24, జులై 2024, బుధవారం

శ్రీ చెలువనారాయణ ఆలయం*

 🕉 "మన గుడి : నెం 388"


⚜ *కర్నాటక  : మేల్కొటే - మండ్యా*


⚜ *శ్రీ చెలువనారాయణ ఆలయం*


💠 దక్షణ భారతదేశంలోని ప్రముఖ వైష్ణవక్షేత్రాలలో కర్ణాటక రాష్ట్రంలో మెల్కోటే చెలువ నారాయణస్వామి ఆలయం ఒకటి. 


💠 వైష్ణవ, మతోద్ధారకులగు  శ్రీరామానుజులు చోళ చక్రవర్తిచే దండింపబడ్డాడు.

అప్పుడు రామానుజులు తప్పించుకుని చోళరాజ్యము నుంచి పారిపోయి మేల్ కోటలో తలదాచుకుని అక్కడ 10 సంవత్సరాల పాటు చెలువ నారాయణస్వామిని, యోగ నృసింహుని పూజించి ఉండుటవల్ల మెల్కోటే  వైష్ణవులకు 108 దివ్యదేశముల వలె ప్రముఖ వైష్ణవ క్షేత్రమైంది. 

ఈ ఆలయాన్ని తిరునారాయణ ఆలయం అని అంటారు.


🔆 *స్థలపురాణం*


💠 బ్రహ్మదేవుని కోరికపై  చెలువనారాయణ విగ్రహాన్ని సృష్టించాడు శ్రీమహావిష్ణువు.

బ్రహ్మ దేవుడు దానిని తన మానసిక పుత్ర సనత్కుమారకు అందించాడు, అతను దానిని మెల్కోటేలోని ఈ ప్రదేశంలో ప్రతిష్టించాడు. అందుకే ఇక్కడి ఉత్సవ విగ్రహానికి " సనత్కుమారులు"  అని పిలుస్తారు.


💠 బ్రహ్మ, విష్ణువును తన పూజ కోసం మరొక విగ్రహాల కోసం అభ్యర్థించాడు.

విష్ణువు పూర్వపు విగ్రహం యొక్క చిన్న రూపాన్ని బ్రహ్మకు సమర్పించాడు. త్రేతాయుగంలో , రాముడు  తన  పూజ కోసం ఒక విగ్రహం కోసం బ్రహ్మదేవుడిని అభ్యర్థించాడు, అందుకే ఈ విగ్రహం రాముడికి ఇవ్వబడింది.


💠 లవకుశులలో కుశుడు  ఈ విగ్రహాన్ని వారసత్వంగా పొందాడు మరియు దానిని యాదవ కుటుంబములో వివాహం చేసుకున్న అతని కుమార్తెకు అందించాడు. 

శ్రీకృష్ణుడు మరియు బలరాముడు, యాదవ యువరాజులు కావడంతో, ఈ విగ్రహాన్ని వారసత్వంగా పొందారు. 

ఈ విగ్రహాన్ని ఉత్సవమూర్తిగా నేటికీ ఊరేగింపుగా తీసుకువెళతారు. 

అందుకే ఈ ప్రాంతాన్ని " యాదవాద్రి"  అంటారు .


💠 ఈ దేవాలయంలో శ్రీకృష్ణ విగ్రహం మిక్కిలి సుందరమైనది. దీనినే చల్లపిళ్ల రాయ దేవాలయం అని కూడా అంటారు.

శ్రీ రామానుజులకు శ్రీకృష్ణుడు స్వప్నంలో ప్రత్యక్షమై తనను ఢిల్లీసుల్తానులు తీసుకొని పోయిరి అని చెప్పగా శ్రీరామానుజులు సుల్తానును సందర్శించుటకు వెళ్లిరి.

అచ్చట మల్తాను కుమార్తె అందమైన శ్రీకృష్ణ విగ్రహాన్ని అలంకరించి సింహాసనంపై ఉంచి ఆడుకొనుచుండెను. రామానుజులు ఆ విగ్రహము తన కిమ్మని సుల్తానుని ఆర్థించెను. సుల్తాను ఇష్టపడలేదు.


💠 రామానుజులు ధ్యాన నిమగ్నుడై యోగ శక్తితో అందరూ చూచుచుండగా చల్లపిళ్ల రాయ కృష్ణా రమ్మని పిలువగా ఆ దివ్యసుందర మూర్తి నృత్యంచేస్తూ వచ్చి శ్రీరామానుజుల ఒడిలో చేరెను. సుల్తాను మెచ్చుకుని భక్తి పూర్వకముగా ఆ విగ్రహమును రామానుజుల కిచ్చెను.

శ్రీరామానుజులు ఆ విగ్రహమును మేల్కోటకు తీసుకువచ్చి అచ్చట దేవాలయంలో ఉత్సవ విగ్రహంగా ప్రతిష్టాపించారు.


💠 మేల్కోటేలోని యోగ నరసింహ ఆలయాన్ని ప్రహ్లాదుడు స్వయంగా ప్రతిష్టించాడని నమ్ముతారు. ప్రహ్లాదుడు తపస్సు చేసిన ప్రదేశం ఇదేనని కూడా నమ్ముతారు. 

అభిషేకం సమయంలో యాత్రికులు నృసింహుని శరీరంపై సాలిగ్రామ చక్రాలు చూడవచ్చు.

పూర్తి భక్తి మరియు విశ్వాసం ఉన్నవారు నృసింహుని మూడవ కన్ను చూస్తారని స్థానికులు నమ్ముతారు. 


🔆 *కల్యాణి పుష్కరిణి*


💠 ఈశ్వర సంహిత ప్రకారం, శ్రీమహావిష్ణువు వరాహ అవతారము ధరించి మహాసముద్రం నుండి భూమిని పైకి లేపినప్పుడు అతని శరీరంపైఉన్న నీటి బింధువులు  మేలుకోటేవద్ద కొండపై పడ్డాయి. దీంతో కల్యాణి చెరువు ఆవిర్భవించింది. పద్మపురాణంలో కల్యాణిపుష్కరిణి ప్రస్తావనఉంది.


🔆 ,*వైరముడి ఉత్సవం*


💠 ఈ ఆలయంలో  అట్టహాసంగా జరిపే వైరముడి ఉత్సవాలకు ఎంతో ప్రాధాన్యత వుంది. వైరముడి అంటే అర్ధం వజ్రాలు పొదిగిన కిరీటం అని.

ఈ కిరీటంలో పొదిగిన వజ్రాలకు వెల కట్టలేమంటారు. బంగారంలో ఈ వజ్రాలు పొదగ బడి వుండే ఈ కిరీటాన్ని స్వామి వారికి అలంక రించడాన్నే వైరముడి ఉత్సవం అంటారు.

ఈ కిరీటాన్ని పాల సముద్రంలో శయనించి వుండే విష్ణు మూర్తి ధరించిన కిరీటంగా భావిస్తారు.

ఈ కిరీటాన్ని సంవత్సరంలో ఈ ఉత్సవాలు జరిగే సమయంలో మాత్రమే స్వామి వారికి అలంకరిస్తారు. ఆ తర్వాత తీసివేస్తారు.


🔆 సూర్యకిరణాలు పడనివ్వరు


💠 వైరముడి ఉత్సవాలుగా పిలవబడే ఈ 

బ్రహ్మోత్సవాలలో మరొక విశేషం కూడా వుంది. ఈ కిరీటాన్ని సూర్యకిరణాలు తాకకూడదట. అందువల్లే సూర్యాస్తమయం అయిన తర్వాతే స్వామి వారికి ఈ కిరీటాన్ని అలంకరించి తిరువీధులలో ఊరేగిస్తుం టారు. 


💠 వైరముడి ఉత్సవంలో మరొక విశేషం వుంది. చెలువ నారాయణస్వామికి అలంకరించే వజ్రాలు పొదిగిన కిరీటాన్ని స్వామి వారికి అలంకరించే వరకూ ఎవ్వరూ చూడరాదట. చివరకు ప్రధాన అర్చకుడు సైతం స్వామి వారికి అలంకరించేవరకు కిరీటాన్ని నేరుగా కళ్లతో చూడరాదట.

అందువల్లే ఈ కిరీటాన్ని శ్రీవారికి అలంకరించే సమయంలో ప్రధాన అర్చకుడు ఒక వస్త్రాన్ని కళ్లకు గంతగా కట్టుకొని మరీ స్వామివారి తలపై అలంకరిస్తారు.  ఆ తర్వాతే ఆ కిరీటాన్ని చూసే అవకాశం అర్చకులకు లభిస్తుంది. 


💠  ఆనాడు ఈ కిరీటాన్ని ధరించి వుండే స్వామి వారిని దర్శించుకొన్నట్లయితే సాక్షాత్తు పాల కడలిలో శయనించి వున్న నారాయణుడుని చూసినంత ఫలితం లభిస్తుందంటారు. 


💠 మైసూరుకు సుమారు 50.కి.మీ, బెంగుళూరు నుండి 130 కి.మీ.

కామెంట్‌లు లేవు: