25, మార్చి 2026, బుధవారం

*శ్రీ మహావిష్ణు పురాణం*

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*బుధవారం 25 మార్చి 2026*


       *శ్రీ మహావిష్ణు పురాణం*

         *36 - 37వ భాగం*


*ధ్రువ చరిత్ర*```


ప్రస్తుత బ్రహ్మ జీవితకాలంలో భూమండలాన్ని పద్నాలుగు మంది మనువుల పరిపాలిస్తారు. వారిలో స్వాయంభువ మనువు మొదటి వాడు. స్వాయంభువ మనువుకి శతరూపకు ప్రియవ్రతుడు, ఉత్తాన పాదుడు అనే ఇద్దరు కుమారులు జన్మించారు. ఉత్తానపాదునికి ఇద్దరు భార్యలు. పెద్దభార్య సురుచికి ఉత్తముడు, రెండవ భార్య సునీతికి ధ్రువుడు పుత్రులుగా జన్మించారు.


ఉత్తానపాదుడు పెద్దభార్య సురుచికిపై ఎక్కువ ప్రేమ చూపిస్తూ చిన్న భార్య సునీతిని దూరంగా ఉంచేవాడు. పెద్దభార్య కుమారుడు ఉత్తముడికి అధిక ప్రాధాన్యత ఇచ్చేవాడు. చిన్నభార్య సునీతి గమనించి తన కుమారుడు ధ్రువునికి నారాయణుని పై భక్తి అలవాటు చేసింది. అయినా ధ్రువునికి మనస్సులో తండ్రి ప్రేమాభిమానాలు పొందాలని, తండ్రి ఒడిలో కూర్చుని ఆడుకోవాలి అని ఉండేది.


ఒకరోజు సింహాసనంపై ఉత్తానపాదుడు తన పెద్ద కుమారుడు ఉత్తముని ఊరువు(తొడ)పై కూర్చుండబెట్టుకుని ప్రేమతో లాలిస్తూ ఆడించసాగాడు. అది చూసిన ధ్రువుడు తనూ తండ్రి ఒడిలో కూర్చుని ఆడుకోవాలి అని పరిగెత్తుకుంటూ దగ్గరకు వెళ్లాడు. పెద్దరాణి సురుచి చూసి పట్టుకుని ఆపి “ధ్రువా! ఉత్తముడు పట్టపురాణి అయిన నా కుమారుడు కనుక సామ్రాజ్యానికి వారసుడు. చక్రవర్తి అంకపీఠంపై(తొడపై) కూర్చునేందుకు అర్హత ఉంది. నీవు నా సవతి కుమారుడివి. కనుక రాజ్యార్హత, తండ్రి ఒడిలో కూర్చుని ప్రేమాభిమానాలు పొందే అర్హత, అధికారం నీకు లేదు" అని కసిరి వెళ్లిపొమ్మంది. 


తండ్రి ఉత్తానపాదుడు మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. 


బాలుడైన ధ్రువుడు దుఖంతో తల్లి వద్దకు వెళ్లి జరిగింది చెప్పి ఏడవసాగాడు. తల్లి సునీతి ధ్రువుని కన్నీరు తుడిచి "లోకంలో అందరికి నారాయణుడు వారి పూర్వజన్మ కర్మ ఫలాల బట్టి సుఖాలు, అదృష్టాలు, అర్హతలు ప్రసాదిస్తాడు. మీ పెద్దమ్మ కుమారుడు ఉత్తముడు పూర్వజన్మ పుణ్య ఫలం వలన పట్టపురాణికి పుట్టి తండ్రి ప్రేమాభిమానాలు, రాజార్హత సంపాదించాడు. నీవు నావంటి దురదృష్టరాలికి పుట్టావు. ఇంతే ప్రాప్తం అని సర్దుకుపోవాలి" అంటూ ఓదార్చింది.


తల్లి మాటల వలన ధ్రువునికి నారాయణుడి అనుగ్రహం సంపాదిస్తే తన తలరాత మారి తండ్రి ప్రేమాభిమానాలు లభిస్తాయి అని అర్థమైంది. 


వెంటనే లేచి తల్లికి నమస్కరించి “అమ్మా! నేను తపస్సు చేసి నారాయణుని అనుగ్రహం పొంది తండ్రి ప్రేమాభిమానాలు సంపాదించుకుంటాను. ఆశీర్వదించి అనుమతి ఇవ్వండి" అని కోరాడు. 


కుమారుని మాటల్లో గల ధృఢ సంకల్పం గ్రహించి సునీతి ఆశీర్వదించి అనుమతిచ్చింది.


ధ్రువుడు అడవికి తపస్సుకి బయలుదేరి వెళ్లాడు. 


పూర్వజన్మ పుణ్య ఫలం వలన ధ్రువునికి మార్గ మధ్యలో నారదుడు, సప్తర్షుల దర్శన భాగ్యం కలిగింది. వారు బాలుడైన ధ్రువుని వివరాలు తెలుసుకుని అతని ధృడ సంకల్పం విని సంతోషం చెందారు. నారాయణుని అష్టాక్షరి మహామంత్రం ‘ఓం నమో నారాయణాయ’ ను నారదుడు విధి పూర్వకంగా ఉపదేశం చేశాడు. 


“నాయనా! ధ్రువా! భక్తి శ్రద్థలతో ఈ నారాయణ మంత్ర జపం చేస్తూ తపస్సు చేయుము. నారాయణుడి అనుగ్రహం తప్పక లభిస్తుంది" అని ఆశీర్వదించి వెళ్ళారు.  


ధ్రువుడు అడవిలో సరోవరం సమీపంలో మంచి ప్రదేశం చూసుకుని శుచియై తపస్సుకి కూర్చున్నాడు. నారాయణుని చిత్తములో నిలుపుకుని ధ్యానమగ్నుడై తపస్సు చేయసాగాడు.


కాలము, ఆకలిదప్పులను మరచిపోయాడు. ధ్రువుని తపస్సు యొక్క తేజస్సు క్రమ క్రమంగా పెరిగి ముల్లోకాలకు వ్యాపించి దహించసాగింది. దేవలోకము కంపించింది. దేవేంద్రుడు ధ్రువుని తపస్సు ఆపదలు కలిగిస్తుంది అని తలచి దిక్పాలకులను పిలిచి తపస్సు భంగం చేయమని ఆదేశించాడు. 


వరుణుడు కుంభవృష్టి కురిపించాడు.. వాయుదేవుడు సుడిగాలి ప్రభంజనాలు సృష్టించాడు. అగ్నిదేవుడు దావానలం సృష్టించి అడవిని దహనం చేశాడు. 


యముడు భయపెట్టాలని భూత ప్రేతాలు, భయంకర సర్పాలు ప్రయోగించాడు. 


ధృవుని చుట్టూ తపోతేజస్సు వలన ఏర్పడ్డ శక్తి వలయం వేటినీ దగ్గరికి రాకుండా, ధ్రువుని తపస్సుకి భంగం చేయకుండా చూసింది.  


ఆగ్రహం చెందిన ఇంద్రుడు వజ్రాయుధం ప్రయోగించాడు. అది కూడా ధ్రువుని చుట్టు ఏర్పడిన తేజోవలయం దాటలేక వెనక్కు తిరిగి వచ్చింది. భయపడిన ఇంద్రుడు వైకుంఠం పరిగెత్తుకుంటూ వెళ్లి నారాయణుని దర్శనం పొంది నమస్కరించి


"నారాయణా! ధ్రువుడి తపస్సు వలన కలిగే అగ్ని ముల్లోకాలను దహిస్తోంది. తపస్సు భంగం చేయాలన్న దిక్పాలకుల ప్రయత్నాలు విఫలం అయ్యాయి. నా వజ్రాయుధం కూడా ఏమి చేయలేక వెనక్కు వచ్చింది. నీవు ధ్రువుని అనుగ్రహించి తపస్సు ఆపకపోతే ముల్లోకాలు ఆ పసివాడి తపశక్తికి కాలి బూడిదై పోతాయి. మమ్మల్ని, లోకాలను రక్షింపుము" అని ప్రార్ధించాడు.


ఇంద్రునికి అభయమిచ్చి పంపి నారాయణుడు ధ్రువుని తపస్సుకి మెచ్చి అతని ఎదుట ప్రత్యక్షమై "కుమారా! ధ్రువా! నీ భక్తికి ప్రసన్నత చెంది వచ్చాను. కన్నులు తెరువుము" అని అప్యాయంగా పిలిచాడు. ధ్రువునికి దివ్యదృష్టి లభించి కన్నులు తెరచి చతుర్భుజుడు, ముగ్ద మనోహరుడు అయిన నారాయణుని చూసి పరవశించి పోయాడు. కన్నుల నుండి ఆనందబాష్పాలు జలజలా జారుతున్నాయి.


"తండ్రీ! నారాయణా! నన్ను అనుగ్రహించి దర్శన భాగ్యం కలిగించావు. నా తల్లి వర్ణించినట్టు నీ దివ్య సుందర రూపం ఉంది. ఓం నమో నారాయణాయ" అని పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. శ్రీహరి ప్రేమతో ధ్రువుని లేపి దగ్గరకు తీసుకుని "ధ్రువా! కోరుకో నాయనా! కోరినవన్నీ అనుగ్రహిస్తాను" అని పలికాడు.


ఆనందబాష్పాలు ఆపుకుంటూ భక్తి తన్మయత్వంతో "నారాయణా! నా సవతి తల్లి సురుచి చేసిన అవమానం భరించలేక నీ అనుగ్రహంతో తండ్రి ప్రేమాభిమానాలు, రాజ్యాధిపత్యం పొందాలని తపస్సు ఆరంభించాను. నీ దివ్య దర్శనంతో నాలోని కోరికలన్ని నశించి పోయాయి. సదా నీ సన్నిధిలో ఉండే దర్శనం పొందే భాగ్యం కలిగించుము" అని కోరుకున్నాడు.


నారాయణుడు మందహాసంతో "ధ్రువ కుమారా! భూమిపై జన్మించినవారు పూర్వజన్మల కర్మఫలం పూర్తిగా అనుభవించిన తరువాతే మోక్షము పొందగలరు. భూమి మీద సకల సంపదలు, సుఖములు, రాజ్యాధికారం అనుభవించుము. పిదప గ్రహనక్షత్ర మండలంలో అత్యున్నతమైన ధృవమండలంలో ధ్రువ నక్షత్రమై నీ తల్లితో కలసి ఉంటావు. ధ్రువ నక్షత్రంగా విశ్వానికి మార్గదర్శనం చేస్తూ కీర్తి ప్రతిష్టలు పొందుతావు. కల్పాంతంలో మోక్షం లభించి నా సన్నిధి చేరుతావు" అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు.


ధ్రువుడు యుక్తవయసు రాగానే శంభువు అనే కన్యను వివాహమాడి శ్లిష్ట, భవ్యుడు అనే ఇద్దరు కుమారులను పొందాడు. ధ్రువ వంశం వీరి ద్వారా వృద్ధి చెందింది. అంగుడు, సమనుడు, అంగిరసుడు, శిబి చక్రవర్తి మొదలైన వారు ఈ వంశములో జన్మించారు..


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

కామెంట్‌లు లేవు: