🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹
*శనివారం 11 ఏప్రిల్ 2026*
*శ్రీ మహావిష్ణు పురాణం*
`` *54వ భాగం*``
*చంద్రుడు, దత్తాత్రేయుడు, దూర్వాసుల జననం*```
కొంతకాలం తరువాత అత్రి మహర్షి నుండి దివ్య తేజస్సు గ్రహించిన అనసూయాదేవి గర్భవతి అయ్యింది. ఆ రోజు రాత్రి అనసూయ నిద్రపోతున్న సమయంలో త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణుమహేశ్వరులుప్రత్యక్షమైనారు. వారి దివ్యతేజో కాంతులు ముఖం మీద పడటంతో అత్రి మహర్షి మేల్కోని త్రిమూర్తులను చూసి ఆశ్చర్యంతో
నమస్కరించాడు.
అత్రి మహర్షి విస్మయంగా చూస్తుంటే మొదట బ్రహ్మదేవుని నుండి దివ్య కాంతిపుంజం ఉద్భవించి నిద్రిస్తున్న అనసూయ గర్భంలో ప్రవేశించి లీనమైంది. తరువాత శ్రీమన్నారాయణుని హృదయం నుండి దివ్యతేజస్సు అవతరించి అనసూయ గర్భంలో ప్రవేశించింది. పిదప మహాదేవుడి ఫాలనేత్రము నుండి అగ్నిలా ప్రజ్వరిల్లే జ్యోతి ఉదయించి అనసూయాదేవి గర్భంలోకి ప్రవేశించి అంతర్దానమయ్యింది.
త్రిమూర్తుల తేజస్సుల విలీనంతో అనసూయాదేవి బంగారు తేజస్సుతో ప్రకాశించింది. ఈ అద్భుత దృశ్యం చూసిన అత్రి మహర్షి ఆనందబాష్పాలు రాలుతుండగా అంజలి ఘటిస్తూ నమస్కరించాడు. త్రిమూర్తులు ఆశీర్వదించి అదృశ్యమయ్యారు. అనసూయాదేవి గర్భానికి తొమ్మిది నెలలు నిండి పదవ నెల వచ్చింది. ముగ్గురు మహాపురుషులు జన్మించే సమయం ఆసన్నమైంది.
మార్గశిర మాసము ఆరంభమైంది. ఆదివారం ముగిసి సోమవారం మొదలయ్యే రాత్రిలో శుభ తరుణాన బ్రహ్మాంశ సంభూతుడైన చంద్రుడు జన్మించాడు. మరికొంత సేపటికి సోమవార ప్రదోషకాలంలో మృగశిర నక్షత్రంలో విష్ణువాంశ సంభూతుడైన దత్తుడు త్రిముఖములతో, ఆరు భుజములతో దివ్య తేజస్సు విరాజిల్లుతూ జన్మించాడు.
ఆకాశంలో దేవదుందుభులు మ్రోగాయి. దేవతలు పుష్పవర్షం కురిపించారు. అప్సరసలు నాట్యం చేసారు. నారదుడు, తుంబురుడు, గంధర్వులు గానం చేసారు. సనకసనందాది మహర్షులు శుభాశీస్సులు ఇచ్చారు. ఇంద్రాది దేవతలు “జయహో దత్తాత్రేయా!" అని కీర్తించారు. అత్రి అనసూయలకు తనను దత్తం చేసుకోవడం వలన ఆ విష్ణాంశ సంభూతుడు దత్తాత్రేయుడుగా కీర్తించబడ్డాడు.
దత్తాత్రేయ జననం తరువాత కొద్ది సమయానికి శివాంశ సంభూతుడు, ఫాలనేత్రాగ్ని సమానుడు అయిన దుర్వాసుడు జన్మించాడు. అగ్రజుడు అయిన చంద్రుడు దక్ష ప్రజాపతి యొక్క ఇరవై ఏడు కుమార్తెలను వివాహమాడాడు. గ్రహస్థితి పొంది తన నక్షత్ర భార్యలతో ఆకాశంలో విహరిస్తూ చంద్రుడు రాత్రి వేళ వెన్నెలలో, చల్లదనంతో సమస్త జీవులకు మానసిక ఉల్లాసం కలిగించ సాగాడు.
తన పుత్రికలను సమానంగా ఆదరించడం లేదని దక్షుడు కుష్ఠురోగంతో నశించమని చంద్రుని శపించాడు. చంద్రుడు పరమశివుని తపస్సుతో ప్రసన్నం చేసుకుని కుష్ఠురోగం నుంచి విముక్తి పొందాడు. నెలలో పదిహేను రోజులు వృద్ధి చెందేటట్టు, పదిహేను రోజులు నశించేట్టు వరం పొందిన చంద్రుడు పరమేశ్వరుడి శిరస్సున ఉండే భాగ్యం పొందాడు. శివుడు చంద్రశేఖరుడు అయ్యాడు.
శివాంశతో జన్మించిన దూర్వాసుడు తపస్సంపన్నుడయ్యాడు. మూడవ నేత్రపు కిరణాంశ సంభూతుడు కావడంతో ఆగ్రహం దూర్వాస మహర్షికి సహజగుణమైంది. అపర రుద్రుడి వలె ప్రవర్తిస్తు దేవతలు గాని, వేరేవరైనా గాని చేసిన చిన్న తప్పులకు కూడా తీవ్రమైన శాపాలు ఇచ్చేవాడు.
కానీ ఆ శాపాల వలన లోకాలకి శుభం జరిగేది. క్షీరసాగరమధనం దుర్వాసుడు ఇంద్రునికి ఇచ్చిన శాపం వలన జరిగింది. శ్రీహరి కూర్మ వామన పరశురామ రామ బలరామ శ్రీకృష్ణాది అవతారాలు ఎత్తి లోకక్షేమం, ధర్మ రక్షణ చేయడానికి దూర్వాస మహర్షి శాపాల కారణం అని చెప్పవచ్చును.
అవతార పురుషుడు, విష్ణాంశ సంభూతుడు అయిన దత్తాత్రేయుడు చిన్నవయస్సులోనే తపస్సిద్ది పొందాడు. తల్లిదండ్రులకు చెప్పకుండా అజ్ఞాత ప్రదేశానికి వెళ్ళి సంవత్సరాల తరబడి తపస్సు చేసాడు. అత్రి అనసూయలకు దత్తాత్రేయుడు భగవంతుని అవతారము అని తెలియడం వలన దత్తాత్రేయుడి తపస్సుకి అభ్యంతరం చెప్పలేదు.
దత్తాత్రేయుడు వైష్ణావాంశ అని తెలిసిన చుట్టుపక్కల ఆశ్రమాలలో గల మునులు దత్తాత్రేయుడి వద్దకు వచ్చి "దైవస్వరూపా! మాకు గురువై ఉపదేశం చేయండి" అని అభ్యర్థించేవారు.
దత్తాత్రేయుడు "నేను ఎవరికి గురువుని కాను. మీరు నా శిష్యులు కాదు" అని వారికి దొరకకుండా మరో దూర ప్రదేశానికి వెళ్ళి తపస్సు చేసుకునేవాడు.
*(సశేషం)*
*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*
*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*
*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి