6, సెప్టెంబర్ 2020, ఆదివారం

పురాణాలలో బ్రహ్మాండాన్ని

 పురాణాలలో బ్రహ్మాండాన్ని కొన్ని లోకాలుగా విభజించారు. ఇవన్నీ విరాట్‌పురుషుని (విశ్వరూపుని) శరీరంలోని అవయవాలుగా భావించారు. మహాభాగవతం రెంవ స్కంధంలో ఈ లోకాల గురించి వర్ణన ఉంది. మొత్తం పదునాలుగు లోకాలనీ, వాటిలో ఊర్ధ్వలోకాలు (పైనున్నవి) ఏడు, అధోలోకాలు (క్రిందనున్నవి) ఏడు అనీ చెబుతారు.

 లోకాల విభజన గురించి భాగవతంలో ఇలా చెప్పబడింది. బ్రహ్మాండంలో కొన్ని అంతరాలున్నాయి. తత్వ పదార్ధాల సూక్ష్మ, సూక్ష్మతర అవస్థలనుబట్టి ఈ భేదాలు ఏర్పడుతున్నాయి. క్రింది లోకాలకంటే పై లోకాలలో తత్వ పదార్ధాలు సూక్ష్మతరంగా ఉంటాయి. లోకాలు మూడని కొందరు, ఏడని కొందరు, పదునాల్గని కొందరు అంటుంటారు.

లోకాలను బ్రహ్మాండ శరీరానికి అవయవాలుగా భావిస్తే. మొదటి భావన ప్రకారం కటి(మొల)నుండి పైభాగం ఏడు అవయవాలుగా, క్రింది భాగం ఏడు అవయవాలుగా మొత్తం పదునాల్గులోకాలు.

రెండవ భావన ప్రకారం భూలోకం పాదాలు, భువర్లోకం నాభి, సువర్లోకం హృదయం, మహర్లోకం ఉరోభాగం, జనలోకం కంఠం, తపోలోకం పెదవులు, బ్రహ్మలోకం మూర్ధంగా బ్రహ్మాండ శరీరానికి అవయవాలు రూపొందాయి.

 మూడవ భావన ప్రకారం భూలోకం పాదాలు, భువర్లోకం నాభి, స్వర్లోకం శిరస్సుగా మూడే లోకాలు ఉన్నాయి. బ్రహ్మాండపురుషుడే సమస్త లోకాలను భరిస్తాడు, పోషిస్తాడు, తనలో లయం చేసుకొంటాడు.

ఊర్ధ్వలోకాలు
1) భూలోకం
2) భువర్లోకం
3)సువర్లోకం
4)మహర్లోకం
5)జనలోకం
6)తపోలోకం
7)సత్యలోకం

అధోలోకాలు
1) అతలం=మయుడి కుమారుడైన బలుడి వినోద స్థానం.

2)వితలం=హాఠకేశ్వరుడు భవానీ అమ్మవారితో వినోదిస్తుంటాడు.హాఠకి నదీ జలాలతో తయారైన సువర్ణంతో అసుర స్త్రీలు అలంకరించుకొంటుంటారు.

3)సుతలం=బలి చక్రవర్తి స్వర్గంలో ఉండే ఇంద్రుడు అనుభవించే భోగాలకన్నా ఎక్కువ భోగాలను అనుభవిస్తూ వైభవంగా పాలిస్తుంటాడు.

4)రసాతలం= మయుడు రాక్షసులుండే పట్టణాలను నిర్మిస్తుంటాడు. దానవ దైత్యులు, నివాతకవచులు, కాలకీయులు ఉంటారు. వీరంతా మహా సాహసవంతులు.

5)మహాతలం=కద్రువకు జన్మించిన సర్పాలుంటాయి. కుహుడు, తక్షకుడు, కాళేయుడు, సుషేణుడులాంటి గొప్ప గొప్ప సర్పాలన్నీ గరుత్మంతుని భయంతో బయటకు రారు.

6)తలాతలం=రుద్రుడి రక్షణలో ఉంటుంది.

7)పాతాళం=నాగజాతి వారుంటారు. వాసుకి, శంఖుడు, కులికుడు, ధనుంజయుడులాంటి మహా నాగులన్నీ గొప్ప గొప్ప మణులతో ప్రకాశిస్తుంటాయి. ఆ పాతాళం అడుగునే ఆదిశేషుడుండేది. ముఫ్పై వేల యోజనాల కైవారంలో చుట్టచుట్టుకుని ఉంటాడు. ఆదిశేషుడి పడగ మీద ఈ భూమండలం అంతా ఒక ఆవగింజంత పరిమాణంలో ఉంటుంది. ప్రళయకాలంలో ఆ ఆదిశేషుడే ఏకాదశ రుద్రులను సృష్టించి సృష్టి అంతా లయమయ్యేలాగా చేస్తుంటాడు.

 ఈ ఏడు అథోలోకాలు ఒక్కోక్కటి పదివేల యోజనాల వెడల్పు అంతే లోతు కలిగి ఉంటాయి. వీటిని బిలస్వర్గాలు అని కూడా అంటారు. ఈ లోకాల్లో కూడా కామ, భోగ, ఐశ్వర్యాలు స్వర్గలోక వాసులకు లభించినట్టే ఇక్కడి వారికి లభిస్తుంటాయి. ఈ లోకాలన్నిటినీ మయుడు నిర్మించాడు.అంతులేని కామభోగాలను నిరంతరం అనుభవిస్తూ ఉండటమే ఈ లోకవాసుల పని. ఊర్ధ్వలోకాల వారికి ఉన్నట్లు ఇక్కడి వారికి మాత్రం సూర్యరశ్మి ఉండదు. అయితే సర్పాల మణులు దేదీప్యంగా కాంతులీనుతూ ఈ లోకాలలో వెలుగును ప్రసరింప చేస్తుంటాయి. ఇక్కడి వారంతా వ్యాధులకూ, వార్ధక్యానికీ, మానసిక బాధలకూ దూరంగా ఉంటారు.

లోకాల తత్వం : ప్రాణిలోకం ఎల్లప్పుడూ సుఖాన్ని కోరుకుంటుంది. అయితే వారికి లభించే సుఖం తత్వం లోకాన్నిబట్టి మారుతుంది. భూర్భువస్వర్లోకాలలో లభించే సుఖం నిత్యమైనది కాదు. నాల్గవదైన మహర్లోకం క్రమముక్తికి స్థానం కాని కల్పాంత సమయాలలో అక్కడా తాపం తప్పదు. మహర్లోకం పైన జనలోకం ఉన్నది. ఆ లోక ప్రవేశం మొదలుకొని శాశ్వత సుఖం ఆరంభమవుతున్నది. అది అమృతరూపం. జనలోకంపైన ఉన్న తపోలోకంలోని సుఖం శాస్వతమైనదే కాక క్షేమరూపంలో ఉంటున్నది. తపోలోకం పైన ఉండే సత్యలోకంలో సుఖం శాశ్వతము. మోక్షప్రదము కూడాను.

🐘 ఇంద్రుని వాహనం ఏమిటి అంటే తడుముకోకుండా ఐరావతం అని చెప్పేస్తాము. భారీకాయంతో, తెల్లటి మేనిఛాయతో మెరిసిపోయే ఐరావతాన్ని చూస్తే నిజంగానే అది దేవతా ఏనుగు అనిపించక మానదు. అలాంటి ఐరావతం గురించి కొన్ని విశేషాలు. ఐరావతం ఎలా జన్మించింది అనేందుకు రకరకాల కథలు చెబుతుంటారు. మాతంగలీల అనే ప్రాచీన గ్రంధం ప్రకారం… బ్రహ్మ వరంతో ఎనిమిది మగ ఏనుగులూ, ఎనిమిది ఆడ ఏనుగులూ ఉద్భవించాయట. మగ ఏనుగులకు ఐరావతం ప్రాతినిధ్యం వహించగా, ఆడ ఏనుగులకి ‘అభరాము’ అనే ఏనుగు నాయకత్వం వహించింది. మరో గాధ ప్రకారం ఈమె కద్రు, కశ్యపల కుమార్తె అయిన ఐరావతికి జన్మించింది.

🐘 కానీ విస్తృత ప్రచారంలో ఉన్న కథ ప్రకారంగా ఐరావతం క్షీరసాగరమథనం నుంచి జన్మించింది. క్షీరసాగరమథనం జరిగే సందర్భంలో మూడు అతీత లక్షణాలు ఉన్న జీవులు ఉద్భవించాయి. అవే కోరిన వరాలను తీర్చే కామధేనువు, ఏడు తలలతో ఉండే ఉచ్చైశ్రవము అనే గుర్రం, తెల్లటి తెలుపుతో మెరిసిపోయే ఐరావతం. అసలు ఐరావతం అంటేనే సముద్రం నుంచి ఉద్భవించినది అనే ఒక వ్యుత్పత్తి అర్థం ఉంది. ఐరావతం ఆవిర్భావం ఒక ఎత్తయితే, ఇంద్రుని వాహనంగా దాని భోగం మరో ఎత్తు. వర్షాన్ని కురిపించడం, తూర్పు దిక్కుకి అధిపతిగా ఉండటం, రాక్షసుల మీద పై చేయి సాధించడం అనేవి ఇంద్రుని ముఖ్యమైన మూడు బాధ్యతలు. ఈ మూడు బాధ్యతలలోనూ ఐరావతానిది ముఖ్య పాత్ర.

🐘 అదెలాగంటే…భూమి అంతర్భాగంలో ఉన్న నీటిని ఐరావతం తన తొండంతో ఆకాశానికి ఎగచిమ్ముతుందట. ఆ నీటినే ఇంద్రుడు తిరిగి వర్షంగా కురిపిస్తాడని ఓ కథ. ఆకాశంలోని ఎనిమిది దిక్కులకీ అష్టదిక్పాలకులు నాయకత్వం వహించే విషయం తెలిసిందే కదా! ఈ ఎనిమిది దిక్కులనీ పాలించే దేవతలు ఎనిమిది ఏనుగులు మీద నిలబడి ఉంటారట. వీటిలో ఇంద్రుని మోసేది ఐరావతమే కదా! అంతేకాకుండా మిగతా ఏనుగులకి కూడా అది దిశానిర్దేశం చేస్తుందట. ఇంద్రుడు చేసే యుద్ధాలలోనూ ఐరావతానికి ప్రముఖ పాత్రే. వృత్తాసుర వధ వంటి పోరులో ఐరావతమే చాకచక్యంగా ఇంద్రుని రణరంగంలో నడిపించింది. ఐరావత ప్రస్తావన కేవలం హిందూమతంలోనే కాకుండా జైన, బౌద్ధ మతాలలో కూడా కనిపిస్తుంది. ఇక థాయ్‌లాండ్‌, లావోస్‌ వంటి దేశాలలోనూ ఐరావతాన్ని ఆరాధించడం కనిపిస్తుంది. అక్కడి ప్రాచీన రాజ్యాలకి సంబంధించిన పతాకాల మీద మూడు తొండాలతో ఉండే ఐరావతం కనిపిస్తుంది. అలాంటి మూడు తొండాల ఐరావతపు విగ్రహం జీవితాలలో అదృష్టాన్ని తీసుకువస్తుందని నమ్ముతారు. విదేశాల సంగతి అటుంచితే మన ప్రాచీన దేవాలయాలలో కూడా ఐరావతపు చిత్రాలు కనిపిస్తూ ఉంటాయి. తమిళనాడులో అయితే ఐరావతం పూజించిన శివునికి ‘ఐరావతేశ్వరుడు’ అన్న పేరుతో ఒక ఆలయం కూడా ఉంది.
శ్రీ రామ శర్మ 9490944543
 జై శ్రీ రామ జై శ్రీ రామ జై శ్రీ రామ

కామెంట్‌లు లేవు: