21, సెప్టెంబర్ 2020, సోమవారం

రామాయణమ్.70

 

.....

నిత్యము మంగళవాయిద్య ధ్వనులతో మారుమ్రోగే రాజభవనము నేడు ఏడుపులు పెడబొబ్బలతో దద్దరిల్లిపోతున్నది.

.

రాముడు భార్యా,సోదరసమేతుడై తల్లికౌసల్యకు ప్రదక్షిణము చేసి నమస్కరించి అదేవిధముగా తక్కిన మూడువందలయాభైమంది తల్లులవద్దకూడా అనుమతి తీసుకొని తాను ఇదివరకెన్నడైనా అపరాధములు తెలియక చేసి ఉంటే మన్నించమని ప్రార్ధించి తండ్రికి కూడా ప్రదక్షిణనమస్కారములాచరించి అక్కడే ఉన్న సుమిత్రామాత వద్దకు వచ్చినారు .

.

తనకు నమస్కరిస్తున్న తనకుమారుడు లక్ష్మణుని చూసి ,నాయనా భగవంతుడు నిన్ను వనవాసము కొరకే సృష్టించినట్లున్నది ! ఏమాత్రము ఏమరుపాటులేకుండా రాముడిని రక్షిస్తూ ఉండు. నాన్నా ఈ రాముడే నీకు దిక్కు అతను కష్టాలలో ఉండనీ ఐశ్వర్యవంతుడుగా ఉండనీ గాక.

నీ పెద్దన్నను నీవు ఎల్లప్పుడూ అనుసరించి ఉండు అది ధర్మము!.

.

నీ వొదిన సీతమ్మను కన్నతల్లి అనుకో 

నీ అన్న రామయ్యను కన్నతండ్రి అనుకో 

నీ వుండే అడవి ఉన్న ఊరు అయోధ్య అనుకో!

హాయిగా సుఖంగా వెళ్ళిరా నాన్నా! అని కొడుకు తలనిమురుతూ పలికింది సుమిత్ర !

.

రామం దశరధం విద్ధి మాంవిద్ధి జనకాత్మజామ్

అయోధ్యాం అటవీం విద్ధి గచ్ఛతాత యధాసుఖమ్.

.

రాముడు దశరధుడని,సీత నేనేనని,అడవే అయోధ్య అని భావించుతూ సుఖంగా వెళ్ళిరా నాయనా! 

.

NB

.

సుమిత్రామాత నోట వాల్మీకి మహర్షి పలికించిన ఆ మాటలకు కొన్ని విశేష అర్ధములు చెప్పారు కొందరు వ్యాఖ్యాతలు.

రాముని...... దశరధమ్ అనగా పక్షి రధముగాగల విష్ణువుగాను సీతను ...మామ్ అనగా లక్ష్మీదేవిగానూ ,అడవిని ...అయోధ్యామ్ అ యోధ్యామ్ అనగా యుద్ధము చేయటానికి శక్యముగాని వైకుంఠము గా భావించుము అని వారివారి భావన! 

రాముడు సాక్షాత్తు శ్రీమహావిష్ణువు .సీత లక్ష్మి ,

రాముడు నివసించే అడవి వైకుంఠము.

.


జానకిరామారావు వూటుకూరు గారి 

సౌజన్యం తో ....


*ధర్మధ్వజం*

హిందు చైతన్య వేదిక

కామెంట్‌లు లేవు: