9, సెప్టెంబర్ 2020, బుధవారం

*నీ పాద కమల సేవయు

*ఓం నమో భగవతే వాసుదేవాయ*

సందేహం;- జీవితం సఫలం కావడానికి మనం భగవంతుడిని ఏమి కోరుకోవాలి?

సమాధానం;- ఇది మంచి ప్రశ్న. ఒక సంఘటనలోకి వెళ్ళి దీనికి సమాధానం తెలుసుకుందాం.

కంసుని ఆహ్వానంపై అక్రూరుడితో బలరాముడు, కృష్ణుడు రేపల్లె నుండి మధురకు వచ్చారు. రాజవీధిలో నడుస్తున్నారు. మాలలు కట్టే సుదాముడింటికి వచ్చారు. అతని మాలా సత్కారంతో వారు సంతోషించారు. అపుడు శ్రీకృష్ణుడు సుదాముడి భుజంపై చేయివేసి *ఏం కావాలో కోరుకో* అని అప్యాయంగా అడిగాడు. అపుడు శ్రీకృష్ణుడు సాక్షాత్ భగవంతుడే అని తెలిసినా సుదాముడు ఏమడిగాడు? మడులా, మాన్యాలా? వనాలా, భవనాలా, వజ్రాలా, వైఢూర్యాలా? అందాల అతివలా, అష్టైశ్వర్యాలా? ఇవేం కోరుకోలేదు. మరేం కోరుకున్నాడు?

*నీ పాద కమల సేవయు*
*నీ పాదార్చకుల తోడి నెయ్యమును, నితాం*
*తా పార భూత దయయును*
*తాప సమందార నాకు దయసేయగదే!*

"సదా నీ సేవాభాగ్యం ఇలాగే కల్పించు స్వామీ! అదే పదివేలు. తనకంటే తన భక్తులను ప్రేమించేవారంటే భగవంతుడికి ప్రీతి. అదుగో అటువంటి స్వామి భక్తులతోనే తాను సహవాసం చేయాలి. అంతేనా ఎల్లవేళలా సర్వప్రాణుల పట్ల తాను దయగలిగి ప్రవర్తించాలి. తాపసులకు, సాధు జనులకు కల్పవృక్షం వంటి వాడా ఇవే నాకు అనుగ్రహించమని నిన్ను వేడుకుంటున్నాను"

అని నమస్కరించాడు సుదాముడు. జీవితం సార్ధకం కావడానికి ఎవరైనా ఇంతకంటే కోరదగిన దేముంటుంది?

*జై శ్రీకృష్ణ*

కామెంట్‌లు లేవు: