శ్రీరామ (18 )
( వాల్మీకి రామాయణం - 11)
🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏
(23-3-'26 ' సాయంత్రం ' పోష్టు తరువాయి భాగము)
విశ్వామిత్రుని యాగ సంరక్షణ అయిన మరుసటి రోజు, రామ లక్ష్మణులు, ప్రాతః కాల సంధ్యావందనాది నిత్యకృత్యములు ఆచరించి విశ్వామిత్రునకు నమస్కరించారు.
శ్లో// ఇమౌ స్మ ముని శార్దూల కింకరౌ సముపస్థితౌ/
ఆజ్ఞాపయ యథేష్టం వై శాసనం కరవామ కిమ్//
( ఓ ముని శ్రేష్ఠా! ఇదిగో నీ కింకరులమైన మేము వచ్చాము. ఏమి చేయవలెనో మమ్ము ఆజ్ఞాపించుము).
ఆ విధంగా రామ లక్ష్మణులు అనగానే,విశ్వామిత్రుని అనుజ్ఞ తీసుకుని అక్కడ ఉన్న మహర్షులు, వారితో ఇలా అన్నారు.
" మేమందరము, మిథిలా పట్టణములో, జనకమహారాజు చేస్తున్న యజ్ఞం చూడాలనుకుంటున్నాము.
ఆ జనక మహారాజు దగ్గర అద్భుతమైన శివ ధనస్సు ఉన్నది.
శ్లో//నాస్య దేవా న గన్ధర్వా నాసురా నచ రాక్షసా:/
కర్తు మారోపణం శక్తా న కథంచన మానుషా://
(దేవతలుగాని, గంధర్వులుగాని,అసురులు,రాక్షసులు గాని,ఆ వింటికి శరము సంధించటం, కాదు గదా, కనీసం ఆ ధనస్సును వంచి నారిని కూడా కట్టలేరు.ఇక మనుష్యుల సంగతి వేరే చెప్పనక్కర్లేదు).
వంశ పారంపర్యంగా జనక వంశీయుల చేత పూజలందుకుంటున్న ఆ ధనస్సును, యజ్ఞమును,నీవు కూడా చూద్దువుగాని. మాతోబాటు మిథిలా నగరానికి, మీ ఇరువురు రండి."
అన్నారు.
సంతోషముతో సమ్మతించిన, రామ లక్ష్మణులతోను, ఋషిగణముతోను,విశ్వామిత్ర మహర్షి, సిద్ధాశ్రమ వనదేవతలను పూజించి,ప్రేమతో తమను అనుసరించి వస్తున్న మృగములను,పక్షులను,వెనుకకు పంపించి, మిథిలా పట్టణానికి ప్రయాణం అయ్యాడు.
అనేక దివ్యమైన పుణ్యగాధలను వినిపిస్తూ, దీర్ఘ ప్రయాణము తరువాత విశ్వామిత్రమహర్షి, మిథిలా నగర ప్రవేశం చేశారు.
ఆ నగరాధి దేవతకు నమస్కరించారు.
వారంతా ఆ పట్టణ సమీపమున పాడుబడి ఉన్న ఒక ఆశ్రమాన్ని చూచారు.
ఆ ఆశ్రమాన్ని గురించి రాముడు అడుగగా మహర్షి ఈ విధంగా చెప్పారు.
" రామా! పూర్వము ఇది దివ్యమైన ఆశ్రమము.
అహల్యాదేవీ సమేతుడై గౌతమమహర్షి ఇక్కడ అనేక సంవత్సరములు తపస్సు చేశాడు.
ఒక రోజు గౌతమ మహర్షి నదీ స్నానమునకు వెళ్ళినప్పుడు, దేవేంద్రుడు, గౌతముని రూపంలో, రహస్యముగా ఆశ్రమంలో ప్రవేశించి, గౌతమ మహర్షి భార్య అయిన అహల్యతో సంభోగించాడు.
అతడు ఇంద్రుడని తెలిసినా కామం వల్ల ఏర్పడిన బలహీనత వల్ల,అహల్యాదేవి అడ్డు చెప్పలేదు.
ఇంతలో స్నానం పూర్తి చేసుకుని ఆశ్రమానికి వచ్చిన గౌతమ మహర్షి, తన రూపంతో ఆశ్రమం నుండి బయటకు వస్తున్న దేవేంద్రుని చూచాడు.
జరిగిన దుష్కృత్యాన్ని గ్రహించి తీవ్రమైన కోపంతో " నీ వృషణములు పడిపోవుగాక " అని దేవేంద్రుని శపించాడు.
శ్లో//గౌతమే నైవ ముక్తస్య స రోషేణ, మహాత్మనా/
పేతతుర్వృషణౌ భూమౌ సహస్రాక్షస్య తత్ క్షణాత్//
(గౌతముడు ఈ విధంగా కోపంతో శపించగానే, దేవేంద్రుని వృషణములు, తక్షణమే,నేలపై పడి పోయినవి)
ఉత్తమమైన తపస్సు ఆచరిస్తున్నా, మనోనిగ్రహము సాధించలేక అధర్మకార్యం చేసిన అహల్యను, "చాలా కాలం పాటు, ఎవరికీ కనిపించకుండా, వాయు భక్షణ చేస్తూ ఈ ఆశ్రమంలో తపస్సు చేస్తూ ఉండు.
శ్లో//యదా చై తద్వనం ఘోరం రామో దశరథాత్మజః/
ఆగమిష్యతి దుర్ధర్షః తదా పూతా భవిష్యసి//
(నరసంచారంలేకుండా భయంకరంగా అయిన ఈ వనానికి దశరథ కుమారుడైన రాముడు ఎప్పుడు వస్తాడో, అప్పుడు నీవు కల్మషములన్నీ పోయి,పవిత్రురాలవు కాగలవు) "
ఈవిధంగా ఇంద్రుని, అహల్యను,శపించి, గౌతమ మహర్షి, ఆశ్రమమును విడిచిపెట్టి, తపస్సు చేసుకోవడానికి హిమాలయ పర్వతములకు,వెళ్ళాడు.
నాయనా!రామా! పుణ్యాత్ముడైన ఈ గౌతముని ఆశ్రమంలో ప్రవేశించు.
అత్యంత సౌందర్యవతి,గొప్ప సౌభాగ్యవతి, అయిన అహల్యను తరింపజేయుము" అన్నాడు.
ఆ మాటలు విని లక్ష్మణ సమేతుడైన రాముడు, విశ్వామిత్రుని వెనుక నడచుచు ఆ ఆశ్రమములో ప్రవేశించాడు.
ఆ ఆశ్రమంలో రాముడు అడుగు పెట్టగానే,
గౌతముని శాపం సమాప్తమైనది.
దివ్యకాంతులతో అహల్యాదేవి కనిపించింది.
తపస్సు చేత అమె దివ్యతేజస్సుతో మెరిసిపోతోంది.
దేవాసురమానవులు, కనులు మిరుమిట్లు గొలిపే ఆ కాంతిని చూడ లేకుండా వున్నారు.
శ్లో//శాపస్యాంతముపాగమ్య తేషామ్ దర్శన మాగతా/
రాఘవౌ తు తతస్తస్యాః పాదౌ జగృహతుస్తదా//
(గౌతమ మహర్షి శాపం తొలగి పోవడంవల్ల, రామ లక్ష్మణులకు అహల్యాదేవి కనిపించింది. వారిద్దరూ ఆమె రెండు పాదములను పట్టుకుని నమస్కరించారు).
అహల్యాదేవి గౌతమ మహర్షి వచనములను స్మరించి, శాస్త్రంలో చెప్పిన ప్రకారం వారికి,మిక్కిలి భక్తి,శ్రద్ధలతో ఆర్ఘ్య పాద్యాలుఇచ్చి, అతిధి పూజ చేసింది.
రాముడు ఆ అతిధి పూజ స్వీకరించాడు.
తత్ క్షణమే గౌతమ మహర్షి అక్కడ ప్రత్యక్షమైనాడు.
పరమానందంతో అహల్యను తిరిగి స్వీకరించాడు.
ఆ శుభ సమయంలో,
శ్లో//పుష్ప వృష్టి ర్మహ త్యాసీత్ దేవ దుందుభి నిస్స్వనై:/
గంధర్వాప్సరసాం చైవ మహానాసీత్సమాగమ://
(దేవ దుందుభులు మ్రోగినై. పుష్పవృష్టి కురిసింది. గంధర్వులు, అప్సరసలు, ఆట పాటలతో సమాగమమయ్యారు).
శ్లో//సాధు సాధ్వితి దేవాస్తామహల్యాం సమపూజయన్/
తపోబల విశుధ్ధాంగీం గౌతమస్య వశానుగామ్//
(తపోబలంతో పవిత్రురాలైనది, గౌతమ మహర్షితో కూడినది, అయిన ఆ అహల్యాదేవిని "బాగు, బాగు" అని నుతిస్తూ దేవతలందరూ పూజించారు)
ఆ తరువాత గౌతమ మహర్షి, అహల్యాదేవితో కలిసి రాముని యధావిధిగా పూజించాడు.
యథా శాస్త్రముగా చేయబడిన ఆ పూజను రాముడు స్వీకరించాడు.
ఆ విధంగా వారిద్దరి అతిధ్యము స్వీకరించిన రామ లక్ష్మణులు, విశ్వామిత్రమహర్షి, మిక్కిలి ఆనందముతో మిథిలా పట్టణానికి వెళ్లారు.
శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష.
ఓం శా న్తి శ్శాన్తి శ్శాన్తిః
(సశేషం)
శుభమస్తు,
తూములూరి మధుసూదనరావు,
24-3-'26
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి