23, సెప్టెంబర్ 2020, బుధవారం

కంసుడిని

 శ్రీ గురుభ్యో నమః శుభమస్తు 

      ...............................

యోగమాయ పలికిన పలుకులు 

కంసుడిని కలవరపెట్టసాగాయి. దేవకి, వసుదేవుల పట్ల చూపిన

సౌజన్యం , తాత్కాలిక పరివర్తన మాత్రమే. మంచివారి ఆలోచనలు 

స్థిరం గా ఉంటాయి, కాని చెడ్డవారి మనసులు, ఆలోచనలు స్థిరం గా వుండవు. తనను చంపే పసిబిడ్డ ఎక్కడో , యోగమాయతో కూడా పుట్టియుంటాడన్న భావన కంసుడికి, ఆతని అనుచరులకు కలిగింది. 


, "ఏవం చేతర్షి భోజేన్ద్ర పురగ్రామ 

ప్రజాదిషు 


అనిర్దశాన్నిర్దసాంశ్చ హనిష్యామో 

ద్య వైశిశూన్ 


అనుజ్ఞ ఇస్తే నేడే పుర గ్రామాలలో ఉన్న, పదిదినముల లోపు, అంతకు మించిన వయస్సు గలవారిని , వధించి, విపత్తు ను నిర్మూలిస్తాము, అని అన్నారు. 


చెడును, ప్రారంభంలోనే నిర్మూలించకున్న, అది జయింపరాని, నిరోధించరాని బలీయ మైన శక్తి 

గా మారవచ్చునని రాక్షస మంత్రి మండలి సలహా ఇచ్చింది. కంసుడు గూడా నచ్చాడు. శిశు సంహారానికి, సాధు హింసకు అనుజ్ఞ ఇచ్చాడు. 


ఆయుః శ్రియం యశోధర్మం 

లోకానాశిష ఏవ చ 

హన్తి శ్రేయాంసి సర్వాణి పుంసో మహాదతి క్రమః 

(సాధువులను ఎవరు కష్ట పెడతారో, వారు ఆయుష్షు ను, సంపదను కీర్తిని, పుణ్యాన్ని పోగొట్టు కుంటారు )

మూర్కుడు, దుర్మార్గుడైన కంసుడికి ఇవేమి పట్టలేదు. తనకసాధ్యమైనది లేదన్న 

గర్వంతో వున్నాడు.. 

వినాశకాలే విపరీతబుద్ది యన్నట్లు  

తన చావుకు అన్ని మార్గాలు చూసుకుంటున్నాడు. 


అక్కడ, గోకులం లొ తెల్లవారింది. 

నందుడికి, కొడుకు పుట్టాడన్న శుభవార్త పల్లె కంటా తెలిసింది. 

, "ఏమినోము ఫలమో ఇంత ప్రొ 

ద్దొక వార్త, వింటి మబలలారా !

వీను లలర


మన యశోద చిన్ని మగవాని గనెనట చూసి వత్తమమ్మ సుదతులార!

గోప యువతు లందరు, ఒకరినొకరు నిద్ర లేపుకొంటూ, గుంపులు , గుంపులు గా, నందుడి ఇంటికి తరలివెళ్లారు. పల్లె పడుచుల అందానికి తోడు, ఆనందం కూడా తోడయ్యింది. 

వడిగా నడిచేవారు, వయ్యారంగా నడిచేవారు, వర్షాకాలపు చల్ల గాలులకు పయ్యెదలు కప్పుకొనేవారు, వ్రేపల్లె గోపికలంతా యశోద చుట్టూ మూగారు. నల్లనయ్య ను చూసారు. స్వామి తానప్పటి దాకా దాచిన తన మోహనాకారపు కళ లన్నిటిని 

నిలువెల్లా చూప సాగాడు. 


గోపికలందరు ఆ మోహనాకారాన్ని చూసి మోజు పడ్డారు. పసి కందులంటే, ఎవరికి మాత్రం ఇష్టం 

ఉండదూ? 

అందరూ కలసి, శరీరానికి పసుపు రాసి తలకు నూనె అంటి, శుభ్రం గా స్నానం చేయించారు. దిష్టి తీశారు సాంబ్రాణి పొగ పట్టారు. 

ముద్దులిడుకున్నారు. 

గోపికలతో తొలి జలస్నానం చేసి శ్రీమహావిష్ణువు పొత్తి గుడ్డలలొ విశ్రమించాడు.

తల్లి వొడిలో పెరగ సాగాడు. జాతకర్మ చేయించుకున్నాడు. 

తల్లి చను బాలకు అలవాటయ్యాడు. 

యశోద చేసుకున్న తపస్సు, పుణ్యం చనుబాలు రూపంలో, స్వామి ని చేరుకుంటున్నాయి. 

విచిత్రం, ఏమిటంటే, స్వామి చనుబాలుకు అలవాటు అయిన తరువాత, గోకులం లొ గోవుల పొదుగులు, నిండు పాలకుండల్లా నిండిపోయాయట. కుమ్మరి వారు పాల కుండలు తయారు చెయ్యడం లొ తలమునకలయ్యారట. 

పచ్చిక బయళ్లు సమృద్ధిగా గోవులకు గ్రాసం ఇవ్వసాగాయి 


యశోద తన బిడ్డ వర్చస్సు, అందము చూసి తను కన్నబిడ్డయేనా !అని అచ్చెరువు వొందింది. ప్రేమతో హృదయానికి ఒత్తుకుంటూ, ముద్దిడుకుంటూ, 

తన్మయత్వం చెంద సాగింది 


గోపికల దిష్టి తగులుతుందని దైవ ధ్యానం చేసుకునేది. తనకోసం ధ్యానం చేసే తల్లిని చూసి, మురిసిపోతూ, దేవదేవుడు తల్లి వంక, నవ్వుతూ చూస్తూ ఉండేవాడు. నవ్వే, నల్లనయ్యను చూసుకుంటూ, తల్లి తన్మయం చెందేది. 


గోకులం వార్తలు మధురకు కూడా చేర సాగాయి 


(అధిక మాసంలో దశమస్కందం 

చదివినా , విన్నా పుణ్యమంటారు )

కామెంట్‌లు లేవు: