30, జనవరి 2021, శనివారం

సర్వభూత గణామేయ సౌహార్దాయ 141

 Forwarded message


సర్వభూత గణామేయ సౌహార్దాయ 141 


శ్రీమఠంలో ప్రతిరోజూ సాయంత్రం, ఏనుగులకు బెల్లం కలిపిన అన్నాన్ని పెద్ద పెద్ద ముద్దలు బంతులుగా పెట్టడం అలవాటు. మావటి ఆ అన్నం ముద్దలను చేతిలోకి తీసుకుని, నేరుగా ఏనుగు నోట్లో పెట్టేవాడు.


ఒకరోజు ఏనుగులకు అన్నం పెట్టే సమయంలో పరమాచార్య స్వామివారు మామూలుగా అటువైపు వచ్చారు. ముద్దలుగా చేసిన అన్నాన్ని చూశారు. దగ్గరలోనే ఉన్న సహాయకునితో, “ఈ అన్నం ముద్దలను ఏనుగుకు తినిపించవద్దు అని మావటికి చెప్పు” అని చెప్పి వెళ్ళిపోయారు.


వెంటనే మేనేజరుని పిలిచారు స్వామివారు.


“ఏనుగుకు పెట్టే అన్నాన్ని సరిగ్గా ఉడికించలేదు. పొడిగా, తరకలుగా విరిగిపోతోంది. ఇంత అశ్రద్ధతో, ఇలా దానికి ఆహారం పెట్టరాదు. అది మాటలురాని ఒక జంతువు, దానికి ఇలా సగం ఉడికిన అన్నం పెడతారా? మావటికి చెప్పు. ఈ ఏనుగుకు పెట్టే ఆహారం సాక్షాత్ గజముఖునికి పెట్టే నైవేద్యం లాగా ఉండాలి. అంత భక్తి ఉండాలి. అంత శ్రద్ధ ఉండాలి. మరలా అన్నం వండి, ఏనుగుకు పెట్టండి” అని చెప్పారు.


మాటలురాని ఒక జంతువుపై స్వామివారికి ఉన్న కారుణ్యాన్ని చూసి శిష్యులు కరిగిపోయారు.


మహాస్వామి వారు ఆ అన్నం ముద్దల్ని చేతిలోకి తీసుకుని పరిశీలించలేదు. అంతెందుకు, అసలు ఒక్క క్షణం అక్కడ నిలబడి వాటివైపు కూడా చూడలేదు. మరి అది సరిగ్గా ఉడకలేదని, తరకలుగా అయిపోయిందని స్వామివారికి ఎలా తెలుసు?


ఇంత చిన్న విషయాల్లో కూడా స్వామివారు తమ సర్వజ్ఞత్వాన్ని చూపేవారు.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

కామెంట్‌లు లేవు: