1, ఏప్రిల్ 2026, బుధవారం

వడదెబ్బ నివారణా యోగాలు -

  వడదెబ్బ నివారణా యోగాలు  -


 *  ఉల్లిపాయ రసమును వంటికి పట్టించిన వడదెబ్బ నివారణ అగును.


 *  వేసవి ఎండలో నడవవలసి వచ్చినపుడు ఒక ఉల్లిపాయ టోపిలో గాని రుమాలులో గాని నడినెత్తిన పెట్టి కట్టుకొని నడిచిన వడదెబ్బ తగలదు.


 *  నీరుల్లిపాయ రసం రెండు కణతలకు , గుండె ప్రదేశములో పూసిన వడదెబ్బ తగలడం వలన కలిగిన బాధలు తగ్గును.


 *  వడదెబ్బ తగిలిన ముఖము పైన , శరీరము పైన నీళ్లు చల్లుతూ తలపైన మంచుగడ్డలు ఉంచి తాగుటకు నిమ్మరసంలో ఉప్పు కలిపి ఇవ్వవలెను.


 *  కుమ్మున ఉడికించిన మామిడికాయ రసములో ఉప్పు , జీలకర్ర కలిపి భోజనం నందు తాగుచుండిన వడదెబ్బ తగలదు.


 *  విశ్రాంతిగా పడుకోనిచ్చి ఆ తరువాత కాఫీ ఇచ్చిన వడదెబ్బ నుంచి తేరుకొందురు.


 *  48 గ్రాముల చన్నీటిలో ఒక తులము తేనె కలిపి ఇచ్చిన వడదెబ్బ నివారణ అగును.


 *  వడగళ్ళు పడినపుడు ఆ ఐస్ గడ్డలను ఏరి విభూతిలో వేసి నిలువ ఉంచి జాగ్రత్తగా దాచి ఆ విభూతిని మూడువేళ్ళకు వచ్చినంత తీసుకుని మంచినీటిలో వేసి వడదెబ్బ తగిలిన వారికి ఇచ్చిన వడదెబ్బ నివారణ అగును.


 *  తరువాణి తేటలో ఉప్పును చేర్చి ఇవ్వవలెను.


 *  తాటిముంజలు పంచదారతో కలిపి తినిపించవలెను.


 *  నాలుకకు పాత ఉశిరిక పచ్చడి రాసి పుల్లని ఆవుమజ్జిగ లో ఉప్పువేసి అన్నంలో పోసి పిసికి పిప్పిని పారవేసి ఆ రసమును తాగించవలెను .


 *  చన్నీటితో స్నానం చేయించవలెను .


 *  వేడివేడి పలచటి గంజిలో ఉప్పు వేసి తాగించవలెను .


        వడదెబ్బ తగిలినప్పుడు పైన చెప్పిన యోగాలలో మీకు వీలైనవి పాటించి సమస్య నుంచి బయటపడండి . ప్రస్తుత పరిస్థితుల్లో ఎండలు చాలా ఎక్కువ అవుతున్నాయి. వీలున్నంతవరకు బయటకి పోకుండా ఉండటం మంచిది . వెళ్ళవలసి వస్తే పైన చెప్పిన యోగాలు పాటిస్తూ జగ్రత్త వహించండి.


  

 ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 

రామాయణం - 22)

 శ్రీరామ ( వాల్మీకి రామాయణం - 22)


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 

సర్వే జనాః సుఖినో భవన్తు 🙏

       (31-3-'26 పోష్టు తరువాయి భాగము)


 

శ్రీ రాముడు, పరశురాముని నుండి వైష్ణవ ధనస్సును స్వీకరించడం అనేది ఒక అద్భుతమైన ఘట్టం.


రామాయణం మొత్తంలో రాముడు విష్ణు స్వరూపుడుగా ప్రకటితమైన సన్నివేశం ఇదొక్కటే.


అహల్యా శాప విమోచనం,

శబరి, శరభంగ మహర్షి, కబంధుడు, జటాయువు, మొదలైన వారికి ఉత్తమ లోకాలు అనుగ్రహించటం,

రావణ వధానంతరం, బ్రహ్మాదిదేవతలు రాముని విష్ణువుగా స్తుతించడం,

మొదలైన సన్నివేశములలో,రాముడి దైవత్వం స్ఫురిస్తున్నా, కావ్యం అంతా రాముడి మానవత్వానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది.

రాముడు మానవుడే అనిపించేలా వాల్మీకి మహర్షి రచన కొనసాగింది.

కేవలం ఈ ఘట్టంలోనే విష్ణువు, రాముడిగా అవతరించాడు అన్న విషయం స్పష్టంగా ప్రకటితమైంది.


 వైష్ణవ ధనస్సును ధరించిన రాముడు సాక్షాత్తూ విష్ణుమూర్తిగా బ్రహ్మాది దేవతలకు దర్శనం ఇచ్చాడు.


మహాలక్ష్మి అయిన సీత అక్కడే ఉన్నది.

ఆదిశేషుడైన లక్ష్మణుడు ఉన్నాడు.

శంఖ,చక్రములైన భరత,శతృఘ్నులు ఉన్నారు.

చేతిలో తన శార్ జ్ఞ ధనస్సు ఉన్నది.


అలా దర్శనమిచ్చిన రాముని చూడటానికి బ్రహ్మాది దేవతలు, ఋషులు, గుంపులు గుంపులుగా అక్కడికి వచ్చారు,

అని వర్ణించారు వాల్మీకి మహర్షి.


పరశురాముడు వెళ్ళగానే,

చీకటి తొలగి దిక్కులన్నీ ప్రకాశించినవి.


విష్ణుధనస్సును ధరించిన రాముని దేవతలు,ఋషులు స్తుతించారు.


అప్పుడు దివ్యమైన ఆ వైష్ణవ ధనస్సును రాముడు వరుణునకు ఇచ్చి వేశాడు.


శ్లో// గతే రామే ప్రశాంతాత్మా రామో దాశరథిర్ధనుః/

వరుణాయాప్రమేయాయ దదౌ హస్తే ససాయకం//

(ప్రశాంత మనస్సుతో కూడిన దశరథరాముడు పరశురాముడు వెళ్లిన వెంటనే, ఆ ధనస్సును, బాణమును, అప్రమేయ ప్రభావంగల వరుణుని హస్తములలో పెట్టెను).


వివాహానంతరం అయోధ్యకు వెళ్తున్న రామునకు ప్రస్తుతము ఈ ధనస్సుతో అవసరం లేదు.


రాముడి వనవాసం ప్రారంభం అయిన తరువాత మిత్రా వరుణుల తేజస్సుతో కుంభసంభవుడుగా జన్మించిన "అగస్త్య మహర్షి" ఈ ధనస్సును రాక్షస సంహారం కోసం తిరిగి రామునకు ఇచ్చాడు.


ఆ వైష్ణవ ధనస్సును ఇస్తూ అగస్త్య మహర్షి రామునితో ఇలా అన్నాడు.


శ్లో// ఇదం దివ్యం మహచ్చాపం హేమరత్న విభూషితమ్/

వైష్ణవం పురుష వ్యాఘ్ర నిర్మితం విశ్వకర్మాణా/

ఆమోఘః సూర్యసంకాశో బ్రహ్మ దత్తః శరోత్తమః//


(పురుష శ్రేష్ఠుడవైన ఓ రామా! స్వర్ణ రత్న భూషితమైన ఈ ధనస్సు విష్ణుమూర్తిది.

దీనిని విశ్వకర్మ నిర్మించాడు.

సూర్యునితో సమానంగా ప్రకాశిస్తున్న,అమోఘమైన ఈ ఉత్తమ శరము బ్రహ్మ దేవుడు ఇచ్చినది).


ఈ విధంగా పరశురాముని ద్వారా స్వీకరించిన వైష్ణవ ధనస్సును, వరుణుని వద్ద న్యాసముంచి, తిరిగి వనవాసంలో, వరుణుని అంశయే అయిన అగస్త్యుని ద్వారా,రాక్షస సంహారం కోసం రాముడు స్వీకరించాడు.


ప్రస్తుత కథాంశమునకు వద్దాం.


భార్గవ రాముడు వెళ్లిన పిమ్మట, వైష్ణవ ధనస్సును వరుణునకు ఇచ్చి, శ్రీరాముడు, వశిష్ఠుడు మొదలైన మహర్షులకు నమస్కరించాడు.


విహ్వల హృదయంతో ఉన్న తండ్రితో, నమస్కారపూర్వకంగా ఇలా అన్నాడు. 

"తండ్రీ!పరశురాముడు వెళ్లినాడు. మనము అయోధ్యాభిముఖంగా ప్రయాణం చేద్దాము.

మీరు సైన్యాన్ని ఆజ్ఞాపించండి" 


శ్లో//గతో రామ ఇతి శ్రుత్వా హృష్ట: ప్రముదితో నృపః/

పునర్జాతం తదా మేనే పుత్ర మాత్మాన మేవచ//


(దశరథ మహారాజు రాముని మాటలు విని,ఆనందంతో అతనిని కౌగలించుకొని శిరస్సుపై మూర్కొన్నాడు.

పరశురాముడు వెళ్ళిపోయాడు అన్న మాటవిని పరమానందభరితుడయ్యాడు.

తను, రాముడు మళ్లీ పుట్టినట్లుగా భావించాడు).


పిదప అందరూ ప్రయాణం చేసి అయోధ్య చేరుకున్నారు.


కౌసల్యా, సుమిత్రా, కైకేయీ లు కొత్త కోడండ్రు,జనకమహారాజు కుమార్తెలైన సీతా ఊర్మిళలను,జనకమహారాజు తమ్ముడు కుశధ్వజుని కుమార్తెలైన మాండవీ, శ్రుతకీర్తులను సాదరముగా స్వీకరించారు.


వారిని దివ్యాంబరములతోను,

పుష్పమాలికలతోను, భూషణములతోను,మంగళ కరమైన ద్రవ్యములతోను అలంకరించారు.


ఆ కొత్త కోడండ్రచేత గృహ దేవతలకు పూజలు చేయించారు.


నమస్కరింపదగిన పెద్దలందరకు నమస్కరింపజేశారు.


ధన, ధాన్యములను,గోవులను ఆ రాజకుమార్తెలచేత బ్రాహ్మణులకు దానం ఇప్పించారు.


శ్లో// గోభిర్ధనైశ్చ ధాన్యైశ్చ తర్పయిత్వా ద్విజోత్తమాన్/

రేమిరే ముదితాః సర్వా భర్త్రుభిః సహితా రహః//


(ఆ విధంగా గోవులతోను,ధన,ధాన్యాదులతోను, బ్రాహ్మణోత్తములను సంతృప్తి పరచి, పిదప ఆ రాజకుమార్తెలు తమ తమ భర్తలతో రహస్యంగా క్రీడించి ఆనందించారు).


రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు ఆనందంగా వైవాహిక జీవితాన్ని అనుభవిస్తూ, తల్లిదండ్రులను సేవలతో సంతృప్తి పరుస్తూ, తండ్రి ఆజ్ఞలను పాటిస్తున్నారు.


ఆ తరువాత కొంతకాలానికి భరతుడు తన మేనమామ యుధాజిత్తుతోను,తమ్ముడు శత్రుఘ్నునితోను కలిసి, తల్లిదండ్రులు, రామ లక్ష్మణుల అనుమతితో, మాతామహుడైన కేకయమహారాజు దగ్గర కొన్నాళ్ళు ఉండటానికి వెళ్ళాడు.


రామ లక్ష్మణులు, రాజకార్యములలో తండ్రికి సహాయపడుతూ,ఆయాకాలములలోచేయవలసిన విధులు నిర్వర్తిస్తూ, తల్లిదండ్రులను, గురువులను, పౌరులను, సంతోష పెడుతున్నారు.


(సశేషం)


                       శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష.

                 . ఓం శాన్తి శ్శాన్తి శ్శాన్తిః


శుభమస్తు.

తూములూరి మధుసూదనరావు.

1-4-'26