25, మార్చి 2026, బుధవారం

వేదాలకు భాష్యాలు

 వేదాలకు భాష్యాలు మాత్రమే ఎందుకు రచించారు భాష్యకారులు? టీక, అనువాదములు వంటి ప్రక్రియలు వేదములకు ఎందుకు లేవు ?

వేదములకూ, బ్రహ్మసూత్రాలకు తదితర మంత్రాత్మకమైన వాఞ్మయానికి భరతవర్షంలో భాష్యాలు చెప్పబడినాయి. శుష్కమైన తాత్పర్యాలు లేవు.


అసలు భాష్యం అంటే ఏమిటి?


సూత్రార్థా వర్ణితం యత్ర పదై సూత్రాంత సారిభిః |


స్వపదాని చ వర్ణాంతే భాష్యం భాష్యవిదో విదుః ||


ఎక్కడైతే మంత్రములో గల శబ్దాలు స్పష్టంగా వివరింపబడి, ఆ వివరణకు ఉపయోగించిన శబ్దజాలానికి అర్థమూ వివరింపబడునో దానిని భాష్యమని భాష్యవిదులు పేర్కొంటారు.


అనగా భాష్యం - మంత్రములకు చెప్పబడుతుంది.


మంత్రములో గల ప్రతి శబ్దానికి వివరణ ఉంటుంది. దీనిని వృత్తి అంటారు.


వృత్తిని స్పష్టీకరించడమూ ఉంటుంది. దీనిని వార్తికము అంటారు. వార్తికం అంటే వృత్తిని విపులంగా చర్చించేది. (వృత్తిం వేదయతి ఇతి వార్తికం)


అంటే భాష్యం అన్నది ఒక సర్వతోముఖమైన, సమగ్రమైన ప్రక్రియ.


"మంత్రబ్రాహ్మణయోర్వేద నామధేయమ్" అని ఆపస్తంబుని సూత్రీకరణ. వేదములు అంటే మంత్రములు, ఆ మంత్రములతో కూడిన యజనక్రియలు.


వేదాంగములు ఆరు. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పమ్. భాష్యకారుడికి ఈ ఆరు వేదాంగములలో పావీణ్యంతో బాటు, మంత్రము యొక్క అర్థం అనుభవజ్ఞానం ఉండవలె. "సమ్యగనుభవసాధనం ప్రమాణమ్";" అనధిగతార్థగంతృప్రమాణమ్".


చిన్న వివరణ. ఉదాహరణకు "ఆకలి" అన్న శబ్దం ఉందనుకోండి. ఆ శబ్దానికి అర్థం ఆ వచనం లో లేదు. ఆకలి శబ్దానికి కేవలం "ఒక సంవేదన" అన్న శుష్కార్థంలో ఇముడదు.ఆకలి కి నిజమైన అర్థం తెలియాలంటే శబ్దజ్ఞానంతో బాటు, ఆ ఆకలి యొక్క అనుభవజ్ఞానం, అన్నం విలువ, దాని పవిత్రత, ఆహారం పెట్టినవాని దయ, ఆ అన్నాన్ని పండించిన వాడి కృషి, వీటి సమగ్రస్వరూపం తెలియాలి.


భౌతికజీవితంలోని అర్థాలకే సమగ్రత్వం ఈ విధంగా ఉన్నప్పుడు - మంత్రస్వరూపంగా వేలాది ఏళ్ళు సాంప్రదాయంలో, సంస్కృతిలో, ప్రతి క్రతువులో, కర్మలో, వ్రతంలో, అనుష్ఠానంలో మమేకమైన వేద మంత్రాలకు భాష్యార్థం ఎంతో శ్రమపడితే తక్క మహనీయులకు కూడా తెలియదు.


వేదాలకు భాష్యం రచించడానికి సాయణాచార్యుడు (మాధ విద్యారణ్యుల వారి తమ్ముడు) 24 ఏళ్ళు శ్రమపడవలసి వచ్చిందని చెప్పుకున్నాడు.


ఋగ్వేదంలో మంత్రాలకు నిరుక్తంలో భాష్యం ఉంది. నిరుక్తకారుడు యాస్కాచార్యుడు. (మనకు 9 నిరుక్తాలు ఉండేవట. ఇప్పుడు దొరికేది యాస్కాచార్యుని నిరుక్తం ఒకటే). సాయణాచార్యుడు చతుర్వేదాలకు భాష్యం రచించినాడు. ఆసక్తి పెంచుకొని ఎవరైనా చదవగలిగితే ఎంతో మంగళకరమైన, మనోజ్ఞమైన భావనలు అందు కనిపిస్తాయి.


వేదభాష్యానికి ఒక్క ఉదాహరణ. ఈ మంత్రాన్ని హిందువులయొక్క ప్రతిక్రతువులోనూ, వ్రతంలోనూ, పెళ్ళికి ముందు వధువు చేసే గౌరీపూజలోనూ పఠిస్తారు. వేల ఏళ్ళుగా భారతసంస్కృతిలో మమేకమైన అందమైన ఋగ్వేదమంత్రం ఇది.


గౌరీ (నిర్)మిమాయ సలిలాని తక్షత్యేకపదీ ద్విపదీ సా చతుష్పదీ |


అష్టాపదీ నవపదీ బభూవుషీ సహస్రాక్షరా పరమే వ్యోమన్ ||


ఈ ఋక్కుకు సాయణాచార్యుని భాష్యం ఇలా ఉంది.


వాగ్దేవి మొట్టమొదట పరమవ్యోమంలో పరబ్రహ్మలో అంతర్గతంగా వున్న గౌరిగా ఏకపది. అదే ప్రణవరూపం.


పిదప సలిల సదృశములైన వర్ణపదవాక్యములను ఆమె సృష్టించింది. వ్యాహృతి (మంత్ర) రూపంలో సావిత్రిగ ద్విపది.


తర్వాత వేదచతుష్టయ రూపంలో చతుష్పది అయినది.


అటుపై, వేదాంగములు, స్మృతి పురాణ ధర్మశాస్త్రములలో అష్టాపది;


మీమాంసా, న్యాయ సాంఖ్య, యోగ, పాంచరాత్ర, పశుపత, ఆయుర్వేద ధనుర్వేద, గాంధర్వ వేదవిద్యా రూపిణియై నవపది. తదనంతరము అనంతవాక్యరూపమున వాగ్దేవి ప్రపంచమంతా ప్రతిభాసిస్తున్నది.


అయితే యాస్కాచార్యుడు గౌరిని - మేఘాల మధ్య విద్యుత్తు అని పేర్కొన్నాడు. ఆయన భాష్యం ఈ క్రింది బొమ్మల్లో చదుకోవచ్చు.మంత్రార్థము (వృత్తి), భాష్యార్థము (వార్తికము) ఇక్కడ చూడవచ్చు.




సాంప్రదాయికంగా భరతవర్షంలో వేదాలకు భాష్యాలు ఉన్నాయని, అవి ఎంతో మనోహరమైన కృతులని చెప్పుకున్నాం.


ఆధునిక కాలంలో - వేదాలను పనిగట్టుకుని నాశనం చేసిన వారు ఆంగ్లేయులు. మనకు సంస్కృతం ఓ మోస్తరుగా కావ్యాలు చదువుకునేంత మోతాదున నేర్చుకోవడానికే జీవితకాలం పడుతుంది. వేదభాష్యాలకు సాయణాచార్యుడంతటి పండితుడికి 24 ఏళ్ళు పడితే ఆంగ్ల అనువాదకులకు యుక్తవయసుకే వేదాలు అర్థం చేసుకునేంత జ్ఞానం వచ్చిందట! అదీ ఒక్క ముక్క సాంప్రదాయం తెలియకుండానే! నిజానికి వీరికి సంస్కృతభాషలో రామ శబ్దం కూడా తెలియదు. అయితే వీరు పేద బ్రాహ్మలతో అర్థాలు చెప్పించుకుని, పెడర్థాలు తీసి "అనువాదాలు" రచించడానికి అనతికాలమే పట్టింది. వీరు చేసింది అనువాదం. అదీ కూడా అక్కడక్కడా పరమహీనమైన పద్ధతిలో ఉంది. ఈ అనువాదకుల్లో రాల్ఫ్ గ్రిఫిత్, మేక్స్ ముల్లర్ లు ముఖ్యులు.


పైన "గౌరీమిమాయ ..." కు అర్థం చూచాం. అసలా అర్థం తెలియకున్నా గౌరి అంటే భారతదేశంలో అమ్మవారు అని అందరికీ తెలుసు 

ఆంగ్ల యులు దానిని

వేరే విధంగా అనువాదం చేయటం జరిగింది

కామెంట్‌లు లేవు: