేను ,పనసుడు,అంగదుడు,మైందుడు ,ద్వివిదుడు,జాంబవంతుడు,

అనలుడు,నీలుడు ...మేము అందరమూ ఆకాశమార్గాన వెళ్ళి లంకను నాశనము చేసి సీతమ్మను తీసుకొని రాగలము అని హనుమంతుడు పలికిన మాటలు విని రాముడు ఇట్లనెను.

.

సుగ్రీవా ఇదే తగిన మూహూర్తము ఈ ముహూర్తము పేరు విజయము !

.

ఇప్పుడే బయలు దేరెదము ! సూర్యుడు ఆకాశ మధ్యమున ఉన్నాడు! నేడు ఉత్తరఫల్గునీ నక్షత్రము ! సకలసైన్యములనూ బయలుదేరదీయుము.

.

శకునములన్నియు అనుకూలముగా యున్నవి అని రాముడు అనగానే సుగ్రీవుడు అందులకు అంగీకరించెను .

.

ముందుగా ఒక లక్షసైన్యము బయలు దేరవలే ! ఆ సైన్యము మార్గమును సుగమము చేయుచూ వెడలును దానికి నీలుడు నాయకత్వము వహించును.

.

నీలా నీవు వెంటనే బయలుదేరుము మన మార్గములో కల ఆహారములు,జలములు ,ఫలములు,మూలములు రాక్షసులు కలుషితములు ,విషపూరితములు చేసిన చేయవచ్చును ! కావున వాటిని సంరక్షిస్తూ యుండుట నీవు నీసైన్యము చేయవలెను.

.

శత్రుసైనికులు ,గూఢచారులు ఎవరైనా ఉన్నారో లేదో గమనిస్తూ యుండ వలెను.

.

బలహీనులైన వారంతా కిష్కింధలోనే యుండిపోండి ! మనము చేయుకార్యము చాలా క్లిష్టమైనది !

.

జట్లు,జట్లుగా సైన్యమును నడిపించవలే అందులకు గాను  గజ,గవయ,గవాక్షులు పూనుకొనవలె.

.

సమస్త సైన్యమునకు గంధమాధనుడు ఎడమవైపు ఉండి రక్షించవలె! 

.

నేను హనుమంతునిమీద ఎక్కి ప్రయాణించెదను ,లక్ష్మణుని అంగదుడు తీసుకు రాగలడు .

.

సేన మధ్యభాగములో నేను ఉండెదను.

.

జాంబవంతుడు ,సుషేణుడు సేన మధ్యభాగమును రక్షించ గలరు.

.

అనుచూ సమస్త సైన్యము ఏ విధముగా ప్రయాణము చేయవలెనో రాముడు చెప్పగా అందుకు తగినట్లు సుగ్రీవుడు అందరినీ ఆజ్ఞాపించెను.

.

ఆ వెంటనే  వానర సైన్యమంతా గుహలనుండి ,శిఖరములనుండి లేచి ఒక్క సారిగా గాలిలోకి పైకి ఎగిరిరి.

.

ఆ వానర సేన అంతా రాముని అనుసరించి ఉత్సాహముగా బయలుదేరిరి.

.

వూటుకూరు జానకిరామారావు

కామెంట్‌లు లేవు: