10, ఏప్రిల్ 2021, శనివారం

చిట్టికథ

 ✍️......నేటి చిట్టికథ


కేంగేరి అనే గ్రామంలో ఒక జమిందారుండేవాడు. అతడు చాలా ధర్మాత్ముడు. పేదవాళ్లు వచ్చి జీవనోపాధి చేసుకోవడానికి ఏ సహాయం అడిగినా లేదనేవాడుకాదు. 


ఒక రోజు అతని వద్దకు సోమయ్య అనే ఒక పేదవాడొచ్చాడు.


 జమిందారు అతనికి పుష్కలంగా పాలునిచ్చే ఆవునిచ్చి పాలవ్యాపారం చేసుకొని జీవించమన్నాడు.


 సోమయ్య జమిందారుతో "అయ్యా, తమరేమో ఆవునిచ్చారు. కానీ దానిని ఉంచడానికి మా చిన్న ఇంటిలో స్థలం లేదు." అన్నాడు.


 జమిందారు కొంత ధనమిచ్చి, ఆవును కట్టివేయడానికి ఒక గుడిసె వేసుకోమన్నాడు.


"అయ్యా ఆవునిచ్చారు. దానికి గడ్డీ దాణా ఎలా కొనను?" అన్నాడు సొమయ్య


 అందుకు జమిందారు ఆవుకు కావలసిన గడ్డీ, దాణా కూడా ఉచితంగా తానే ప్రతీరోజు తన ఇంటి నుండి పంపిస్తానన్నాడు.


రెండు రోజులు గడిచాయి. సోమయ్య  జమీందారు దగ్గరకు వచ్చి "అయ్యా నాకో ఇబ్బంది వచ్చింది. పాలు బజారుకు తీసుకెళ్లి అమ్మాలంటే కష్టంగా ఉంది. ఈ పని చేసే అలవాటు లేదు." అన్నాడు.


జమిందారు ఆ పాలను తానే కొంటానన్నాడు. 


http://T.me/namonarayana

మరో రెండు రోజులు గడిచాయి. 


ఈసారి సోమయ్య జమిందారు వద్దకు వచ్చి, "అయ్యా . ఈ ఆవుకు చాకిరీ చెయ్యడం, ఇంట్లో అన్నం వండుకోవడం మొదలైన పనులు చేయడం నా భార్యకు చాలా కష్టంగా ఉంది" అన్నాడు. 


జమిందారు ఆలోచించి "సరే మీకు శ్రమ లేకుండా ఒక పనిమనిషినీ, వంట మనిషినీ పంపిస్తాను" అన్నాడు.


సోమయ్య ఇంటికి పనిమనిషి వంట మనిషి వచ్చారు.


 సోమయ్యకు, అతని భార్యకు చాలా సంతోషమయింది. వంట వండిపెట్టింది. భోజనం వేళకు సరిగ్గా ఇంటికి ముగ్గురు యువకులు వచ్చారు.


 వీరు ఎందుకొచ్చారో సోమయ్య అర్థం కాలేదు. 


వాళ్లు సోమయ్య తో.. మమ్ములను జమిందారు పంపించారు. మీరు భోజనం చేయడం కూడా బద్దకం వల్ల కష్టంగా ఉంటుందని అందువల్ల ఆ పని చేయడానికి పంపించారు" అన్నారు.


సోమయ్య, అతని భార్యకు సిగ్గువేసింది. 


ఆ రోజు నుండి సోమరితనానికి స్వస్తిచెప్పి బాగా కష్టపడటం అలవాటు చేసుకొన్నారు



🪴🦚🪴🦚🪴🦚🪴🦚🪴🦚🪴


 *వార్ధకం వయసా నాస్తి  మనసా నైవ తద్భవేత్‌ ।* 


 *సంతతోద్యమ శీలస్య నాస్తి వార్ధక పీడనమ్‌ ।।* 


వార్థక్యం అనేది వయస్సు చేత మాత్రమే, మనస్సు చేత కాదు. దాని నుండి కూడా ఉద్భవించ రాదు. సోమరితనం వీడి ఎల్లప్పుడూ శ్రమించే వానికి ముసలితనపు పీడ ఉండదని సుభాషితం.


🪴🦚🪴🦚🪴🦚🪴🦚🪴🦚🪴

కామెంట్‌లు లేవు: