23, సెప్టెంబర్ 2020, బుధవారం

అష్టాక్షరీ మంత్రంలో

 “ఓమ్ నమో నారాయణాయ” అనే అష్టాక్షరీ మంత్రంలో “ఓం” – ఆత్మ స్వరూపాన్ని, “నమః” – అనే అక్షరాలు – బుద్ధిని, మనస్సుని, “నారాయణాయ” – అనే అక్షరాలు పంచేంద్రియాలను “జీవుని” తెలియజేస్తున్నాయి.

అష్టాక్షరీ మంత్రం ‘వ్యాపక మంత్రం’. ఆకాశతత్త్వంపై ఆధారపడి ఉంది. ఆ కారణంగా ఈ మంత్రాన్ని జపించేతప్పుడు, ఉపాసకుని మనస్సంతా ఈ మంత్రమే వ్యాపించి ఏకాగ్రతను కలిగిస్తుంది.

జలాలకు నారములని పేరు. పరమాత్మ ఆ ‘అనంతజలరాశి’లో శయనిస్తాడు కనుక ఆయనకు ‘నారాయణ’ అనే నామం వచ్చింది. ఇంకా,

“న” కార పదోచ్చారణ మాత్రేనైవ నాకాధిప భోగం లభతే

“ర” కార పదోచ్ఛారణేవ రామరాజ్య భోగం లభతే

“య” కార పదోచ్ఛారణేవ కుబేరవత్ ప్రకాశతే

“ణ” కార పదోచ్చారణేవ వైరాగ్యం లభతే

“న” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత ఇంద్ర భోగాలు లభిస్తాయి. “ర” అనే అక్షరాన్ని ఉచ్చరించటం చేత రామరాజ్యంలోనున్న భోగాలు లభిస్తాయి. “య” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత కుబేరునివలె సర్వసంపదలతో ప్రకాశిస్తారు. “ణ” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత ఐహిక సుఖాల పట్ల విముఖత కల్గి, దైవచింతన పట్ల ఆసక్తి కల్గి, మోక్షాన్ని పొందేందుకై మార్గం లభిస్తుంది. ఇంతటి శక్తివంతమైన “నారాయణ” అను శబ్దానికి ‘ఒమ్ నమో నారాయణాయ’ (అష్టాక్షరీ మహా మంత్రం)ను జపించుటచే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. ఈ మహా మంత్రంలో, మహోన్నతమైన శక్తి ఉంది.

"ధ్యాయేన్నారాయణందేవం

స్నానాదిఘ చ కర్మసు,

ప్రాయశ్చిత్తం హి సర్వస్వ

దుష్కృత స్వేతివైశ్రుతిః!"

స్నానపానాదిగల సమస్తకర్మలలో “నారాయణుని” స్మరించు కొన్నట్లయితే, సమస్త పాపాలకు ప్రాయశ్చిత్తం జరిగి మంచి మార్గంలో పయనించడానికి వీలవుతుంది.

కామెంట్‌లు లేవు: