సావడి కబుర్లు -7
వందేమాతరం
ఈరోజు సహోద్యోగి శ్రీ కొణకంచి వెంకట సుబ్రహ్మణ్యం గారు "ఉఫోరియా" చిత్ర సమీక్ష రాస్తూ సామాజిక పరిస్థితులపై తన ఆవేదనను వ్యక్తం చేశారు. నిజమే, నేటి సమాజాన్ని పరిశీలిస్తే మనసుకు కలిగే భావన ఒక్కటే, ఆవేదన. అభివృద్ధి, ఆధునికత, స్వేచ్ఛ అనే పదాలు మన జీవన విధానాన్ని మారుస్తున్నప్పటికీ, వాటి వెనుక దాగి ఉన్న విలువల సంక్షోభాన్ని మనం గమనించకపోతున్నాం.
అభివృద్ధి పేరుతో ముందుకు పరుగులు తీస్తున్న మనిషి, విలువలను వెనక్కి నెట్టేశాడు. సమాజం అన్ని దిక్కుల నుంచి బంధాలను తెంచుకుంటూ ప్రత్యేకంగా యువత హక్కులు అనే పేరుతో స్వేచ్ఛను విచ్చలవిడితనంగా అలవాటు చేసుకుంటోంది. ఈ పరిణామం ఒక్క వ్యక్తి లేదా ఒక వర్గానికి సంబంధించినది కాదు. ఇది మొత్తం సమాజ నిర్మాణంలో ఏర్పడిన అసమతుల్యతకు ప్రతిబింబం. ఈ విశృంఖలత్వం ఒక భయంకర దావానలంలా నిశ్శబ్దంగా కాని వేగంగా సంస్కారమనే పచ్చని వనాన్ని దహించేస్తోంది. ఈ దావాగ్నిని ఆర్పకపోతే, రేపటి సమాజం విలువల రహితంగా మారే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి పరిష్కారం ఏమిటి? ఎవరిది బాధ్యత? ఎవరు బాధ్యత వహించాలి?.
సమాజం అనే నిర్మాణం కుటుంబం, విద్య, సమాజం మరియు సాంస్కృతిక వాతావరణం అనే నాలుగు స్థంభాలపై నిలబడింది. ఈ నాలుగు చోట్లా బలహీనతలు ఏర్పడినప్పుడు, దాని ప్రభావం ప్రత్యక్షంగా యువతపై పడుతుంది. కుటుంబంలో విలువల బోధన తగ్గిపోవడం, విద్యలో నైతికతకు ప్రాధాన్యం తగ్గిపోవడం, మరియు సమాజంలో వినోదం పేరుతో అసంబద్ధ ప్రభావాలు పెరగడం, సంస్కృతి సంప్రదాయాల పట్ల నిర్లక్ష్యం ఇవన్నీ కలిసి యువతను దారి తప్పిస్తున్నాయి. ఫలితంగా, స్వేచ్ఛకు హద్దులు లేకుండా పోతున్నాయి.ఆత్మ నియంత్రణ అనే గుణం క్రమంగా కనుమరుగవుతోంది.
ఈ పరిణామం ఒక్కరోజులో రాలేదు. కుటుంబంలో విలువల బోధన తగ్గిపోవడం, ఉత్తీర్ణత మాత్రమే అర్హతగా వచ్చిన విద్యా విధానాల్లో మార్పులు, సాంఘిక మాధ్యమాల ప్రభావం అధికం కావడం, స్వేచ్ఛను బాధ్యతల నుండి వేరు చేయడం. ఫలితంగా యువతలో అహంకారం పెరిగింది, ఆత్మ నియంత్రణ తగ్గింది.
ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది కుటుంబంలో పెద్దల పాత్ర. గతంలో పెద్దలు కుటుంబానికి మార్గదర్శకులు, సంస్కారాలకు ప్రతీకలు, అనుభవానికి నిలయాలుగా ఉండేవారు. కానీ నేటి పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. నా బాధ్యతలు నేను నిర్వహించాను. ఇక ఎవరి కుటుంబాల వారివి. నా శేష జీవితాన్ని నాకు అనుకూలంగా, ఎవరికీ అడ్డం లేకుండా నా అభిరుచులకు అనుగుణంగా జీవిస్తాను అన్న దృక్పథం ఎక్కువగా కనిపిస్తోంది. ఇది ఆధునిక కాలంలో వానప్రస్థంగా భావించబడుతున్నప్పటికీ, శాస్త్రాలు చెప్పిన వానప్రస్థ ధర్మం ఇదికాదు. ఇది ఆధునిక కాలం తనకు అనుకూలంగా నిర్వచించుకున్న వానప్రస్థం. బాధ్యతారాహిత్యానికి వేసుకున్న ఒక చక్కని ముసుగు.
మన ధర్మశాస్త్రాలు నిర్వచించిన చతుర్వర్ణ ఆశ్రమాల్లో వానప్రస్థం ఒకటి. భౌతిక ఆసక్తుల (ధనం, కుటుంబం) నుంచి విముక్తి. అంటే ఎవరు గదిలో వారు కూర్చొని "కృష్ణా రామా" అనుకోవడం కాదు. శాస్త్రాలు అంతవరకే నిర్వచించలేదు, సమాజానికి మార్గదర్శకత్వం వహించడం, తదుపరి తరానికి విలువలను అందించడం, అనుభవాన్ని పంచుకోవడం అనే పవిత్ర కర్తవ్యం వానప్రస్థం. అంటే సమాజం పట్ల పెరిగిన మరింత బాధ్యత. అది సమాజంలో ఆధ్యాత్మిక మరియు సంస్కార చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నించే బాధ్యత. మన పరిధిలో కూర్చుని ఉండటం కంటే, మనం సమాజానికి అందించిన రేపటి తరాన్ని (పిల్లలు, యువత) సరైన సంస్కార మార్గంలో పెట్టడానికి ప్రయత్నించాలి. సనాతన ధర్మం ప్రకారం, కుటుంబంలో పెద్దవారు (వృద్ధులు) కుటుంబానికి, సమాజానికి ఎలా ఉపయోగపడాలో ఆలోచించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే *లోకాన్ని వదిలేయడం కాదు, లోకానికి మార్గం చూపడం వానప్రస్థం.*
*తస్మిన్ గృహే భవతి యదా బాల్యం వృద్ధతా ధ్రువా ।*
*తస్య తత్కార్యమాచార్యః ప్రవర్తేత సదా గురుః ॥*
మనుస్మృతిలో చెప్పినట్లు కుటుంబంలో వృద్ధులు గురువులుగా మారి మార్గదర్శకత్వం వహించాలి. శాస్త్రవాక్యాలు కూడా ఇదే విషయాన్ని బలంగా తెలియజేస్తున్నాయి. కుటుంబంలో బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు ప్రతి దశలో పెద్దలు మార్గదర్శకులుగా ఉండాలి. కేవలం మాటలతో మాత్రమే కాదు, ఆచరణతో చూపించే మార్గదర్శకత్వమే నిజమైన ఉపదేశం.
రామాయణంలో దశరథ మహారాజు తన పిల్లలకు ధర్మాన్ని నేర్పించిన విధానం వల్లే శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడిగా ఎదిగాడు. సమాజానికి రక్షకుడు అయ్యాడు. పెద్దలు తమ ఆస్తిగా సంస్కారం కూడా పిల్లలకి ఇవ్వాలి. ఇవ్వకపోతే, పిల్లలు "అధర్మ మార్గం"లో పడతారు. అందుకే
పెద్దల సమయోచిత మార్గదర్శనం లేకపోవడమే మహాభారతంలో కౌరవుల వైఫల్యానికి కారణంగా చెప్పవచ్చు,
నేటి సమాజంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలు కూడా ఇదే లోపాన్ని సూచిస్తున్నాయి. సాంకేతికత ఒక వరంగా మారాల్సింది, కానీ అది కొంతవరకు వ్యసనంగా మారింది. సోషల్ మీడియా ప్రభావం, అసభ్య కంటెంట్, మాదకద్రవ్యాల ఆకర్షణ ఇవన్నీ యువతను నిశ్శబ్దంగా దారి తప్పిస్తున్నాయి. ఒక్క హైదరాబాద్లోనే 2025లో 30% యువత డ్రగ్స్ ప్రభావంలో ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి. ఇవి కేవలం వ్యక్తిగత సమస్యలు కావు, సమాజ భవిష్యత్తును ప్రభావితం చేసే ప్రమాదకర సంకేతాలు. రేపటి తరాన్ని సంస్కారయుతంగా పెంచడం మన ధర్మం. అప్పుడే మన సమాజం ధర్మభూమిగా మారుతుంది.
మరి దీనికి పరిష్కారం లేదా అంటే ఉంది. ఈ సమస్యకు ఒకే వ్యక్తితో పరిష్కారం రాదు, ఇది సమిష్టి బాధ్యత అని తెలుసుకోవాలి.
ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల బాధ్యత అత్యంత కీలకమైంది. పిల్లలకు మంచి విద్య, సౌకర్యాలు ఇవ్వడం మాత్రమే తల్లిదండ్రుల కర్తవ్యం కాదు. వారికి సంస్కారం, విలువలు, నైతికత అనే బలమైన పునాది అందించాలి. పిల్లలతో సమయం గడపడం, వారి ఆలోచనలను అర్థం చేసుకోవడం, మంచి చెడుల మధ్య తేడాను తెలియజేయడం, స్వేచ్ఛకు పరిమితులు నిర్ధారించుకోవడం నేర్పించాలి. ఇవన్నీ తల్లిదండ్రుల బాధ్యతలో భాగం. ఆస్తి కంటే గొప్పది సంస్కారం. అది ఉంటేనే వ్యక్తి సమాజంలో నిలబడగలడు.
పెద్దలు మార్గదర్శనం చేస్తే, తల్లిదండ్రులు సంస్కార బోధన చేయాలి. గురువులు జ్ఞానంతో పాటు నీతి బోధన చేయాలి, సమాజం మంచి వాతావరణం కల్పించాలి. ఈ నాలుగు స్థంభాలు బలంగా నిలబడితేనే యువత సరైన మార్గంలో నడుస్తుంది. మనము రేపటి తరానికి ఏమి ఇస్తున్నామో ఆలోచించాలి.
చివరగా, మనం మనకు మనమే ఒక ప్రశ్న వేసుకోవాలి. రేపటి తరానికి మనం ఏమి అందిస్తున్నాం?. కేవలం సౌకర్యాలనేనా, లేక విలువలతో కూడిన జీవన విధానమా? భవిష్యత్తు సాంకేతికతపై కాదు, సంస్కారం మీద నిలబడుతుంది. సంస్కారం ఉన్న చోటే సమాజం నిలుస్తుంది. అది లేకపోతే అభివృద్ధి కూడా అర్థరహితమవుతుంది, సమాజం కూలిపోతుంది అన్న వాస్తవానికి గ్రహించాలి.
మనందరం కలిసి బాధ్యతగా ఆలోచించి, ఆచరించినప్పుడు మాత్రమే ఈ విశృంఖలత్వాన్ని నియంత్రించగలం. అప్పుడే మన సమాజం మళ్లీ ధర్మం, నీతి, సంస్కారం ఆధారంగా నిలిచే ధర్మభూమిగా వికసిస్తుంది.
ఆలోచిద్దాం, అడుగు ముందుకు వేద్దాం.
మృశి
(దశిక ప్రభాకరశాస్త్రి)
9849795167
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి