15, ఫిబ్రవరి 2021, సోమవారం

పరమాత్మ

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

*పరమాత్మ చివరి సందేశం !* 

            🌷🌷🌷

ద్వాపరయుగం ఇంకా కొద్ది రోజులలో ముగిసి పోయి కలియుగం రాబోతుందనగా ఒకరోజు,

శ్రీకృష్ణుడు బలరాముడితో  “అవతార పరిసమాప్తి జరిగిపోతుంది. యదుకుల నాశనం అయిపోతుంది. మీరు తొందరగా ద్వారకా నగరమును విడిచి పెట్టెయ్యండి” అని  చెప్పడాన్ని ఉద్ధవుడు విన్నాడు.


ఇతడు శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత ముఖ్య సఖుడు మరియు పరమ ఆంతరంగిక విశేష భక్తుడు.


ఆయన కృష్ణుడి దగ్గరకు వెళ్లి  “కృష్ణా! మేము నీతో కలిసి ఆడుకున్నాము, పాడు కున్నాము, అన్నం తిన్నాము, సంతోషంగా గడిపాము. ఇలాంటి కృష్ణావతారం ముగిసి పోతుంది అంటే విని నేను తట్టుకోలేక పోతున్నాను.  నిన్ను విడిచి నేను ఉండలేను.  కాబట్టి నా మనసు శాంతించేటట్లు నిరంతరమూ నీతో ఉండేటట్లు నాకేదయినా ఉపదేశం చెయ్యి” అన్నాడు.


అప్పుడు కృష్ణ పరమాత్మ కొన్ని అద్భుత మయిన విషయములను ఉద్ధవుడితో ప్రస్తావన చేసాడు.


ఇది మనం అందరం కూడా తెలుసుకుని జీవితంలో పాటించవలసిన శ్రీకృష్ణ పరమాత్మ చిట్టచివరి ప్రసంగం.


దీని తర్వాత యింక కృష్ణుడు లోకోపకారం కోసం ఏమీ మాట్లాడలేదు.  ఇది లోకమును ఉద్ధరించ డానికి ఉద్ధవుడిని అడ్డుపెట్టి చెప్పాడు.


“ఉద్ధవా! నేటికి ఏడవరాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది.  ఏడవరాత్రి లోపల ద్వారకా పట్టణమును సముద్రం ముంచెత్తుతుంది. సముద్ర గర్భంలోకి ద్వారక వెళ్ళిపోతుంది. ద్వారకలో ఉన్న వారందరూ మరణిస్తారు.  తదనంతరం కలియుగం ప్రవేశిస్తుంది.


కలియుగం ప్రవేశించగానే మనుష్యుల యందు రెండు లక్షణములు బయలు దేరతాయి.  ఒకటి అపారమయిన కోర్కెలు. రెండు విపరీతమైన కోపం.


ఎవ్వరూ కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో చెయ్యరు.


కోర్కెలచేత అపారమయిన కోపముచేత తమ ఆయుర్దాయమును తాము తగ్గించు కుంటారు.  కోపము చేతను, అపారమయిన కోర్కెల చేతను తిరగడం వలన వ్యాధులు వస్తాయి. వీళ్ళకు వ్యాధులు పొటమరించి ఆయుర్దాయమును తగ్గించి వేస్తాయి.


కలియుగంలో ఉండే మనుష్యులకు రాను రాను వేదము ప్రమాణము కాదు. కోట్ల జన్మల అదృష్టము చేత వేదము ప్రమాణమని అంగీకరించగల స్థితిలో పుట్టిన వాళ్ళు కూడా వేదమును వదిలిపెట్టేసి తమంత తాముగా పాషండ మతములను కౌగలించుకుని అభ్యున్నతిని విడిచిపెట్టి వేరు మార్గములలో వెళ్ళిపోతారు.


అల్పాయుర్దాయంతో జీవిస్తారు. పూజలు, ఉపవాసములు తమ మనసును సంస్కరించు కోవడానికి, ఆచారమును తమంత తాము పాటించడానికి వచ్చాయి. రానురాను కలియుగంలో ఏమవుతుందంటే ఆచారములను విడిచి పెట్టేయడానికి ప్రజలు ఇష్టపడతారు.


ఆచారం అక్కర్లేదనే పూజలు ఏమి ఉంటాయో వాటియందు మక్కువ చూపిస్తారు.  వాటి వలన ప్రమాదము కొని తెచ్చుకుంటున్నామని తెలుసుకోరు.  అంతశ్శుద్ధి ఉండదు.  చిత్తశుద్ధి ఏర్పడదు. 


మంచి ఆచారములు మనస్సును సంస్కరిస్తాయి అని తెలుసుకోవడం మానివేసి ఏ పూజచేస్తే, ఏ రూపమును ఆశ్రయిస్తే ఆచారం అక్కర్లేదని ప్రచారం ఉంటుందో అటువైపుకే తొందరగా అడుగువేస్తారు. కానీ దానివలన తాము పొందవలసిన స్థితిని పొందలేము అని తెలుసు కోలేకపోతారు.


ఇంద్రియములకు వశులు అయిపోతారు.⁠⁠⁠⁠  రాజులే ప్రజల సొమ్ము దోచుకుంటారు. ప్రజలు రాజుల మీద తిరగబడతారు.


ఎవడికీ పాండిత్యమును బట్టి, యోగ్యతను బట్టి గౌరవం ఉండదు. 


కలియుగంలో ఏ రకంగా ఆర్జించా డన్నది ప్రధానం అవదు. ఎంత ఆర్జించా డన్నది ప్రధానం అవుతుంది.


ఎవడికి ఐశ్వర్యం ఉన్నదో వాడే పండితుడు. భగవంతుని పాదములను గట్టిగా పట్టుకుని తరించిన మహాపురుషులు ఎందరో ఉంటారు.  అటువంటి మహా పురుషులు తిరుగాడిన ఆశ్రమములు ఎన్నో ఉంటాయి.  కలియుగంలో ప్రజలు అందరూ గుళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళే కానీ, అటువంటి మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమాల సందర్శనం చేయడానికి అంత ఉత్సాహమును చూపరు. అటువంటి ఆశ్రమములలో  కాలు పెట్టాలి.  అటువంటి మహా పురుషుల మూర్తులను సేవించాలి.


కానీ అక్కడకు వెళ్ళకుండా హీనమయిన భక్తితో ఎవరిని పట్టుకుంటే తమ కోర్కెలు సులువుగా తీరగలవు అని ఆలోచన చేస్తారు.  ఈశ్వరుని యందు భేదమును చూస్తారు.


కాబట్టి నీకు ఒకమాట చెపుతాను.  ఈ వాక్యమును నీవు బాగా జ్ఞాపకం పెట్టుకో. ‘యింద్రియముల చేత ఏది సుఖమును యిస్తున్నదో అది అంతా డొల్ల.  అది నీ మనుష్య జన్మను పాడు చేయడానికి వచ్చినదని గుర్తు పెట్టుకో.  దీనినుంచి దాటాలని నీవు అనుకున్నట్లయితే ఇక్కడి నుండి బదరికాశ్రమమునకు వెళ్ళిపో’


కలియుగంలో నామమును గట్టిగా పట్టుకోవడం నేర్చుకో. ఈశ్వర నామమును విడిచిపెట్టకు.


ప్రయత్నపూర్వకంగా కొంతసేపు మౌనంగా ఉండడానికి ప్రయత్నించు. మౌనము, యింద్రియ నిగ్రహము, జపము, తపస్సు, మంత్రమును అనుష్ఠానము చేయుట, భగవన్మూర్తి ముందు కూర్చొనుట, ఈశ్వరుని సేవించుట మొదలగు పనులను ఎవరు పాటించడం మొదలు పెట్టారో వారు మెట్లెక్కడం మొదలు పెడతారు.


అందరూ వీటిని ప్రారంభించాలి.  వీటిని చేస్తే క్రమంగా వారికి నేను యింద్రియములకు లొంగని స్థితిని యిస్తాను.


ఆశ్రమములన్నిటిలో నేను గృహస్థా శ్రమము అయి వున్నాను.  గృహస్థాశ్రమంలో వేదము చెప్పిన యింద్రియ సుఖము ధర్మబద్ధమయినది. వేదము ఎలా చెప్పిందో అలా నీవు యింద్రియ సుఖమును అనుభవించవచ్చు.


కానీ సుఖములా కనపడుతున్నది సుఖము కాదనే సత్యమును నీవు తెలుసుకోగలగాలి.  అలా తెలుసుకొనిన నాడు నీ యింద్రియములకు లౌల్యము ఉండదు.  సుఖము సుఖము కాదని తెలుసు కోవడానికి ఆశ్రయ నీయము గృహస్థాశ్రమము. గృహస్థాశ్రమములో ఉండి ఆ ఆశ్రమము యదార్థ ధర్మములను పాటిస్తూ యింద్రియములకు లొంగనివాడు ఎవడు ఉన్నాడో వాడు శమమును పొంది ఉన్నాడు.


కంచుతోకాని, సీసంతో కాని, వెండితో కాని, బంగారంతో కాని నా మూర్తిని తీసి యింట పెట్టుకో.


సాత్త్వికమయిన మూర్తిని తీసుకు వచ్చి యింట్లో పెట్టి పువ్వులు వేయడం మొదలు పెడితే మొదట్లో నీవు నైవేద్యం పెట్టినది ఆ మూర్తి తింటున్నదని అనుకుంటావు.


నీవు వేసిన పువ్వులను అది పుచ్చుకుంటుందని అనుకుంటావు.  అది క్రమంగా నీ అహంకారమును ఆ మూర్తి తినెయ్యడం మొదలు పెడుతుంది.  క్రమక్రమంగా నీవు ఆ మూర్తి ఆశీర్వచనం మీద ఆధారపడడం ప్రారంభిస్తావు.


మనస్సు తొందరగా నిలబడడానికి విగ్రహారాధనం అనేది ఒక ఆలంబన. కొన్నాళ్ళకి ప్రతి జీవి గుండెలలోను పరమాత్మ ఉన్నాడనే సత్యమును గ్రహించగలుగుతావు.

అపుడు ఎక్కడ చూసినా నీకు నారాయణుడే కనిపిస్తాడు.


పరమాత్మ అనేక రూపములతో దర్శనం అవుతాడు.  జీవుడు అంతటా ఉన్న ఈశ్వరుని చూస్తూ ఉండగా ఒకనాడు వానిలో వున్న ప్రాణవాయువు ఉత్క్రమణమును పొందుతుంది.  వాడు నన్నే చూస్తూ వెళ్ళిపోయాడు కాబట్టి వాడు నాయందే చేరిపోతున్నాడు.

కాబట్టి ఉద్ధవా, నీవు ఈ పని ప్రారంభించు.  కలియుగం వచ్చేస్తోంది. బదరికాశ్రమమునకు చేరిపో” అన్నాడు.  ఉద్ధవుడు బయలుదేరి బదరికాశ్రమమునకు వెళ్ళిపోయాడు.


ముందు బలరాముడు వెనుక పరమాత్మ నడిచి విడి విడిగా అడవులకు వెళ్లిపోయారు. బలరాముడు నడుస్తూ నడుస్తూ తన శరీరమును విడిచి పెట్టేసి తన చైతన్యమును అనంతునిలో కలిపివేశాడు.


కృష్ణ పరమాత్మ ఒక పొదచాటుకు వెళ్లి నేలమీద పడుకొని మోకాలు మీద రెండవ కాలు పెట్టి పాదమును కొద్దిగా కదుపుతూ పడుకున్నాడు.


దూరంనుంచి బోయవాడు వేటకై వచ్చి అక్కడ పొదలలోకి చూశాడు.  ఒక పొదలో జింక చెవి కదులు తున్నట్లుగా కనపడింది.  ఆ జింక చెవి మీదికి బాణం వేస్తే తల లోకి గుచ్చుకుంటుందని అనుకుని బాణమును కృష్ణ పరమాత్మ కాలిమీద ప్రయోగించాడు.


యాదవ వంశ నాశనము కొరకు పుట్టిన ముసలమును గొల్ల వారు అరగ తీయగా మిగిలిన ముక్క ఈ బోయవాడికి దొరికి బాణంలా మారి, ఏ పాదములయితే ఈ గోపాల బాలురను అలరించాయో, లోకము నంతటినీ పవిత్రం చేశాయో, ఏ పాద చిహ్నములను స్వామి ఈనేల మీద మోపాడో, ఏ మహానుభావుడు కురుక్షేత్రంలో అర్జునుడి రథం మీద కూర్చుని గీతోపదేశం చేశాడో, ఏ పాదములను నమ్మి అర్జునుడు ధన్యుడు అయిపోయాడో, ఏ పాదమును పట్టుకుని కొన్ని కోట్లమంది మోక్షమును పొందారో,  ఆర్తితో పిలిచిన వాళ్ళ దగ్గరకు పరుగెత్తుకుని వచ్చి ఏ పాదములు దర్శనం యిచ్చాయో, అటువంటి పాదముల బొటనవ్రేలి దగ్గరికి ఆ బాణం వెళ్ళి గుచ్చుకుంది. కృష్ణ పరమాత్మ  “హా”  అని అరిచాడు.


ఆ శబ్దం విని బోయవాడు అయ్యో మనుష్యుడిని కొట్టానని పరుగెత్తాడు.  కృష్ణ పరమాత్మ పడుకుని ఉన్నారు. రక్తం ధారలా కారుతోంది.


అదిచూసిన బోయవాడు  “అయ్యో! ఎంత పొరపాటు చేశాను స్వామీ నా జన్మకు యిక నిష్కృతి లేదు” అని నేలమీద పడి ఏడ్చాడు.


అపుడు కృష్ణ పరమాత్మ “నాయనా నీవు నిమిత్త మాత్రుడవు. నా మరణమును ఎవరూ తప్పించలేరు. ఎంతటివాడయినా కూడా ఒకసారి ఈ శరీరం లోకి వచ్చిన తరువాత ఈ శరీరమును వదిలి పెట్టవలసిందే.  నేను కూడా పెద్దల వాక్కును పాటించాను, అందుకని కాలికి బాణం తగిలితే ప్రాణం విడిచి పెడుతున్నాను” అన్నాడు.


దారుకుడు పరుగుపరుగున అక్కడికి వచ్చాడు. “ఏమిటి స్వామీ ఈ పరిస్థితి? మీరిలా పడిపోవడమా? కృష్ణుడు శరీరం వదిలిపెట్టడమా!” అని విలపించాడు. 


అపుడు కృష్ణుడు  “నా అవతారం పరిసమాప్తి అయిపోతున్నది.  ఈ గుర్రములు, రథములు అన్నీ అదృశ్యం ఇప్పుడు యాదవులు అందరూ కొద్ది క్షణములలో మరణించబోతున్నారు” అని చెప్పాడు.


 పరిత్రాణాయ సాధూనాం

 వినాశాయ చ దుష్కృతామ్ ।   

 ధర్మసంస్థాపనార్థాయ 

 సంభవామి యుగే యుగే॥

           🌷🌷🌷🌷

కామెంట్‌లు లేవు: