1, సెప్టెంబర్ 2021, బుధవారం

తర్పణాదులు

 💐💐పితృ తర్పణాదులు:💐💐


ఇది అతి ముఖ్యమైన విషయం. అందరూ పూర్తిగా చదివి, తగిన వారు, తెలుసుకోని ఆచరించండి


మానవ జన్మ పొందిన ప్రతి జీవికి ఋణత్రయ బంధం ముడిపడి వుంటుంది. భగవంతుడు మనకు ప్రసాదించిన బుద్ధి జ్ఞానాల ద్వారా మనం ఋణ త్రయ విముక్తి పొందటానికి చేయవలసిన కర్మను పూర్వులు నిర్దేశించారు. 


ఋణ త్రయాలు :


1.ఋషి ఋణము, 

2. దేవ ఋణము, 

3. పితృ ఋణము.


1 ఋషి ఋణము: 


ఋషుల వల్ల లభించిన జ్ఞానం బ్రహ్మ చర్య పాలన ద్వారా వేదాధ్యయనం, సంధ్యావందనం కర్మలను నిష్ణగా ఆచరించడం ద్వారా మానవులు ఋషి ఋణాన్ని తీర్చుకోగలుగుతారు.


2. దేవ ఋణము: 


దేవతలకు ఆహారాన్ని అందించడం ద్వారా ఇది తీరుతుంది. యజ్ఞ యాగాది కర్మల నాచరిస్తూ అందు సమర్పించే హవిస్సుల ద్వారా దేవతలకు ఆహారం అందుతుంది. దేవ ఋణ విముక్తికి తోడ్పడుతుంది.


3. పితృ ఋణం: 


మన శరీరాల జన్మ కారణమైన పితృ దేవతల అనుగ్రహాన్ని కూడా మానవులు తప్పని సరిగా పొందాలి. సత్సంతాన రూపంలో కొన్ని దేహాలు సృష్టించబడి సృష్టి కార్యవృద్ధి పొంది పిండోదక దానాలు జరిగితే పితృ దేవతలు తృప్తిపొంది వారు సంతానాన్ని ఆశీర్వదిస్తారు. అప్పుడు పితృ ఋణ విముక్తి కలుగుతుంది.

పితరులు గతించిన అనంతరం వసు, రుద్ర, ఆదిత్య స్వరూపులుగా వారు ప్రకృతిలో లయించి ఉంటారు. కాబట్టి ఆయా రూపాలలో వున్న పితృ దేవతలకు శ్రాద్ధ కర్మలు, దర్శశ్రాద్ధ తిల తర్పణ రూపంలో తృప్తిపరిస్తే వారివారి కుటుంబాలకు పితృదేవతల ఆశీస్సులు లభించి వారి కుటుంబాలు సుఖ శాంతులతో వర్ధిల్లుతాయి. కావున ప్రతి ఒక్కరు పితృ ఋణ విముక్తుల ఎలా కావాలో చెపుతూ పెద్దలు నిర్దేశించిన కర్మకాండలను విధిగా మనం ఆచరించాలి.


ప్రతి నెలా చేయాల్సిన తిల తర్పణం (దర్శ శ్రాద్ధం) మరియు సంవత్సర శ్రాద్ధ కర్మలు విధిగా చేయాలని పెద్దలు నిర్దేశించారు.


అలాగే, ప్రతిసంవత్సరం భాద్రపద మాసంలో కృష్ణపక్షం ఆరంభమైన వెంటనే పితృదేవతలందరు భూలోకంలోని తమ తమ సంతతివారు మహాలయ శ్రాద్ధము లేదా తిల తర్పణం చేయుదురని ఆయన్నము లేదా తిలోదకములను తృప్తిగా గ్రహించాలని, భుజించాలని మిక్కిలి ఆశతో వారు భూలోకానికి వచ్చి కార్తీక శుక్ల పక్షం వరకు ఇక్కడ వసిస్తారు.

ఈ మహాలయ పక్షం మరియు ఆ పక్షములో నిర్వహించాల్సిన విధో విధానాలను ఆ సందర్భము వచ్చినపుడు సవివరంగా తెలుసుకుందాం.


1 తర్పణాలు ఎప్పుడాచరించాలి: 


దర్శ శ్రాద్ధమనబడే తిల తర్పణాలను ప్రతి నెలా అమావాస్య, సూర్య సంక్రమణము ఆరంభం నాడు, సూర్య చంద్ర గ్రహణ పుణ్య కాలమునందును, మహాలయ పక్షంలోను, ప్రత్యాబ్ధికములు (శ్రాద్ధములు) చేసిన మరుసటి దినము (పరేహణి) తర్పణం చేయుట ధర్మమని పెద్దలు ఆదేశించి వున్నారు.


2. ఎవరు తర్పణం చేయాలి:

 

I. తండ్రి గతించిన వారందరు తర్పణం చేయాలి. 

II. తండ్రి జీవించివున్నవారు తర్పణములు చేయకూడదు. III. తల్లి జీవించి వుండి, తండ్రి గతించినవారు ఆపై మూడు తరముల పితరులను స్మరిస్తూ తర్పణం చేయాలి.


3. తర్పణం ఎవరెవరికి చేయాలి: 


I.ఒక్క పరేహణి తర్పణం తప్ప మిగతా అన్ని కాలాలలోని తర్పణాలు పితృ మాతృ వర్గ ద్వయ పితరులకు (వారిని ఆహ్వానించి) తర్పణం చేయాలి. 

II. మాతృ/పితృ ప్రత్యాబ్దిక శ్రాద్ధము చేసిన మరుదినము ఉదయమే పితృ వర్గము వారిని మాత్రమే ఆహ్వానించి తర్పణము చేయవలయునని నిర్దేశించబడింది. 

III. మాతా మహులు (తల్లియొక్క తండ్రి) జీవించి వున్నచో మాతృవర్గము వారికి తర్పణము చేయవలసిన అవసరం లేదు.


వర్గద్వయమనగా పితృవర్గము (తండ్రి వైపు) వారు. మరియు మాతృవర్గము (తల్లియొక్క తండ్రివైపు) వారు.


పితృవర్గంలో (పురుషులు):


పితృ(తండ్రి), పితామహ (తాత), ప్రపితామహ (ముత్తాత) తాతకు తండ్రి ఇలా మూడు తరముల వారు. ఈ ముగ్గురిని వసు, రుద్ర, ఆదిత్య స్వరూపులుగా దర్భలపై/భుగ్నములపై ఆహ్వానించి తర్పణం చేయాలి.


పితృవర్గంలో (స్ర్తీలు):


మాతృ (తల్లి), పితామహి (తండ్రికి తల్లి), ప్రపితామహి (తండ్రి, తండ్రికి తల్లి) ఇలా మూడు తరాల వారు పై వరుసలో జీవించి వున్న వారిని వదిలి ఆపై తరము వారిని ఆహ్వానించాలి.


మాతృవర్గంలో (పురుషులు):


మాతామహుడు (తల్లికి తండ్రి), మాతుః పితామహుడు (తల్లి తండ్రికి తండ్రి), 

మాతుః ప్రపితామహూడు (తల్లి తాతకు తండ్రి) ఇవి మూడు తరాలు. 

ఈ మూడు తరాల వారిని వసు, రుద్ర, ఆదిత్య స్వరూపులుగా ఆహ్వానించి తర్పణం చేయాలి.


మాతృవర్గంలోని స్ర్తీలు: మాతా మహి (తల్లియొక్క తల్లి), 

మాతుః పితామహి 

(తల్లి తండ్రికి తల్లి), మాతుః ప్రపితామహి (తల్లి తండ్రి తండ్రికి తల్లి)

ఇవి మూడు తరాలు.


మానవుడు నేడు ప్రతీ పనికీ ద్రవ్య రూపంలో లాభాన్నే వెతుకుతున్నాడు. అలా ద్రవ్య-వస్తు రూపంలో పొందలేని అనేకాదులు భక్తి శ్రద్ధలతో ఈ కర్మ చేయడం వలన మనం పొందవచ్చును.


ప్రతి శ్రాద్ధ కర్మ, తర్పణంరోజున, గతించిన పితరులు, వసు రుద్ర ఆదిత్య స్వరూపులై ప్రకృతిలో అంతర్లీనమై వున్న పితృదేవులను ఆహ్వానించి, అర్చించి తిల తర్పణాదులు ఆచరించి, అనంతరం వారిని యధా స్థానానికి సాగనంపడం సదాచారం.


భారతీయ సంస్కృతి మనకు ప్రసాదించిన ఉత్కృష్టమైన ఈ కర్మకాండ ఎంతో అమూల్యమైనది. ఈ విధముగానైనా మనం, మన పిల్లలు తమ తమ, తండ్రి, తాత, ముత్తాతలను, ఆపై తరంవారు వారి భార్యల (సపత్నీకానాం) పేర్లు తెలుసుకుని గుర్తుంచుకునే అవకాశం కలుగుతుంది.


అట్లే తల్లివైపు మూడు తరాల స్ర్తీ పురుషుల పేర్లు గోత్రం కూడా తెలుస్తుంది. ఈ సందర్భంగానైనా మన పూర్వులను స్మరించుకునే అవకాశం కలుగుతుంది.


మనంవారికేం చేయగలుగుతాం? మననుండి వారు ఆశించేదేమిటి? 

కేవలం భక్తితో వారిని స్మరిస్తూ ఆహ్వానించి తిల తర్పణం (నువ్వుల నీళ్లు దర్భలపై వదలడమే కదా! 

మనకీ జన్మకారుకులైన పితృదేవలతలకు కృతజ్ఞతలర్పించుకోవడం ( అంటే ఈ తర్పణాల ద్వారా) మన విద్యుక్త ధర్మం కదా! దీనిద్వారా మన కుటుంబంలో తండ్రి, తల్లివైపు మూడు తరాల వారిని తెలుసుకునే సదవకాశం కలుగుతుంది. ఈ ధర్మం లుప్తం కానంత కాలం నిరంతరం సాగే ప్రక్రియ.


తర్పణం చేయకుంటే ఏమవుతుంది: 


తర్పణం అనేది పితృదేవతలకు మన కృతజ్ఞతలు తెలుపుకునే మానసిక యజ్ఞంలాంటిది. లౌకికంగా ఆలోచిస్తే మనకు క్షణ కాలం బస్సులో సీటుఇచ్చిన వాడికి లేదా ఇంకా ఏదో చిన్న సహాయంచేసిన వారికి కృతజ్ఞతలు (ధాంక్స్ అని చెపుతాము) అంటూ కరిగిపోతూ చెబుతామే! 

మరి మనకు ఈ మానవ జన్మనిచ్చి, ఈ శరీర సృష్టికే కారణమై, మనకు జీవితాన్ని ప్రసాదించిన పితృదేవతలకు కృతజ్ఞతలు తెలుపకపోవడంలో ఎంత స్వార్ధమో, ఎంత మూర్ఖమో ఒక్క సారి అందరూ ఆలోచించండి.


కాబట్టి ప్రతి ఒక్కరు మన పూర్వులకై ఇలాంటి సత్కర్మలను ఆచరించి వారిని తృప్తిపరుస్తూ వారి ఋణాన్ని తీర్చుకుని వారి ఆశీస్సులు పొందడం సదా వాంఛనీయం, సర్వ శ్రేయస్కరం‌.


అన్ని అమావాస్యలు మరియు సంక్రమణ తర్పణాలు తప్పక చేయాలా: 


వీలైనంతవరకు అన్ని అమావాస్యలు (సంవత్సరంలో 12సార్లు) సౌరమానం ప్రకారం సంక్రమణ ఆరంభ దినాలు (సంవత్సరంలో 12 సంక్రమణాలు) మరియు గ్రహణాల, మహాలయ పక్షాల వంటి సందర్భాల్లో తర్పణాలు చేయాలని శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి. 


అలా వీలుకానిపక్షంలో అమావాస్య తర్పణలు తప్పక చేయాలి. సౌరమానులకు సంక్రమణాలు ప్రధానం. ఆమావాస్య తర్పణాలతో బాటు (ఉత్తరాయణ పుణ్యకాలం మకరం) సౌరమాన సంవత్సర ఆరంభంలో మేషం, దక్షిణాయన ఆరంభంలో కర్కాటకం మరియు తుల, సంక్రమణాలు, ఈ నాలుగు సంక్రమణాలలోనైనా తప్పక తర్పణం చేయాలి. 

మహాలయ పక్షాలలో విధిగా తర్పణం చేసి తీరాల్సిందే. ఇదంతా ఎంతో కష్టమనుకుని బాధపడుతూ చేయడం సరికాదు. మనసారా శ్రద్ధ, భక్తితో మన పితృదేవులకు కృతజ్ఞతలు తెలుపుకునే ఉత్తమ యజ్ఞంలా భావించి చేయాల్సిందే కానీ, ఏదో వంతుకు, నలుగురేమైనా అనుకుంటారేమో అని చేయాల్సింది కాదు. అందుకే ‘శ్రద్ధ యా దీయతే ఇతి శ్రాద్ధం’ అన్నారు పెద్దలు.


బ్రహ్మకపాలం, కాశీ, గయలలో శ్రాద్ధ తర్పణాలు మరియు పిండ ప్రదానాలు చేస్తే ఇక తర్వాత చేయనవసరం లేదా:


‘దేవ పితృ కార్యాభ్యాం నప్మ మది తవ్యం’ అంటుంది శాస్త్రం. 

అంటే ఆయా సందర్భాల్లో ఆచరించాల్సిన దేవ, పితృ కార్యాలను తప్పనిసరిగా విధిగా ఆచరించాలని దీని అర్ధం. అంతేకానీ బ్రహ్మకపాలం, కాశీ, గయలలో శ్రాద్ధ తర్పణాలు మరియు పిండ ప్రదానాలు చేస్తే ఇక తర్వాత చేయాల్సిన అవసరం లేదనేది ఎక్కడా చెప్పబడలేదు. ఈ వాదన సరైంది కాదు. ప్రతి అమావాస్య, సంక్రమణం ఇతర విశేష దినాలలో పితృదేవతలు మననుండి ఆశించేది కృతజ్ఞతలే కదా?

ఈ శ్రాద్ధ తర్పణాల ద్వారా పితృదేవులకు కృతజ్ఞతలందచేసుకోవడంలో బద్ధకించడం ఘోరమైన అపచారమే అవుతుంది. 

ఈ సదాచారాన్ని మనంపాటించకపోతే, మన పితృదేవతలను మనం మరిచిపోవడమే అవుతుంది. మనమే మన పూర్వులను మరిచిపోతే మన పిల్లలు, తర్వాతి వారు మన వంశం గురించి ఎలా తెలుసుకోగలుగుతారు?


కాబట్టి తీర్ధ విధులు (తీర్థ క్షేత్రాలలో కావించే శ్రాద్ద తర్పణాలు) వేరు, నిత్యాబ్ధీకాలు, తర్పణాలు వేరు. కావున ఈ కర్మలు ఆచరించడం భారమనుకోవడం భక్తి శ్రద్ధలు లేక విసుగుతో చేయడం క్షమించరాని అపచారమే తప్ప మానవ ధర్మమనిపించుకోదు.


తర్పణము చేయుటకు అశక్తులు మరియు అనర్హులకు ఏమిటి పరిష్కారం: 


ఒక వీధిలో ఒక చోట మంటపెట్టి అందులో గుప్పెడు మిరపకాయలు గనక వేస్తే దాని ఘాటు ఆ వీధిలోని వారందరికీ ఎలా చేరుతుందో అదే విధంగా ఆ వీధిలో ఏ కొందరో ధర్మకార్యాలు చేస్తుంటే దాని ప్రభావం, అస్సలు ఏమీ చెయ్యని వారికి కూడ అందుతుందనే వాస్తవం పై ఉదాహరణ వివరిస్తుంది. పూర్వం రాజుల కాలంలో ఋషులు యజ్ఞ యాగాదులు, జప తపాలు చేస్తూ వుంటే, అలా చేసే వారిని రాజులు ప్రోత్సహించి, పోషించేవారు.

ఆ రాజ్యంలో సుఖ శాంతులు విలసిల్లుతాయనేది ప్రత్యక్ష సత్యం.

కామెంట్‌లు లేవు: