8, జూన్ 2023, గురువారం

ఎదిగేకొద్దీ

 *ఎదిగేకొద్దీ  ఒదగాలి! - ఎలా?*


మనిషి ఎంత ఎదిగినా ఒదిగివుండాలి కానీ అహంకరించకూడదు.

అహంకారం అనేది నైతికంగా మనిషిని అధఃపాతాళానికి తొక్కేస్తుంది.


అలాగే ఆత్మాభిమానం మంచిదే కానీ  దురభిమానం ఎప్పుడూ ఇబ్బందులు కలిగిస్తుంది.


సకలశాస్త్ర పారంగతుడిని అన్న అహంతోనే రావణాసురుడు తప్పు చేసి, శ్రీరాముని చేతుల్లో  హతుడైనాడు.


దుర్యోధనుడు దురభిమానం తో తొడలు విరిగి నేలకూలాడు.

ఎంతటి తపోధనులైనా సరే అహంకరిస్తే వాళ్ళ తపఃశక్తిని కోల్పోయి, మళ్లీ సంపాదించిన అంశాలెన్నో మన పురాణ, ఇతిహాసాల్లో ఉన్నాయి.

ద్వైతవనంలో ఉన్న పాండవులను అవమానించడానికి దుర్యోధనుడు దూర్వాసునికి సకల సేవలు చేసి మెప్పు పొంది, ఆయనను పాండవుల మీదికి పంపుతాడు.


సూర్య వర ప్రసాదంతో అక్షయపాత్ర ను పొందిన పాండవులు ఎందరో అన్నార్తుల ఆకలి తీరుస్తూ అడవిలో సుఖంగా వున్నారు. విశేషం ఏమిటంటే ద్రౌపది తిన్న తర్వాత ఆ పాత్ర తన శక్తిని కోల్పోతుంది. అది తెలిసి దుర్వాసుడు సమయం మించి వెళతాడు. అప్పుడు ద్రౌపది శ్రీకృష్ణుని ప్రార్థిస్తుంది.                      ఆ ఆపన్నపరాయణుడు అందరినీ స్నానాదులు ముగించుకుని భోజనానికి రమ్మని చెప్పిస్తాడు. అప్పుడు పరమాత్మ లీలచే అక్షయపాత్ర లో ఒక మెతుకు దొరుకుతుంది. అది తిని భగవానుడు నా కడుపు నిండినది అని త్రేన్చగానే   దుర్వాసునికి , అతని నూర్గురు శిష్యులకు అందరికి పొట్ట నిండిపోయి ఆయాసం తో అతలాకుతలం అవుతుంటారు.


ఆ సమయంలో ధర్మజుని ఆజ్ఞతో భీముడు అందరినీ భోజనానికి ఆహ్వానిస్తాడు. శ్రీకృష్ణుడు కూడా వారికై ఎదురుచూస్తూ ఉన్నాడని చెబుతాడు. అప్పుడు వారు ‘ఎవరి అండలో’ ఉన్నాడో ఆ లీలామానుష మూర్తిని గుర్తెరిగిన దూర్వాసుడు తన తప్పిదం తెలుసుకొని ఆయనకు ప్రణమిల్లి అహంకారంతో కోల్పోయిన తమ శక్తిని తిరిగి సంపాదించుకునేందుకు తపస్సుకు వెళ్ళిపోతాడు.

అలాగే విశ్వామిత్రుడు కూడా.!           ఇలా ఎన్నో దృష్టాంతాలు అంటే ఋజువులు మన పురాణ కథల్లో ఉన్నాయి.


పురాణాలు ..మన నైతికతకు గురువులు. ఏది, ఎందుకు, ఎప్పుడు చెయ్యాలి, చేయకూడదు అన్న ఇంగితాన్ని బోధిస్తాయి.


మహాద్భుతమైన మన పుణ్యభూమి, కర్మభూమి గొప్పదనం తెలుసుకుంటే విజ్ఞానవంతులై లోక శ్రేయస్సును పెంపొందిస్తారు. నేను, నాది అన్న అహంకారం వీడండి. భగవంతుడి అండను పొందండి ...

కామెంట్‌లు లేవు: