23, సెప్టెంబర్ 2020, బుధవారం

రామాయణమ్. 92

 

...

భరతుడి అరుపులు,కేకలు, పెడబొబ్బలతోఅంతఃపురం మారుమ్రోగిపోతున్నది.భరతుడి గొంతు గుర్తుపట్టిన కౌసల్య సుమిత్రతో అదిగో భరతుడు వచ్చినట్లున్నాడు ఆ గొంతు అతనిదే కదా అని ఆవిడ అంటూఉండగనే భరతశత్రుఘ్నులు పెత్తల్లి చెంతకు చేరారు.

.

ఆవిడ అప్పటికే భర్తృవియోగం ,పుత్రుడు దూరమవ్వటం అనే రెండు పదునైన దుఃఖాలు మనస్సును కోస్తూ ఉంటే మాటిమాటికీ సంజ్ఞతప్పి ఏడుస్తూ నేల మీదపడి దొర్లుతూ అత్యంత దయనీయమైన స్థితిలో ఉన్న కౌసల్యను చూడగనే భరతుడి హృదయంలో అంతులేని వేదన పుట్టింది.

.

నేలమీద పడి ఉన్న మహారాణి కౌసల్య మహాధానుష్కుడు,జగదేకవీరుడైన రాముడి కన్నతల్లిని అలా చూడలేక పోయాడు భరతుడు.వెంటనే జలజలకన్నీరు కారుస్తూ కౌసల్యను లేవనెత్తి ఆవిడను కౌగలించుకొన్నారు భరతశత్రుఘ్నులిరువురూ..

.

భరతుని చూడగనే కౌసల్య నాయనా ఏ శత్రుబాధలేని రాజ్యము నీకు లభించినదికదా ! ఏమి ఆశించి నా కొడుకుకు నారచీరలు కట్టబెట్టి నీ తల్లి వాడిని అడవులకు పంపింది .నా కొడుకున్నచోటికే నన్ను కూడ పంపివేయి. ఈ రాజ్యము హాయిగా నీవు ఏలుకోవచ్చు.

.

పుండును కెలికి సూదితో గుచ్చినట్లున్నాయి కౌసల్యామాత మాటలు .భరతుడి వేదన అంతకంతకూ హెచ్చింది .దానికి అంతం లేకుండా పోయింది...

.

పెద్దతల్లికి చేతులు జోడించి నమస్కరిస్తూ అమ్మా ఏ పాపము తెలియని నన్నెందుకు నిందిస్తావు.అన్నమీద నాకు గల ప్రేమ,భక్తి నీవెరుగనివా?

.

అమ్మా అన్నగారి అరణ్యవాసానికి నా సమ్మతి ఉన్నట్లయితే..

.

సూర్యభగవానుడి ఎదురుగా మలమూత్ర విసర్జన చేసేవాడికి ఏ పాపం చుట్టుకుంటుందో అది నాకు చుట్టుకుంటుంది

.

జీతము ఇవ్వకుండా పని చేయించుకొన్న యజమానికి ఏ పాపము చుట్టుకుంటుందో అది నాకు కలుగుతుంది.

.

మాట ఇచ్చి తప్పినవాడికి ,ప్రజల రక్షణ మరచిన రాజుకు ఏ పాపము చుట్టుకుంటుందో అది నాకు చుట్టుకుంటుంది.

.

రణరంగంలో పోరాడి మరణించక వెన్నుచూపి పారిపోయినవాడికి ఏ పాపం చుట్టుకుఙటుందో అది నాకు చుట్టుకుంటుంది.

.

ఆవులను కాలితో తన్నినవాడికి,పెద్దలను దూషించినవాడికి,మిత్రద్రోహము చేసిన వాడికి ఏ పాపం చుట్టుకుంటుందో అది నాకు చుట్టుకుంటుంది.

.

ఎదుటివాడు విశ్వాసముంచి చెప్పిన రహస్యాన్ని బహిర్గతపరచినవాడికి ఏ పాపం చుట్టుకుంటుందో అది నాకు చుట్టుకుంటుంది.

.

ఇంటిలోని భార్యాపిల్లలకు,అతిధులకు,బంధువులకు ఎవ్వరికీ పెట్టకుండా తానొక్కడే మృష్టాన్న భోజన మారగించే వాడికి ఏ పాపం చుట్టుకుంటుందో అది నాకు చుట్టుకొను గాక.

.

అమ్మకూడని వస్తువులు .లక్క,మధువు,లోహము,విషము,మాంసము అమ్మేవాడికి ఏ పాపము చుట్టుకుంటుందో అది చుట్టుకొను గాక.

.

నాకు ఆ ఉద్దేశ్యమే ఉండి నట్లయితే కుండ పెంకు చేతబట్టి చినిగిన గుడ్డలు కట్టి భిక్షమెత్తుకొంటూ ,పిచ్చివాడివాలే భూమి మీద తిరుగుదును గాక..

.

సంధ్యా సమయాలలో నిదురించే వాడికి కలిగే పాపము నాకు కలుగు గాక.

.

పరభార్యా సంగమము చేసిన వానికి ఎట్టిపాపము కలుగునో అట్టిపాపము నాకూ కలుగు గాక.

‌.

ఈ విధంగా కౌసల్యను ఓదర్చటానికి ప్రయత్నం చేస్తూ దుఃఖ భారంతో తానుకూడ నేలమీద పడిపోయాడు భరతుడు.


రామాయణమ్.93

...

దుఃఖార్తుడై తీవ్రమైన వేదనతో విలపిస్తూ శపధములు చేస్తూ ఒట్లుపెట్టకుంటున్న భరతుని చూసి కౌసల్య దుఃఖము మరింత హెచ్చింది .రాముడంటే ప్రాణమైన భరతుని దగ్గరకు తీసుకొని తన ఒడిలో కూర్చుండబెట్టుకొని చాలాసేపు దుఃఖిస్తూ అలాగే ఉండిపోయింది.అలాగే రాత్రి గడిచిపోయింది.

.

తెల్లవారుతుండగనే వశిష్ఠ మహర్షి భరతుడికి చేయవలసిన కార్యములను గురించి తెలిపి అందుకు కావాలసిన ఏర్పాట్లు చేసినాడు.

.

నూనెలో జాగ్రత్తగా ఉంచిన దశరధుడి కళేబరాన్ని బయటకు తీసి నేలపై ఉంచారు. మహారాజు ఇంకా నిదురిస్తున్నట్లుగనే ఉన్నాడు.

.

ఆయన పార్ధివ శరీరం వద్దకు వెళ్ళి భరతుడు ఎందుకు చేశావయ్యా నీవీ పని ? ధర్మమూర్తి రాముడిని అడవులకు పంపే నిర్ణయమెందుకు చేశావు.నా దగ్గర రాముడూలేడు,నీవూలేవు ఇక ఈ అయోధ్య భర్తలేని విధవరాలుగా ప్రకాశహీనంగా ఉన్నదయ్యా! అని పరిపరివిధాలుగా రోదిస్తున్న భరతుడిని వశిష్ఠుల వారు ఓదార్చి చేయవలసిన కార్యాలగురించి తొందరపెట్టాడు.

.

మహారాజుదేహాన్ని పల్లకిలో కూర్చుండ బెట్టి శ్మశానమునకు తీసుకువెళ్ళి చితిమధ్యలో పరుండబెట్టి అనేక విధాలైన గంధద్రవ్యాలు చేర్చగా,భరతుడు ఆయన చితికి నిప్పుపెట్టాడు.

.

ఆయనకు జరిపించవలసిన కర్మలు శాస్త్రోక్తంగా పూర్తిచేసి రాముడి వద్దకు వెళ్ళిపోవాలనే తలంపుతో శత్రుఘ్నునితో కలిసి కూర్చున్నాడు భరతుడు.

.

ఇద్దరూ మాట్లాడు కుంటున్నారు.సకల లోక రక్షకుడు ,మహాబలశాలి,మనకు కష్టాలు వస్తే ఆదుకునే రాముడిని ఒక ఆడుది అడవికి పంపి వేసింది.

.

ఆసమయంలో లక్ష్మణుడు ఏం చేస్తున్నట్లు?స్త్రీ వశుడైన తండ్రిని ఎందుకు నిగ్రహించలేకపోయినాడు? ఇలా మాట్లాడుకుంటుంటే వారికి అటుగా వెళ్తూ మంధర కనపడ్డది.

.

అది వంటి నిండా గంధము పూసుకొని రాణులు అలంకరించుకొనే విధముగా విలువైన వస్త్రాలు ధరించి రకరకాల అలంకారాలతో,నడుముకు వడ్డాణముతో త్రాళ్ళతో కట్టబడ్డ ఆడుకోతిలాగ ఉన్నది.

.

దానిని ద్వారపాలకులు పట్టుకొని ఇదిగో ఎవతెమూలంగా రాముడు అడవులపాలయ్యాడో ఆ దరిద్రపుగొట్టు మంధర ఇది ఏం చేస్తావో చెయ్యి అని శత్రుఘ్నునికి అప్పగించారు.

.

ఇది చేసిన వెధవపనికి ఇది ఫలితము అనుభవించాల్సిందే అంటూ ఆ గూనిదానిని జుట్టుపట్టుకొని ఒక ఈడ్పుఈడ్చాడు శత్రుఘ్నుడు అప్పుడు అది వేసుకొన్న ఆభరణాలు చెల్లాచెదురుగా పడి ఆ నేల అంతా నక్షత్రాలు పరుచుకొన్న ఆకాశంలాగ కనపడ్డది.

.

అది కుయ్యోమొర్రో అంటూ ఏడుస్తుంటే దాని వెంట వస్తున్న తక్కిన దాసీజనమంతా శరణువేడటానికి కౌసల్యా మందిరం వైపు పరుగెత్తారు.

.

శత్రుఘ్నుడు తీవ్రమైన క్రోధావేశంతో కైకేయినికూడా దూషిస్తూ ఉంటే ఆవిడ విపరీతమైన భయంతో భరతుడిని శరణువేడింది.

.

అప్పుడు శత్రుఘ్నుని చూసి భరతుడు తమ్ముడూ స్త్రీల ను చంపడం మహాపాపం వీరిని వదిలి వేయి ,అదీగాక వీరికి ఏవిధమైన హానికలిగినా జీవితాంతము రాముడు మనతో మాట్లాడడు.

.

రాముడు నిందిస్తాడు అనే భావనే నాకు లేకపోతే ఈ ధూర్తురాండ్రను నేనే ఎప్పుడో సంహరించి ఉండేవాడిని.

.

భరతుడి ఆ మాటలు విని వారిరువురినీ విడిచిపెట్టేశాడు శత్రుఘ్నుడు.

కామెంట్‌లు లేవు: