2, ఫిబ్రవరి 2022, బుధవారం

కాలినడకన

 మనకు నాలుగు ఇంగ్లీష్ ముక్కలు రాగానే, పురాణాలను, దేశాన్ని, ఆచారాలను, సంప్రదాయాలను, పెద్దలను, సంస్కృతాన్ని విమర్శించే స్థాయికి వచ్చామని విర్రవీగుతుంటారు కొంతమంది.

వాళ్ళకు బుద్ధి వచ్చే సంఘటన ఈ మధ్యనే జరిగింది. 

దివాకర్ అనే వ్యక్తి రాసిన పోస్టు దీనికి మూలం.


''నాసిక్ హై వే మీద, రోడ్డు మీద వెళుతున్న జనాల వంక ఆసక్తిగా చూస్తున్న ఒక వృద్ధ జంటను చూసాను. చూడ్డానికి వాళ్ళు చాలా పేదవారిలా, ఏదో అవసరంలో ఉన్నవారిలా అనిపించింది. నేను వారికి ఆహారం కానీ, మరేదైనా సహాయం కావాలా అని అడిగి వారు మొహమాట పడుతుంటే, ఒక వంద రూపాయల నోటు ఇస్తే వాళ్ళు నిరాకరించారు. నేను వాళ్ళ గురించి అడిగితే వాళ్ళు చెప్పిన విషయం విని నా మతి పోయింది. 


 *వాళ్ళు 2200 కిలోమీటర్ల దూరాన్ని మూడు నెలల్లో కాలినడకన పూర్తి చేసి ''ద్వారక''కు తిరుగు ప్రయాణం చేస్తున్నారట.* ఇల్లు చేరడానికి మరొక నెల పడుతుందట. 


అలా ఎందుకు నడవడం అని నేనడిగిన ప్రశ్నకు ఆయన, 


నా చిన్నప్పుడు నా రెండు కళ్ళలోని చూపు పోతే, మా అమ్మ డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళింది. కానీ, అక్కడి డాక్టర్లు, ప్రపంచంలోని ఏ గొప్ప డాక్టరు కూడా కళ్ళు తెప్పించలేడని చెప్పారట. అయినా, వాళ్ళమ్మ పట్టుబట్టి ఆపరేషన్ చేయమని, ఫలితం భగవంతునికి వదిలేద్దామని చెప్పిందట. అంతేగాక, తన కొడుకుకు కంటి చూపు వస్తే, కొడుకుని కాలి నడకన పండరిపూర్, తిరుపతికి యాత్రకు పంపిస్తానని మొక్కుకున్నదట. అతనికి చూపు వచ్చిందట. 


అందుకని ఆ కొడుకు కాలి నడకన, అమ్మ కోరిక ప్రకారం యాత్ర పూర్తి చేసి, తిరుగు ప్రయాణంలో ద్వారకకు బయల్దేరారట. 


కానీ, మరి ఆ స్త్రీ ఎందుకు ప్రయాణం చేస్తుందనే ఆసక్తితో అడిగితే, ఆమె, 


'నా భర్త ఒంటరిగా అంత దూరం కాలినడకన వెళ్ళడం ఇష్టం లేకా, దారిలో ఆయనకు అన్నపానీయాలు అమరుస్తూ, ప్రయాణంలో ముచ్చటించుకుంటూ సరదాగా గడపవచ్చని నడుస్తున్నానని' చెప్పింది. 


వాళ్ళిద్దరూ చక్కటి హిందీ, ఇంగ్లీషుల్లో మాట్లాడడం చూసి వారి చదువు గురించి ప్రశ్నించిన నాకు వారు చెప్పిన సమాధానం విని మతిపోయింది. 


ఆ మగ వ్యక్తి *ఆస్ట్రో_ఫిజిక్స్* లో *పి.హెచ్.డి* చేసి లండన్ లోని ఒక ప్రముఖ విశ్వవిద్యాలయంలో ఏడేళ్ళు *సీ_రంగరాజన్*, *కల్పనా_చావ్లాతో* కలిసి పనిచేసాడట....

అతని భార్య లండనులోని ఒక విశ్వవిద్యాలయం నుండి *హ్యూమన్_సైకాలజీలో_ పీ హెచ్ డి* చేసిందని చెప్పేసరికి నాకు మూర్ఛ వచ్చినంత పనైంది. వాళ్ళ ముఖాల్లో అంత చదువుకున్నామనే, అంత గొప్పవారమనే ఛాయలు కనిపించడమే లేదు. 


వాళ్ళు చెప్పిన మరొక విషయం కూడా నన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేసింది. వాళ్ళకు వచ్చే పెన్షన్ మొత్తం అంధులకు సహాయం చేసే, ఒక ట్రస్టుకు విరాళంగా ఇస్తున్నారట. 


 *అతని పేరు డాక్టర్ దేవ్ ఉపాధ్యాయ.* 


 *ఆమె పేరు డాక్టర్ సరోజ్ ఉపాధ్యాయ.* 


తల్లి మొక్కును ఇప్పటికైనా తీర్చిన వాళ్ళిద్దరి మహోన్నతమైన వ్యక్తిత్వం నేటి తరానికి ఆదర్శం. 


ఇది కదా మన దేశపు ఔన్నత్యం.                      ఆదిరాజు వెంకట్ రావు

కామెంట్‌లు లేవు: