4, సెప్టెంబర్ 2020, శుక్రవారం

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం


*అష్టమ స్కంధము - ఇరువది ఒకటవ అధ్యాయము*


*శ్రీమహావిష్ణువు బలిని పాశములచే బంధించుట*


*ఓం నమో భగవతే వాసుదేవాయ*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*21.27 (ఇరువది ఏడవ శ్లోకము)*


*హాహాకారో మహానాసీద్రోదస్యోః సర్వతోదిశమ్|*


*నిగృహ్యమాణేఽసురపతౌ విష్ణునా ప్రభవిష్ణునా॥7121॥*


సర్వ శక్తిమంతుడైన శ్రీమహావిష్ణువు ఈ విధముగా బలిచక్రవర్తిని బంధింపజేసెను. అంతట పృథ్వి, ఆకాశము, సకల దిక్కులయందు హాహా కారములు చెలరేగెను.


*21.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*


*తం బద్ధం వారుణైః పాశైర్భగవానాహ వామనః|*


*నష్టశ్రియం స్థిరప్రజ్ఞముదారయశసం నృప॥7122॥*


రాజా! బలిచక్రవర్తి వరుణపాశములచే బంధింపబడి సంపదనంతయు కోల్పోయెను. అయిననూ అతని వివేకజ్ఞానము స్థిరమైయుండెను.అందరూ అతని ఉదారకీర్తిని కొనియాడుచుండిరి. అపుడు శ్రీహరి బలితో ఇట్లనెను-


*21.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*


*పదాని త్రీణి దత్తాని భూమేర్మహ్యం త్వయాసుర|*


*ద్వాభ్యాం క్రాంతా మహీ సర్వా తృతీయముపకల్పయ॥7123॥*


"దైత్యరాజా! నీవు నాకు మూడడుగుల భూమిని వాగ్దానము చేసితివి. రెంఢు అడుగులతో నేను ముల్లోకములను ఆక్రమించితిని. మూడవ అడుగును ఎచట తీసికొనవలెనో తెల్పుము".


*21.30 (ముప్పదియవ శ్లోకము)*


*యావత్తపత్యసౌ గోభిర్యావదిందుః సహోడుభిః|*


*యావద్వర్షతి పర్జన్యస్తావతీ భూరియం తవ॥7124॥*


సూర్యకిరణ కాంతి ప్రసరించువరకూ, నక్షత్రముల, చంద్రుని కిరణములు వెలుతురును వెదజల్లునంతవరకును, మేఘము ఎంత వరకు వర్షించుచుండునో అంతవరకును, నీ రాజ్యము విస్తరించియుండెను.


*21.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*


*పదైకేన మయాక్రాంతో భూర్లోకః ఖం దిశస్తనోః|*


*స్వర్లోకస్తు ద్వితీయేన పశ్యతస్తే స్వమాత్మనా॥7125॥*


నీవు చూచు చుండగనే ఒక అడుగుతో భూమండలమును ఆక్రమించితిని. రెండవ అడుగుతో ఆకాశమును, సకల దిక్కులను ఆక్రమించితిని. ఈ విధముగా నీ సంపదలన్నియునూ నావశమైనవి.


*21.32 (ముప్పది రెండవ శ్లోకము)*


*ప్రతిశ్రుతమదాతుస్తే నిరయే వాస ఇష్యతే|*


*విశ త్వం నిరయం తస్మాద్గురుణా చానుమోదితః॥7126॥*


మూడడుగుల భూమిని నాకిచ్చెదనని నీవు ప్రతిజ్ఞ చేసియుంటివి. ఆ మాటను నెరవేర్చ లేకపోయితివి. కావున, నీవు నరకములో నివసించవలసి యుండును. నీ గురువగు శుక్రాచార్యుడు గూడ దీనిని సమ్మతించియుండెను. ఇక, నీవు నరకములో నివసింపుము.


*21.33 (ముప్పది మూడవ శ్లోకము)*


*వృథా మనోరథస్తస్య దూరే స్వర్గః పతత్యధః|*


*ప్రతిశ్రుతస్యాదానేన యోఽర్థినం విప్రలంభతే॥7127॥*


యాచకునికిచ్చిన మాటను నెరవేర్చక మోసగించిన వాని మనోరథములు వ్యర్థములగును. అతనికి స్వర్గప్రాప్తి కలుగదు సరికదా, అతడు నరకములో పడవలసి వచ్చును.


*21.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*


*విప్రలబ్ధో దదామీతి త్వయాహం చాఢ్యమానినా|*


*తద్వ్యలీకఫలం భుంక్ష్వ నిరయం కతిచిత్సమాః॥7128॥*


'నేను చాల సంపన్నుడను' అని నీరు గర్వించుచుంటివి. నీవు నాకు దానమిచ్చెదనని ఆ మాటను నెరవేర్చలేకపోయితివి. ఈ ప్రతిజ్లా భంగమునకు ఫలముగా నీవు కొన్ని సంవత్సరములు నరకయాతనలను అనుభవింపుము.


*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే ఏకవింశోఽధ్యాయః (21)*


ఇది భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధమునందు ఇరువది ఒకటవ అధ్యాయము (21)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుఫ🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319

కామెంట్‌లు లేవు: