14, నవంబర్ 2020, శనివారం

రామాయణమ్ 216

 రామాయణమ్ 216

....................

సుగ్రీవుడు ,తార ,అంగదుడు వీరు మువ్వురినీ ఓదార్చి ఇక చేయవలసిన కార్యము గురించి ఆలోచించమని రాముడు తెలుపగా లక్ష్మణుడు సుగ్రీవుని సమీపించి వాలి శరీరానికి దహన సంస్కారాలు జరిపించవలెనని తెలిపి అందుకు కావలసిన ప్రయత్నములు చేయమని సూచించినాడు .

.

వెంటనే సుగ్రీవుడు శ్రేష్టమైన గంధపుచెక్కలను బాగా ఎండిన అనేకములైన కాష్టములను తెచ్చుటకై వానరులను ఆజ్ఞాపించెను .

.

అన్ని ద్రవ్యములను తెచ్చుటకు అంగదుడు పంపబడెను .

.

తారుడు వాలి శరీరమును మోయుటకోరకు ఒక శ్రేష్టమైన పల్లకి తెచ్చెను . 

.

వానరవీరులు వాలి శరీరాన్ని ఎత్తి ఆ పల్లకి లో ఉంచి పల్లకిని భుజములకేక్కించుకొని మోయసాగిరి .

.

తార మొదలైన స్త్రీలు అనుసరించి వెళ్లిరి

.

ఒక నదీతీరమున చుట్టూ జలమున్న నిర్జనమైన ఒక ఇసుక తిన్నెపై చితిని ఏర్పాటు చేసి ఆ చితిపై వాలిశరీరాన్ని ఉంచారు వానరులు.

.

అప్పుడు అంగదుడు చితికి నిప్పంటించి అప్రదక్షిణముగా తిరిగెను. వానరు లంతా నది వద్దకు వెళ్లి వాలి కి జల తర్పణములు చేశారు.

.

దహన సంస్కారమైన పిమ్మట సుగ్రీవుడు రాముని వద్దకు వెడలి అంజలి ఘటించి నిలిచెను .

.

అంత హనుమంతుడు రామునితో రామా ! ఈ సుగ్రీవునకు నీవు అనుమతినిచ్చిన ఎడల కిష్కింధకు వెళ్లి యధాశాస్త్రము రాజ్యాభిషిక్తుడై కార్యములను చక్కబెట్టగలడు అని తెలిపాడు .

.

అప్పుడు రాముడు హనుమంతునితో హనుమా !నేను ఈ పదునాలుగేండ్లు గ్రామములో గానీ పట్టణములలో గానీ ప్రవేశించను మీరే అతనిని తీసుకొని వెళ్లి రాజ్యాభిషిక్తునిగావించండి అంగదుని యువరాజుగావించండి అని పలికెను .


రామాయణమ్ 217

...............

రామాజ్ఞ ప్రకారము సుగ్రీవునకు పట్టాభిషేకము ,అంగదునకు యువరాజ పట్టము కట్టుటనిర్విఘ్నముగా జరిగిపోయినవి.

.

 సుగ్రీవుడు రుమను మరల చేపట్టి నాడు .సంతోషముతో ఈ విషయములన్నీ రామచంద్రునకు నివేదించినాడు.

.

అది శ్రావణ మాసము !వర్షరుతువు ప్రారంభమైనది .

నదులన్నీ నిడుకుండలలాగా ఉన్నాయి ,

మేఘములు బారులు తీరి జలధారలు వర్షిస్తున్నాయి ,

.

ఆ సమయము సీతాన్వేషణకు అనుకూలము కాదు.


 ,కార్తీకమాసమువరకు ఆగవలసినదే ! అప్పటివరకు సుగ్రీవునకు అనుమతిచ్చి తానూ తమ్మునితో గూడి అందమైన ప్రస్రవణ పర్వత గుహనొకదానిని అనుకూలముగా ఉన్నటువంటిది చూసి అందు నివసింప నిశ్చయించినాడు రాఘవుడు,

.

రాఘవుడు ఒక రోజు ఆ గుహ సమీపమునందున్న ఒక నదిని చూశాడు. అది చాలా నిండుగా ప్రవహిస్తున్నది .

ఆ నదిని చూడగానే అందమైన వస్త్రములు ధరించిన కన్నెపిల్లలా తోచింది ఆయనకు.

.

 ఆ నది ఒడ్డున ఉన్న వానీర ,తిమిర,వాకుల,కేతక,హింతాల,తినిస,నీప ,వేతస వృక్షాలు రకరకాల రంగుల పూవులతో నిండుగా ఉంది ఆ నదీ కన్య ధరించిన ఉత్తమ వస్త్రములుగా కనుపించినవి రాముని కంటికి !

.

ఆ నదికి దగ్గరగా కూతలు కూయుచూ నదిమీదుగా ఎగురుతున్న పక్షుల కిలకిలారావములు ఆ నదీమసుందరి నవ్వులా ఉన్నవట ఆ నదీ గమన శబ్దము ఆ సుందరి కాలి అందియల సవ్వడి వలే వినిపించినదట. 

.

ఆ నదీ మధ్యభాగమున తెల్లని ఇసుకతిన్నెలు ఆ నదీ కన్య నవ్వుమోము వలే తళతళ మెరిసిపోతున్నవట..

అందమైన ఊహలతో అనుక్షణము ప్రక్కన సీత లేదే అనే విరహవేదనతో కాలము గడుపుతున్నాడు జానకీమనోహరుడు.


రామాయణమ్ 218

...............

లక్ష్మణా! నామనస్సులో దుఃఖభారము అధికముగా ఉన్నది ,

దానిని దాటే మార్గమేది ? 

.

వర్షాకాలమా ప్రయాణమునకు అనుకూలము కాదె !

దీనిని దాటుటేట్లు ? 

.

చూడబోతే రావణుడా బలవంతుడైన శత్రువు ! 

ఈ మూడింటినీ దాటుట ఎట్లు ? 

.

వర్ష ఋతువులో అందమైన ప్రకృతిని ఆస్వాదించలేక అనుక్షణము సీతను గుర్తుకు తెచ్చుకుంటూ పిచ్చివాడవుతున్న అన్నను జాగ్రత్తగా ఓదారుస్తూ వస్తున్నాడు లక్ష్మణుడు!

.

వారి పరిస్థితి ఇలా ఉంది!

.

అక్కడ కిష్కింధలో !

.

సుగ్రీవుడు ఎంతోకాలానికి లభించిన సుఖాలవ్వటముచేత వాటిలో మునిగి తేలుతున్నాడు ,సమయము ఎలా గడిచిపోతున్నదో గమనించే స్పృహలో కూడా లేడు.

.

 భార్య రుమ ,ఇష్టురాలైన తార ఇరువురూ లభించారు.

మగువ ,మదిర ఈ రెండూ అతనిని కట్టిపడవేసినవి.దర్శనము మంత్రులకు కూడా కరువయ్యింది.

.

ఆయనను ఎవరూ సమీపించే సాహసము చేయలేకపోతున్నారు.

.

ఈ పోకడలన్నీ ఒకరు గమనిస్తూనే వున్నారు !

.

ఆయనే బుద్దిమంతులలో శ్రేష్ఠుడైన హనుమంతుడు .. 

.

అప్పటికీ వర్షాకాలము గడచిపోవచ్చింది. 

.

మేఘముల మెరుపులు తగ్గిపోయి నిర్మల మైన ఆకాశము

 కనపడ జోచ్చింది .

 రాత్రుళ్ళు అంబరాన తెల్లని వెన్నెల పూతలతో కడు రమణీయంగా కనపడుతున్నది . .

.

సుగ్రీవుని సమీపించాడు హనుమంతుడు ...

.

ఇలా పలికాడు!

.

నీవు నీ రాజ్యాన్నీ రుమనీ తిరిగి సంపాదించుకున్నావు .

గొప్ప యశస్సు నీ స్వంతమైనది .

.

ఇక నీవు నీ మిత్రుల కార్యములు సాధించుటమీద దృష్టి నిలపవలె !

.

తగు సమయమును గుర్తించుచూ మిత్రుల విషయములో ఎల్లప్పుడూ బాగుగా ప్రవర్తించువాని రాజ్యము ,కీర్తి, ధనము వృద్ది పొందును .

.

రాజా ! ఏ రాజుకైతే స్నేహితులు ,సైన్యము,ధనాగారము,

ప్రభుత్వ శక్తీ ఈ నాలుగూ సమముగా ఉండునో అతనే గొప్ప రాజ్యమును తన స్వంతము చేసుకోనగలడు.

.

ఎవడు తన మిత్రుని కార్యమును సాధించుటకు ఉత్సాహము చూపడో అతడు సకల అనర్ధములను ఎదుర్కొనవలసి ఉండును!

కామెంట్‌లు లేవు: