6, సెప్టెంబర్ 2020, ఆదివారం

స్వామివారితో అనుభవాలు.. మారిన మనసు..

మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..
మారిన మనసు..

"దత్తాత్రేయ స్వామి వారి సమాధి మందిరాన్ని దర్శించాలని చాలా రోజులనుంచి అనుకుంటున్నామండీ..కానీ ఎప్పుడూ కుదరటం లేదు..ఈసారి శనివారం నాడు వద్దామని నిర్ణయించుకున్నాము..టిక్కెట్లు కూడా బుక్ చేసుకున్నాము..శనివారం ఉదయం కందుకూరుకు వచ్చి, అక్కడనుండి నేరుగా మాలకొండకు వెళ్లి, ఆ మాల్యాద్రి లో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి దర్శనం చేసుకొని..ఆ కొండమీద శ్రీ దత్తాత్రేయ స్వామివారు తపస్సు చేసుకున్న పార్వతీదేవి మఠం, శివాలయం కూడా చూసి..సాయంత్రానికి మొగలిచెర్ల చేరుతాము..సాయంత్రం పల్లకీసేవ లో పాల్గొంటాము..ఆ ప్రక్కరోజు ఆదివారం ఉదయాన్నే..స్వామివారి సమాధిని దర్శించుకొని..తిరుగు ప్రయాణం అవుతాము..ఇదీ స్థూలంగా మా ప్రయాణం గురించిన వివరణ.. మాకు అక్కడ శనివారం సాయంత్రం నుంచీ వుండటానికి ఒక గది కేటాయించగలరా?.." అని బెంగుళూరుకు చెందిన సత్యవతి గారు ఐదారు వారాల క్రిందట ఫోన్ లో అడిగారు..ఆరోజు సోమవారం కనుక, శనివారం నాటికి గది కేటాయిస్తానని చెప్పాను..సంతోషం తో ధన్యవాదములు తెలిపారు..

అనుకున్న విధంగానే సత్యవతి గారి కుటుంబం శనివారం సాయంత్రానికి మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం వద్దకు చేరారు..సత్యవతి గారు, ఆవిడ భర్త రామమూర్తి గారు..వాళ్ళ ఇద్దరు పిల్లలు..ఒక కుమార్తె, ఒక కుమారుడు..మొత్తం నలుగురూ వచ్చారు..పిల్లలిద్దరూ ఇంజినీరింగ్ పూర్తి చేశారు..కూతురు బెంగుళూరు లోనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ఉద్యోగం చేస్తోంది..కుమారుడు ఇంకా ఉద్యోగ ప్రయత్నాల్లో వున్నాడు..

పల్లకీసేవ సమయానికి ఓ గంట ముందు సత్యవతి గారు, ఆవిడ భర్త గారు నా వద్దకు వచ్చి.."మా బెంగ అంతా మా అమ్మాయి గురించే నండీ..మంచి ఉద్యోగం చేస్తోంది..ఇప్పుడు పాతికేళ్ల వయసు వచ్చింది..వివాహం చేద్దామని ప్రయత్నాలు చేస్తుంటే..వద్దని చెపుతున్నది..తనకా ధ్యాసే లేదంటోంది..పెళ్లి చేసుకోనని భీష్మించుకుని వున్నది.. ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలి కదండీ..మొగలిచెర్ల స్వామి వారి గురించి ఈమధ్య చదువుతూ వున్నాము..అందుకని ఈ స్వామివారి వద్ద మ్రొక్కుకుంటే..ఫలితం వుంటుందేమోనని ఆశతో ఇంతదూరం వచ్చాము..అమ్మాయి తో కేవలం ఒక దేవాలయ దర్శనానికి మాత్రం వెళుతున్నామని చెప్పాము..ఇలా తన వివాహం గురించి కోరికతో వెళుతున్నామని తెలిస్తే..నానా యాగీ చేసి..తాను రాదు సరికదా..మమ్మల్ని కూడా పోనివ్వదు.. " అని బాధతో చెప్పుకున్నారు ఆ దంపతులు..

"మీరు ముందు పల్లకీ సేవలో పాల్గొనండి..రేపు శ్రీ స్వామివారి సమాధి వద్ద..మీ మనసులోని కోరికను కోరుకోండి..ఆపైన శ్రీ స్వామివారి దయ..మీ ప్రాప్తం.." అని చెప్పాను..సరే అన్నారు..

సాయంత్రం పల్లకీ సేవ వద్ద నలుగురూ కూర్చున్నారు..పల్లకీ ని రామమూర్తి గారు, వాళ్ళ అబ్బాయి ఇద్దరూ మూడు ప్రదక్షిణాలు పూర్తయ్యేదాకా మోసారు..ఆ రాత్రికి మందిరం లోనే నిద్ర చేస్తామని చెప్పారు..ఆరోజు భక్తులు కూడా విపరీతంగా వచ్చారు..అంతమంది భక్తుల మధ్యలోనే..ఆ దంపతులు మందిరం లో పడుకున్నారు..తెల్లవారుఝామున లేచి..గబ గబా స్నానాదికాలు ముగించుకొని..శ్రీ స్వామివారి ప్రభాత పూజకు వచ్చారు..నలుగురూ మంటపం లో కూర్చున్నారు..

శ్రీ స్వామివారి సమాధికి అభిషేకం హారతులు పూర్తయిన తరువాత..సత్యవతి గారి కుటుంబం శ్రీ స్వామువారి విగ్రహం వద్ద పూజ చేయించుకొని..లోపల సమాధి వద్దకు వెళ్లి నమస్కారం చేసుకున్నారు..ఆ దంపతులిద్దరూ శ్రీ స్వామివారి సమాధికి తల ఆనించి..మనస్ఫూర్తిగా మ్రొక్కుకున్నారు..అప్పటిదాకా మౌనంగా అన్నీ చూస్తున్న ఆ అమ్మాయి కూడా శ్రీ స్వామివారి సమాధికి తల ఆనించి కళ్ళుమూసుకుని ప్రార్ధన చేసుకున్నది..అందరూ ఇవతలికి వచ్చేసారు..కొద్దిసేపు మంటపం లో కూర్చుని..తిరిగి నా వద్దకు వచ్చి.."ప్రసాద్ గారూ దర్శనం బాగా అయిందండీ..చాలా ప్రశాంతంగా ఉంది..అన్నీ కుదిరితే..మళ్లీ వస్తాము.." అన్నారు..

"ఏం బాబూ..నువ్వేం కోరుకున్నావు?.." అబ్బాయిని అడిగాను.."ఉద్యోగం కోసం కోరుకున్నాను అంకుల్!.." అన్నాడు.."ఏమ్మా..మరి నువ్వో.." అని ఆ అమ్మాయిని అడిగాను..
ఎందుకో తటపటాయించింది..చెప్పడానికి ఇష్టం లేదేమో అని అనుకున్నాను.."ప్రసాద్ గారూ..ఇక మేము బైలుదేరుతామండీ..నెల్లూరు వెళ్లి, అక్కడనుండి రాత్రికి బెంగుళూరుకు వెళతాము.." అని చెప్పి వెళ్లిపోయారు..సరే అని నేనూ నా పనిలో ఉండిపోయాను..

అరగంట గడిచింది..ఊరికి వెళతామని చెప్పిన సత్యవతి గారు, రామమూర్తి గారు మందిరం లోకి వచ్చారు.."ఇంకొక్కసారి శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లివస్తామండీ.." అన్నారు..సరే అన్నాను..నలుగురు లోపలికి వెళ్లి వచ్చారు..ఈసారి ఆ దంపతుల ముఖం లో సంతోషం కనబడుతున్నది.."ప్రసాద్ గారూ..అమ్మాయి వివాహానికి ఒప్పుకున్నది..సంబంధాలు చూడమని చెప్పింది..తానే స్వయంగా మాతో ఇప్పుడే గది లో చెప్పింది..స్వామివారి దయ ఇంత త్వరగా మామీద ప్రసరిస్తుందని అనుకోలేదండీ..ఎంతో ఆనందంగా వుందండీ.." అన్నారు..అమ్మాయి వైపు చూసాను..అవునన్నట్లు తలవూపింది.."ఇప్పుడు నెల్లూరు ప్రయాణం మానుకున్నామండీ..మధ్యాహ్నం దాకా ఇక్కడే స్వామివారి సన్నిధిలో గడిపి..నేరుగా ఇక్కడినుంచే బెంగుళూరుకు వెళతాము.." అన్నారు..

కొంతమంది కోరుకున్న కోరికలు ఆ నిమిషం లోనే నెరవేరుతాయి..ఆ కోవకు చెందిన వారే సత్యవతి రామమూర్తి దంపతులు..డిసెంబర్ ఆఖరి వారం లో వాళ్ళ అమ్మాయి వివాహం అనీ..తప్పకుండా వివాహానికి వచ్చి, ఆశీర్వదించి వెళ్ళమని నన్ను కోరారు..సరే అన్నాను..వివాహం కాగానే తరువాతి ఆదివారం నాడు వధూవరులను మొగలిచెర్ల కు తీసుకువచ్చి..శ్రీ స్వామివారి దర్శనం చేయిస్తామని..ఆరోజు అన్నదానానికి అయ్యే మొత్తం ఖర్చు తామే భరిస్తామని కూడా చెప్పారా దంపతులు..అనుకున్న విధంగానే వివాహం అయిన ప్రక్క ఆదివారం నాడు నూతన దంపతులను తీసుకొని , శ్రీ స్వామివారి మందిరానికి వచ్చారు..ఆ ఆదివారం అన్నదానం ఆ దంపతుల చేతుల మీదుగా జరిపించారు..రామమూర్తి, సత్యవతి గార్ల సంతోషానికి అవధులు లేవు..శ్రీ స్వామివారే వాళ్ళ కూతురు వివాహం జరిపించాడని పదే పదే చెప్పుకున్నారు..

సర్వం..
శ్రీ దత్తకృప!.

(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్: 523 114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: