20, నవంబర్ 2023, సోమవారం

కార్తీక పురాణము-- 8

 కార్తీక పురాణము-- 8


*కార్తీక పురాణము- ఎనిమిదవ అధ్యాయము*


వశిష్ట మునీంద్రా!నా మనస్సులో గొప్ప సందేహము కలిగినది.ఆ సందేహమును తెలిపెదను,దానిని నశింపజేయుము.


మీరు నాకు ధర్మసూక్ష్మమును చెప్పితిరి.పాతకములలో గొప్పవానిని చెప్పినారు. వర్ణ సంకరకారకములైన మహాపాపములు చేసిన దుర్జనులు వేదత్రయోక్తములయిన ప్రాయశ్చిత్తములను జేసికొని పరిశుద్ధులగుదురని ధర్మశాస్త్రములందు చెప్పబడియుండగా మీరు ధర్మలేశముచేతనే పరిశుద్ధులై విష్ణులోకమును పొందుదురని చెప్పినారు.అది ఎట్లు సంభవమగును?ఓ మునీశ్వరా! అనంత పాతకములు చేసి, ఈ పాపములు గొప్పవనియు వీటికి ప్రాయశ్చిత్తములు చేయించుకొనవలెననియు తెలిసియు అట్లు చేయక దైవవశముచేత సంభవించి కార్తీకదీపదానాది పుణ్యముల వలన వైకుంఠమునకు పోవుట ఎట్లు సంభవించును? వజ్రపర్వతమును గోటికొన చివరిభాగముచేత చూర్ణము చేయసాధ్యమా? స్వయముగా గొప్ప పర్వతమునెక్కి అక్కడనుండి క్రిందకిపడుతూ మధ్యనున్న చిన్నతీగను పట్టుకున్న యెడల పడకుండునా?ఇట్టి దృష్టాంతములనుబట్టి చూడగా అధికములయిన పాపములను చేసి స్వల్పపుణ్యము చేత వాటిని నశింపచేయుట ఎట్లు శక్యమగును?నాకీ సంశయమును నశింపజేయుము.నాకే కాదు, వినువారికందరికిని ఇది ఆశ్చర్యకరమే.


కార్తీక, మాఘ, వైశాఖమాసములందు చేసిన స్వల్ప పుణ్యమే అధిక పాతకములను నశింపచేయునని మీరు చెప్పారు.అది ఎట్లు సిద్ధించును? అని అడిగిన రాజు మాటలను విని వశిష్ఠమునీంద్రుడు చిరునవ్వు నవ్వి, కొద్ది పుణ్యముచేత పెద్ద పాపములెట్లు నశించునో అని ఆశ్చర్యముతో ఉన్న రాజుతో ఇట్లనెను.


ఓరాజా! వినుము. మంచి విమర్శ చేసితివి.నేనుగూడ విచారించితిని.వేద,శాస్త్ర పురాణములను విచారించగా ధర్మములలో సూక్షములున్నట్లు తెలిసినది.అట్టి సూక్ష్మ ధర్మములు ఎంతపనినైన చేయ సమర్థములు.


ఒకానొకప్పుడు గొప్ప పుణ్యము గూడా స్వల్పమై పోవును.ఒకప్పుడు స్వల్ప పుణ్యమే అధిక ఫలప్రదమగును.కనుక ఈవిషయమందు సందేహము పొందకు చెప్పెదను సావధానముగా వినుము.


ధర్మములు గుణత్రయముతో గూడుకొని స్వల్పాధికములగును.గుణములు సత్వము, రజస్సు, తమస్సు అనునవి మూడు. ఈమూడు గుణములును ప్రకృతివలన గలిగినవి. ప్రకృతియనగా మాయ.అందులో సత్వగుణమువలన చేయబడిన ధర్మమును సూక్ష్మమందురు.


ప్రాయశ్చిత్తములన్నియు తమస్సువలన కర్మకాండయంతయు రజోగుణము వలన కలిగినవి.తిరిగి జన్మ ఇచ్చునని తమోగుణము వలన చేసిన ధర్మము తామసమనబడును.ఇది నిష్ఫలము.


ఇందులో సత్వగుణముతో చేయబడిన ధర్మమును సూక్ష్మమని నీకు చెప్పితిని. అది కొంచెమైనను కాలయోగము వలన వృద్ధినొందును, దేశమనగా పుణ్యక్షేత్రము. కాలమనగా పుణ్యకాలము,పాత్రమనగా యోగ్యుడైన బ్రాహ్మణుడు.ఈమూడు విధముల యోగ్యతను విచారించక విధిరహితముగాను, మంత్రరహితముగాను, చేయి దానాదికము తామసమనబడును.ఇది ఎంతగొప్పదయినను సర్వపాపనాశన సామర్థ్యము గలది గాదు.


ఓ జనకమహారాజా! దేశ,కాల, పాత్రములను విచారించి చేసిన ధర్మము అక్షయమై మోక్షహేతువగును.ధర్మము అధికమో, స్వల్పమో కాలమును బట్టి విచారించి నిశ్చయించవలెను. దేశ,కాల విచారణ చేసిన ధర్మమువలన సుఖమును పొందుదురు.కాబట్టి జ్ఞానముచేతగాని, అజ్ఞానముచేతగాని దేశకాలపాత్ర విచారణతో చేసిన ధర్మము అక్షయఫలము ఇచ్చును.ఇందుకు సందియములేదు.


పర్వతముయెత్తుల కట్టెలను పేర్చి అందులో గురవింద గింజంత అగ్నిని ఉంచినయెడల ఆ కట్టెలన్నియు బూడిదయగును.గృహములోని చీకటిని చిన్న దీపమును వెలిగించిన నశించును.చిక్కగా ఉన్న బురదనీటిలో ఎంతకాలము స్నానము చేసినను చివరికి నిర్మల జలమందు ఒకమారు స్నానమాచరించిన యెడల ఆ మురికిపోవును.అట్లే, అల్ప పుణ్యముచేత అధికపాపములు నశించగలవు.అజ్ఞానముచేతగాని, జ్ఞానముచేతగాని చేసిన పాపములు అధికములుగాని స్వల్పములుగాని హరినామ సంకీర్తనమువలన నశించును.


మహిమ తెలియక చేయబడినదయినను హరినామ సంకీర్తనముచే పాపములన్నియు వెదురు పొదలను అగ్నివలె దహించును.పైన చెప్పిన విషయమై ఒక కథను చెప్పెదను వినుము.


పూర్వకాలమునందు కన్యాకుబ్జమను క్షేత్రమందు వేదవేదాంగపారంగతుడైన సత్వనిష్ఠుడను నొక బ్రాహ్మణుడుగలడు. ఆ బ్రాహ్మణునకు పతివ్రతయు, ధర్మాత్మురాలు అగు భార్య కలదు.వారిరువురకు చివరికాలమున అజామిళుడను ఒక కుమారుడు పుట్టెను.అజామిళుడు దురాచారుడును, దాసీభర్తయు, హింసకుడును, నిత్యము దాసీ సాంగత్యమందు ఆసక్తిగలవాడై యుండెను.

అట్టివాడు స్వల్పపుణ్యముచేత అనగా తెలియక చేసిన హరినామ సంకీర్తనము వలన తరించెను. ఆ


అజామిళుడు ప్రవర్తించిన ప్రకారము ఎట్లనిన, అజామిళునకు యౌవనము రాగానే దుష్ట బ్రాహ్మణుని ఇంటిలో ఒక దాసి ఉన్నది.దానితో సంగమము చేసి దాని యందు ఆసక్తుడై తల్లిని తండ్రిని విడిచి కామాతురుడై దానితోనే జలపానము, భోజనము, శయనము జరుపుచు వైదిక కర్మలను విడిచి కామశాస్త్ర ప్రవీణుడై ఆలింగన చుంబనాది కర్మలయందాసక్తి గలవాడై ఆ దాసీతోనే నిరంతరము కాలము గడుపుచుండెను.ఆ అజామిళుడిట్లు కులాచార భ్రష్టుడైన కారణమున బంధువులందరు అతనిని గృహమునుండి వెళ్ళగొట్టిరి.


అజామిళుడు ఆ ఊరిలోనే యొక చండాలుని ఇంటిలో నివాసము చేసికొని నిత్యము దాసీతోగూడి కుక్కలను ఉచ్చులువేసి, మృగములను పట్టుకొనుచు వాటిని వెంటబెట్టుకొని అరణ్యమునకు పోయి పశువులను, పక్షులను, మృగములను చంపి వాటి మాంసమును భుజింపుచు కాలము గడుపుచుండెను.


ఇట్లుండగా ఒకనాడు ఆ దాసీ కల్లుద్రాగుదమను యాశతో తాటి చెట్టెక్కి కొమ్మవిరిగి క్రిందబడి మృతిబొందెను.తరువాత అజామిళుడు భార్యను జూచి తన ప్రాణములకంటె అధికప్రియమైనది గనుక చచ్చిన శవమును తన ముందు ఉంచుకొని, వికలుడై బహుశోకించి తరువాత దానిని కొండగుహయందు పారవైచి ఇంటికిబోయెను.తరువాత అజామిళుడు యౌవనవంతురాలయిన దాని కూతురుని చూచి పాపాత్ముడు గనుక తన పుత్రికయను నీతిని విడిచి దానితో చిరకాలము సంభోగించి సుఖించెను.తరువాత అజామిళునకు ఆ కూతురియందు కొందరుపుత్రులు గలిగి నశించిరి.అందు చివరివాడు మాత్రము మిగిలియుండెను. వానికి 'నారాయణ ' అను నామకరణము చేసి అజామీళుడు నడుచునప్పుడును, కూర్చుండునప్పుడును, జలపానకాలమందును, భోజనముచేయునప్పుడును, తిరిగుచున్నప్పుడును పుత్రపాశముచేత బద్ధుడై నిరంతరము ఆనామమునే పలుకుచుండెను.


కొంతకాలమునకు అజామీళునకు మరణకాలము సమీపించగా అతనిని తీసుకొనిపోవుటకు ఎర్రనిగడ్డములు, మీసములు గలిగి చేతులందు దండములను రాళ్ళను కత్తులను ధరించి భయంకరులైన యమదూతలు వచ్చిరి.


అజామీళుడు తనను దీసుకొని పోవవచ్చిన యమదూతలను జూచి భయపడి పుత్రస్నేహముచేత దూరమందు ఆటలోనున్న కుమారుని "నారాయణా, నారాయణా!' అని పిలిచెను.


ఆ పిలుచునప్పుడు భయముచేత, దీనస్వరముతో, పెద్దగా "ఓ!నారాయణా!" అని పలుమారులు పిలిచెను.


రాజా! దైన్యముతోగూడి నారాయణ నామసంకీర్తనమును మరణకాలమందు అజామీళుడు చేయగా విని యమదూతలు ఆలోచించి దగ్గరకు రా వెరచి దూరముగా పోయి భయముతో నుండిరి.


అంతలో తేజోవంతులైన విష్ణుదూతలు వచ్చి యమదూతలను జూచి ఓయీ! ఈ అజామీళుడు మావాడుగాని మీవాడుగాడని పలికిరి.


రాజా! ఆ విష్ణుదూతలు పద్మములవలె విశాలములయిన నేత్రములు గలవారును, పచ్చని పట్టుబట్టలను ధరించిన వారును, పద్మమాలాలంకృతులును, కిరీటవంతులును, కుండలధారులును, మంచి మాలికలు, వస్త్రములు, ఆభరణములు గలవారును, నాలుగు చేతులు గలవారును, సుందరదేహులును, శంఖచక్రములను ధరించినవారును, తమ కాంతిచేత దేశమంతయు ప్రకాశింపజేయువారును అయి ఉండిరి.


ఇట్టి విష్ణుదూతలను జూచి యమదూతలు మీరుఎవ్వరు? కిన్నరులా? సిద్ధులా? చారణులా? దేవతలా? అని యడుగగా యమదూతలను ధిక్కరించి విష్ణుదూతలు అజామీళుని తమ పుష్పకవిమానము ఎక్కించుకొని తమ లోకమునకు తీసుకొని పోవుకోర్కెగలవారై, ఇట్లు పలికిరి.


*ఇతి స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే అష్టమోధ్యాయసమాప్తః*

కామెంట్‌లు లేవు: