1, అక్టోబర్ 2023, ఆదివారం

జన్మ పుట్టుక లక్ష్యం

 జన్మ పుట్టుక లక్ష్యం ఏమిటి ?

జన్మలు అంటే ఏమిటి? అందులో మానవ జన్మకు గల కారణం ఏమిటి?

మొదట మనం జన్మ అంటే ఏమిటో తెలుసుకుందాం.

జన్మ అంటే మళ్ళీ పుట్టడం. అంటే చనిపోయిన వాళ్ళు మళ్ళీ పుట్టడమే జన్మ.

కాని మానవ జన్మే అని మాత్రం చెప్పలేము. ఎందుకంటే మరల మనం పొందే జన్మ మనం సంపాదించుకున్న జ్ఞానం మీద మాత్రమే ఆధారపడుతుంది.

అన్ని జన్మలలోనూ మానవజన్మ మాత్రమే ఉత్తమోత్తమమైనది, దుర్లభమైనది. మానవుడు తన జీవిత కాలంలో అనేక కర్మలను చేస్తువుంటాడు. ఆ కర్మలకు ఫలితాలను అనుభవించాలి. వాటినే కర్మఫలాలు అంటారు.


అనేక జన్మలలో చేసిన కర్మఫలాలు ఆ జీవుడితో పాటుగా ప్రయాణిస్తుంటాయి.


అన్నీ పుణ్య కర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినపుడు ఆ జీవుడు దేవలోకాలలో దేవ జన్మ నేత్తుతాడు.

అక్కడ ఆ కర్మఫలాల కారణంగా అనేక భోగాలను అనుభవిస్తాడు.

అది భోగ భూమి. కనుక అక్కడ అతడికి ఏ కర్మలు చేసే అధికారం లేదు.

అందువల్ల పరమాత్మను అందుకోవటానికి తగిన కర్మలచరించే అవకాశం లేదు. తన కర్మఫలాలననుసరించి భోగాలననుభావించి, ఆ కర్మ ఫలాలు క్షయం కాగానే ‘క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి’ అన్నట్లు ఈ మర్త్య లోకాన్ని – మానవ లోకాన్ని చేరవలసిందే. మరల మరల మానవ జన్మనో, జంతు జన్మనో ఎత్తవలసిందే

ఈ దేవ జన్మలో కేవలం మనోబుద్దులుంటాయే కానీ కర్మజేయుటకు సాధనమైన స్థూల శరీరం వుండదు.


కనుక భాగవత్సాక్షాత్కారానికి ఉపయోగపడే జన్మకాదు ఈ దేవజన్మ.


ఇక అన్నీ పాపకర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినపుడు, ఆ జీవుడు జంతువులు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు మొదలైన జంతువులుగా నీచయోనులయందు జన్మిస్తాడు.


ఆ జన్మలలో ఆ కర్మఫలాల కారణంగా అనేక బాధలు,దుఃఖాలు అనుభవిస్తాడు, హింసించబడుతాడు.


ఈ జన్మలలో కర్మలుచేస్తున్న అవి అన్నియు బుద్దిపరంగా కాదు, అవి అన్నియు కేవలం ప్రకృతి ప్రేరణలతో పరతంత్రంగా చేస్తాయి.


ఈ జంతు జన్మలలో శరీరం –మనస్సు ఉన్నాయి గాని, బుద్ధి మాత్రం లేదు.


కనుక ఈ జన్మలలో కూడా కేవలం కర్మఫలాలు అనుభవించడమే కానీ పరమాత్మనందుకొనుటకు తగిన జ్ఞానాన్ని పొందే అవకాశం లేదు.


కనుక భాగవత్సాక్షాత్కారానికి ఈ జంతు జన్మ కూడ ఉపయోగపడదు.


ఇక పుణ్యపాప కర్మల ఫలాలు మిశ్రమంగా పక్వానికి వచ్చినపుడు, ఆ జీవుడు మానవ జన్మనెత్తటం జరుగుతుంది.

ఈ మానవ జన్మలో పుణ్య కర్మల ఫలంగా సుఖాలు, మరియు పాప కర్మల ఫలంగా దుఖాలు, అనుభవిస్తాడు. అయితే ఇలా కర్మఫలాలనుభవించటం మాత్రమేగాక, కొత్తగా కర్మలు చేసే అధికారం కూడా, ఈ మనవజన్మలోనే వుంది.


ఎందుకంటే స్వతంత్రంగా బుద్ధి అనే సాధనం ఉన్న జన్మ ఇది.


కనుక పరమాత్మను అందుకోవటానికి తగిన కర్మలు చేసే అధికారం, జ్ఞానాన్ని పొందే అవకాశం ఉన్న ఈ మానవ జన్మ, ఉత్తమోత్తమమైనది, మరియు దుర్లభమైనది, అని అన్నారు.

ఈ మానవ జన్మ 84 లక్షల జీవరాసులలో పుట్టి గిట్టిన తరువాత లభించే అపురూప జన్మ ఈ మానవ జన్మ.

కనుకనే ఈ మానవ జన్మను, ‘జంతూనాం నర జన్మ దుర్లభం’ అని ఆచార్య శంకరులు “వివేక చూడామణి” గ్రంధంలో తెలియజేసారు.

ఇట్టి ఈ అపురూపమైన, ఉత్తమోత్తమమైన మరియు దుర్లభమైన మానవ జన్మను పొందిన ప్రతి ఒక్కరు, దీనిని సార్ధకం చేసుకోవాలి.

సరే జన్మలు అయితే ఏవో ఒకటి వస్తూనే వున్నాయి కాని, ఎందుకు మనం ఈ విధంగా మళ్ళీ మళ్ళీ పుట్టవలసి వస్తుంది.పుట్టిన మన జన్మ లక్ష్యం ఏమిటి?

జంతు జన్మలు పొందిన వాటి లక్ష్యం అయితే ఒకటే, అవి మానవ జన్మ పొందడానికి కర్మలను ఆచరిస్తువుంటాయి.


మరి మనిషిగా పుట్టిన మనం ఏమి చేస్తున్నాం? మన లక్ష్యం ఏమిటి అన్నది? అంటే మానవ జన్మను పొందిన ప్రతి ఒక్కరు దీనిని సార్ధకం చేసుకోవాలి. సార్ధకం చేసుకోవడం అంటే ఏమిటి అన్నది, ఇక్కడ మనం తెలుసుకోవాలి.

సార్ధకం చేసుకోవడం అంటే ఏమిటి? సాధారణంగా మనం అంతా (మనుషులందరూ) బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు చేయాలి, లేదా పెద్ద పెద్ద పదవులు చేపట్టాలి. బాగా సంపాదించి భార్యబిడ్డలతో సహా తను అనేక భోగాలు అనుభవించాలి.అయితే ఇక్కడ ఎవ్వరు తాము కోరుకున్నట్లుగా జీవించలేకపోతున్నారు.

ఎన్ని సుఖాలు, భోగాలు అనుభవించిన ఈ మనస్సుకు ఎదో ఒక వెలితి వుంటుంది.

దీనికి కారణం మనం అనుభవించేవి ఏవి కూడ నిత్యమైన, పరిపూర్ణమైన సుఖాలు కాదు.

ఇవి అన్నియు అనిత్యమైన వస్తువుల ద్వారా వచ్చే సుఖాలు.

నిత్యమైన, పరిపూర్ణమైన, శాశ్వతమైన సుఖం కావాలంటే నిత్యవస్తువు, పరిపూర్ణవస్తువు, శాశ్వత వస్తువు ద్వారానే లభిస్తుంది. ఏమిటది?

ఆ నిత్యమైన వస్తువు ఏకమైన “పరమాత్మ” మాత్రమే.

‘నిత్య వస్త్వేకం బ్రహ్మ తద్వ్యతిరిక్తం సర్వం అనిత్యం’ అని తత్వబోధ లో శంకరాచార్యులవారు స్పష్టం చేసారు. అంటే నిత్య వస్తువు ఏకమైన పరమాత్మ మాత్రమే. దానికి వేరుగా ఉన్న సర్వమూ, అనిత్యమైనవే అని అర్థం.

కనుక నిత్యమైన పరమాత్మతో ఐక్యత వలన లభించే సుఖం – ఆనందం అందుకునేవరకు, మానవుడికి తృప్తిలేదు. అసంతృప్తి తీరదు.

కామెంట్‌లు లేవు: