స్త్రీల సౌందర్యానికి చిట్కాలు -
నల్లటి మచ్చలు ,మంగు నివారణ -
• జాపత్రిని మంచినీటితో మెత్తగా నూరి రాత్రిపూట ముఖానికి లేపనం చేసుకొని ఉదయాన్నే గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపర్చుకొనుచున్న అతిత్వరలోనే ముఖము పైన కల మంగు ,నల్లమచ్చలు మాయం అగును .
• మిరియాలు గోరోజనముతో కలిపి నూరి పైకి లేపనం చేయుచున్న మొటిమలు తగ్గును . మచ్చలు పోవును .
• బాదం పప్పును నీటితో నూరి వడకట్టగా వచ్చిన పాలను ముఖంపై మర్దన చేయుచున్న క్రమంగా నల్లమచ్చలు , మంగు , మొటిమలు త్వరలోనే హరించును .
• ధనియాలు , వస , సుగంధపాల ఈ మూడింటిని సమభాగాలుగా తీసుకుని మెత్తటి చూర్ణముగా చేసి ఈ చూర్ణమును ఒంటికి నలుగు పిండిలా పట్టించుచున్న నల్లటి మచ్చలు , మొటిమలు తగ్గును .
• నిమ్మరసమును పాలతో కలిపి రాత్రిపూట ముఖానికి మర్దన చేసుకుని తెల్లవారిన తరువాత లేవగానే గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుగుకొనవలెను . సబ్బు వాడరాదు . ఇలా క్రమం తప్పకుండా చేయుచున్న మచ్చలు , మంగు పోయి ముఖం కాంతివంతం అగును .
• తులసి ఆకుల రసములో కొద్దిగా టంకణం ( Borax ) కలిపి పైకి లేపనం చేయుచున్న ముఖం పైన మచ్చలు , మంగు హరించును .
• మంజిష్ట చూర్ణమును ఆవుపాలతో కలిపి అరగదీసి అందులో కొంచం తేనె కలిపి ముఖమునకు లేపనం చేయుచున్న నల్లమచ్చలు , మంగు హరించును .మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు .
నిద్రలేమికి సులభ పరిష్కారాలు -
ప్రస్తుతపరిస్థితుల్లో చాలా మంది నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి ప్రధానకారణం మనయొక్క జీవితములో ఎదుర్కొనే ఒత్తిళ్లు కావచ్చు మిగిలిన సమస్యలు ఏవైనా కారణం కావచ్చు. నిద్ర మనిషి జీవితంలో అత్యంత ప్రధానం అయినది. నిద్ర తక్కువ అవ్వడం రోగాలు రావడానికి ప్రధాన కారణం . నిద్ర తక్కువైన మనిషికి త్వరగా వృద్ధాప్య ఛాయలు వచ్చును. కావున వీలయినంత వరకు శరీరానికి విశ్రాంతి ఇవ్వడం మంచిది . అలాంటి విశ్రాంతి కేవలం మంచి నిద్రతోనే లభిస్తుంది. మనలో చాలా మంది నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వారి కోసం ఇప్పుడు నేను చెప్పబోయే యోగాలు చాలా మంచిఫలితాన్ని ఇస్తాయి .
• నిద్రపట్టనప్పుడు ఒక స్పూన్ గసగసాలు వేడిచేసి ఒక గుడ్డలో వేసి మూటకట్టి వాసన చూస్తున్న త్వరలో మంచినిద్ర వచ్చును. మంచి గసగసాలనే వాడండి. మార్కెట్లో తొటకూర విత్తనాలను గసగసాలుగా అమ్ముతున్నారు.
• వెలక్కాయ చిప్పను బియ్యపు కడుగు నీటితో అరగదీసి ఆ గంధాన్ని కణతలకు , నుదురుకు వ్రాసి పడుకున్న నిద్రపట్టును .
• ఉదయం , సాయంత్రం సర్పగంధి వేళ్ళ చూర్ణం పావుస్పూన్ అరకప్పు నీళ్ళలో వేసి తాగుచున్నచో మంచిఫలితం కనిపించును. రక్తపోటు ఉన్నవారికి చాలా అద్భుతంగా పనిచేయును .
• రాత్రి సమయంలో మజ్జిగ లో రెండు నీరుల్లిపాయ ముక్కలను కలుపుకుని లోపలికి తీసుకొండి. మంచి నిద్ర వచ్చును.
• నిద్రపోవడానికి ముందు కప్పు వేడిపాలల్లో అరచెంచా మిరియాల కషాయం కలుపుకుని తాగుచున్న సుఖనిద్ర కలుగును.
• అశ్వగంధ చూర్ణము కూడా బాగా పనిచేయును . ఒక స్పూన్ అశ్వగంధ చూర్ణం ఒక చిన్న గ్లాసు పాలల్లో కలిపి నిద్రపొవడానికి ముందు ప్రతినిత్యం సేవించవలెను .పైన చెప్పిన యోగాలలో మీకు అత్యంత సులభమైన యోగాన్ని తీసుకుని పాటించవచ్చు. సర్పగంధ వేళ్ళ చూర్ణం మీకు ఆయుర్వేద పచారీ సామానులు అమ్మే దుకాణాలలో లభ్యం అగును.
ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి