14, మార్చి 2023, మంగళవారం

శబరి

 శబరి గిరిజన కుటుంబంలో పుట్టిన ఒక స్త్రీ.ఈమె పంపానదీ తీరంలో మతంగ మహాముని వద్ద, ముని కన్యల మధ్య అమాయంకంగా పెరిగింది.అందువలన బోయ కులంలో పుట్టినప్పటికీ ముని చెప్పిన మాటలు శ్రద్ధగావినేది. దాని వలన అమె యోగాభ్యాసం చేసేది.మతంగ మహామునిని పరమశివుడుగా, ఆశ్రమాన్ని కైలాసంగా భావించేది.ఆశ్రమంలో అన్ని పనులు చేస్తూ సేవా మార్గంలో కాలం గడిపేది.        మతంగ మహాముని మాటల్లో శ్రీరాముడు విష్ణుమూర్తి అవతారమని, రాక్షసులను సంహరించిన వీరుడని తెలుసుకుంది.మతంగ మహామునికి రాముడు అరణ్యవాసానికి వెళ్లిన విషయం తపశ్సక్తి ద్వారా తెలిసింది. అలా తెలుసుకున్న మతంగముని శిష్యులు, తాము స్వర్గానికి వెళుతూ శబరికి ఆ విషయం చెబుతారు. వనవాసంలో ఉన్న రాముడు ఒకానొక సందర్భంలో ఆశ్రమానికి వస్తాడని, అతని దర్శనం తర్వాత శబరి కూడా శరీరాన్ని వదలవచ్చని వివరిస్తారు.సీతా,లక్షణ సమేతుడై శ్రీరాముడు ఆశ్రమం వైపు వస్తున్నాడని తెలిసింది.అతణ్ని చూడాలని ఆశపడింది. ఆ ఆశని రాముని గురించి మతంగ మహర్షి చెప్పిన మాటలు రెట్టింపు చేశాయి. ఒక్కసారి జీవితంలో రాముణ్ని చూస్తే చాలనుకుంది. అంతకుమించి ధన్యత లేదనుకుంది. రాముని రూపురేఖలు చూసి తరించాలనుకుంది.          ఎంత కాలం ఎదురు చూసినా రాముడు రాలేదు.అలాగని శబరి ఎదురు చూడకుండా ఉండలేకపోయింది. మతంగ ముని ముసలి వాడై, స్వర్గానికి వెళుతూ రాముడు వస్తాడనీ మరలా చెపుతాడు. నీకు దర్శనభాగ్యం కలిగిందని, ఆశ్రమాన్ని అంటి పెట్టుకొనే ఉండమంటాడు. ఎప్పటికయినా రాముడు వస్తాడని శబరి నమ్మకంతో ఉంటుంది.ఆశ్రమంలో చివరికి శబరి మాత్రమే ఒంటిగా మిగిలింది. రామనామమే  సర్వం అయింది. శబరికికూడా ముసలి తనం వచ్చింది. రాముడు రాలేదు. వస్తాడనే ఆమెకు ఇంకా నమ్మకం. ఒంట్లో శక్తే కాదు, కంటిచూపూ తగ్గింది.అయినా  రాముని వస్తాడనేదానిమీద నమ్మకం తగ్గలేదు. మతంగి ముని మాట మీద గురి పోలేదు.రాముడు వస్తాడని ప్రతిరోజు వేకువ ఝామునే ఆశ్రమ పర్ణశాలను శుభ్రం చేసి, అలికి ముగ్గులు పెట్టేది. నదిలో స్నానం చేసి కడవతో నీళ్ళు తెచ్చేది. పూలు, పళ్ళూ తెచ్చేది. పూలను మాలకట్టి అలంకరించేది.ఫలహారంగా పెట్టడానికి పళ్ళను సిద్ధంగా ఉంచేది.ప్రతిరోజూ రాముడొస్తున్నట్లు ఏ రోజుకారోజే ఎంతో ఎదురు చూసేది. రోజులూ నెలలూ సంవత్సరాలూ విసుగూ విరామం లేకుండా అలా ఎదురు చూపులతోనే 13 సంవత్సరాల కాలం గడిపింది.  అందరూ అనుకునేటట్లుగా రాముడు ఆశ్రమానికి వచ్చినప్పుడు శబరి ఎంగిలి పండ్లను ఇవ్వడం వాల్మీకి రామాయణంలో లేదని తెలుస్తుంది. అడవిలో దొరికిన ఆహారంతోనే ఆమె రామలక్ష్మణులకు ఆతిథ్యం ఇస్తుందని, ఆ తరువాత రాముని అనుమతితో శబరి తన శరీరాన్ని యోగాగ్నిలో అర్పించుకుని మోక్షాన్ని పొందిందని తెలుస్తుంది.ఈ కథలో గిరిజన స్త్రీ అయిన శబరికి  వేదం తెలియనప్పటకీ, యజ్ఞయాగాదులు చేసే అధికారం ఆనాడు లేకపోయిననూ,యోగసాధన, జ్ఞానం, మోక్షం పొందడానికీ అందరూ అర్హులే అని నిరూపించే ఘట్టమే రామాయణంలోని శబరి కథ.

కామెంట్‌లు లేవు: