9, సెప్టెంబర్ 2020, బుధవారం

"అన్నం పరబ్రహ్మస్వరూపం"

"అన్నం పరబ్రహ్మస్వరూపం" అని ఎందుకు అంటారు?
ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు ఎప్పుడన్నా అన్నం వదిలేస్తే పెద్దవాళ్ళు అన్నం అలా పారవేయకూడదు, "అన్నం పరబ్రహ్మస్వరూపం" అని అంటారు. అలా ఎందుకు అంటారు అని ఎప్పుడన్నా పెద్దవాళ్ళను అడిగినా చిన్నపిల్లలు 100శాతం నమ్మేలా కారణం చెప్పరు. నిజానికి ప్రతి జీవి పుట్టకముందే ఆ జీవికి కావలసిన ఆహారపదార్ధాలు ఈ భూమి మీద పుట్టిస్తాడు ఆ భగవంతుడు.అందుకే ఏ జీవి ఈ నేల మీద పడ్డా నారు పోసిన వాడు నీరు పోయకపోడు అని భగవంతుని గురించి పెద్దవాళ్ళు అంటారు. అంటే మనము ఈ భూమి మీద పడకమునుపే మనకు ఇంత ఆహారం అనీ, ఇన్ని నీళ్ళు అని ఆ భగవంతుడు మన పూర్వజన్మలో చేసిన పాపపుణ్యాల లెక్కలు వేసి ఆహారాన్ని, నీళ్ళను, మనము ఎవరికి పుట్టాలో కూడా నిర్ణయించి ఈ భూమి మీదకు పంపుతాడు. ఎప్పుడైతే ఒక జీవికి ఆయన ప్రసాదించిన నీళ్ళు, ఆహారం అయిపొతాయో ఆ జీవికి ఈ భూమి మీద నూకలు చెల్లి ఆ జీవికి ఆయువు పూర్తి అయిపోతుంది.
అందుకే మీకు పెట్టిన ఆహారం కానీ నీళ్ళు కానీ వృధా చేయకుండా నీకు అక్కరలేదు అనిపించినప్పుడు ఎవరికన్న దానం ఇవ్వడం వలన నీకు పుణ్యఫలం పెరిగి నీకు ఇచ్చిన ఆహారం కానీ నీళ్ళు కానీ మరి కొంచం పెరిగి ఆయుష్మంతుడవు అవుతావు.లేదా నీకు అని ఆ దేవదేవుడు ఇచ్చిన ఆహారాన్ని నేలపాలు చేస్తే నీకు లెక్కగా ఇచ్చిన ఆహారం తరిగి నీ ఆయువు తరిగిపోతుంది. ఏ తల్లి అయినా చూస్తూ చూస్తూ బిడ్డ ఆయువు తరిగిపోవడం చూడలేక అన్నం పారవేయకు అని పదిసార్లు చెబుతుంది, అవసరమైతే దండిస్తుంది. ఇదంతా మీకు వివరంగా చెప్పలేక అన్నం పరబ్రహ్మస్వరూపం పారవేయవద్దు అని మాత్రమే చెబుతారు.
అందుకే అన్ని దానాలలోకి అన్నందానం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ భూమి మీద ఉన్న ఏ జీవికైనా ఆహారం పెడితే కడుపునిండా తిని నిండు మనస్సుతో పెట్టినవారిని ఆశీర్వదిస్తారు.
అన్నదాత సుఖీభవ!!!🙏🙏
🙏ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే మిమ్మల్నీ కాపాడుతుంది🙏

కామెంట్‌లు లేవు: