25, మార్చి 2026, బుధవారం

*శ్రీ మహావిష్ణు పురాణం*

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*మంగళవారం 24 మార్చి 2026*


       *శ్రీ మహావిష్ణు పురాణం*

`` *35వ భాగం*``


*బ్రహ్మ వంశ క్రమము*```


శౌనకాది మునుల కోరిక పై సూత మహర్షి బ్రహ్మ నుంచి సృష్టి ఆరంభమైన విధానం, బ్రహ్మవంశ వృద్ధి వివరించి చెప్పసాగాడు:


“మునులారా! శ్రీమన్నారాయణుని నాభి కమలం నుండి బ్రహ్మ జన్మించిన సంగతి మీకు తెలుసు. బ్రహ్మ నుండి మానస పుత్రులుగా ఇరవై ముగ్గురు ప్రజాపతులు, మహర్షులు, మనువులు ఉద్భవించి సృష్టిని విస్తరింపచేశారు. వంశాభివృద్ది ఎలా జరిగిందో వినండి..


ప్రచేతసులకు దక్ష ప్రజాపతి తిరిగి జన్మించాడు. ఆయనకు అసిక్ని అనే భార్య వలన ఐదువేల హర్యశ్వులు, వేయి మంది శబలాశ్వులు జన్మించారు. నారదుడు వీరిని వైరాగ్య మార్గానికి మళ్ళించాడు. తరువాత అరవై మంది కుమార్తెలు కలిగారు. వీరిలో అదితి, దితి, దనువు, అరిష్ట, సురస, ఖస, సురభి, వినత, తామ్ర, ధవశ, ఇర, కద్రువ, ముని అనే పదమూడు మంది కశ్యప ప్రజాపతికి భార్యలు అయ్యారు.


అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ధ్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, ఉత్తర ఫల్గుణి, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ, మఖ, పుబ్బ, శతభిష, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, శ్రవణం, ధనిష్ఠ, రేవతి అనే దక్ష కుమార్తెలు చంద్రునికి భార్యలు అయినారు.


దక్ష ప్రజాపతికి ఉత్తానపాదుని చెల్లెలు ప్రసూతి మరో భార్య. ఈమెకు ఇరవై నాలుగు మంది కుమార్తెలు జన్మించారు. 

వీరిలో శ్రద్ధ, లక్ష్మి, ధృతి, తుష్టి, మేధ, పుష్టి, క్రియ, బుద్ది, లజ్జ, వపువు, శాంతి, సిద్ది, కీర్తి అనే పదమూడు మందిని ధర్ముడు వివాహం చేసుకున్నాడు.


దక్ష పుత్రికలలో ఖ్యాతిని భృగువు, సతీదేవిని శివుడు, సంభూతిని మరీచి, స్మృతిని అంగీరసుడు, ప్రీతిని పులస్త్యుడు, క్షమను పులహుడు, సంతితిని క్రతువు, అనసూయను అత్రి, ఊర్జను వసిష్టుడు, స్వాహను అగ్ని, స్వధను మనువు వివాహం చేసుకున్నారు.


కశ్యప ప్రజాపతికి దక్షుని పుత్రికలు పదమూడు మందితో కలిపి మొత్తం ఇరవైఒక్క మంది భార్యలు ఉన్నారు. దేవ రాక్షస దానవ మానవ పశుపక్ష్యాది జాతులన్ని వీరి నుంచే జన్మించాయి.


అదితికి ద్వాదశాదిత్యులు, ఇంద్రాది దేవతలు జన్మించారు. దితికి హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, సింహిక జన్మించారు. దనువుకు శబరుడు, ఏకచక్రుడు, మహాబాహువు, తారకుడు, మహాబలుడు, స్వర్భానువు, వృషపర్వుడు, పులోముడు, విప్రచిత్తి మొదలైన దానవులు జన్మించారు.


సురభికి అజుడు, ఏకపాదుడు, ఏకాదశ రుద్రులు జన్మించారు. వినతకు అనూరుడు, గరుత్మంతుడు మొదలైన వారు జన్మించారు. కద్రువకు శేషుడు, వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు, ఆర్యకుడు, కాళీయుడు, మొదలైన నాగులు జన్మించారు. పశుపక్ష్యాది జాతులన్ని కశ్యపుని భార్యల సంతానంగా జన్మించి వృద్ది చెందాయి.


వసిష్టుడు తొలిజన్మలో అరుంధతిని చేసుకుని చిత్రసేనుడు, పురోచిషుడు, విరచుడు మిత్రుడు, ఉల్బణుడు, వసుభృద్యానుడు, ద్యుమంతులను పుత్రులుగా పొందాడు. రెండవ జన్మలో అక్షమాలను పెళ్లాడి నిమి చక్రవర్తి శాపం వలన మరణించాడు. మిత్రావరుణుల కుమారుడిగా మూడవ జన్మ ఎత్తిన ఊర్జను పెండ్లాడాడు. వీరికి రజస్సు, గోత్రుడు, ఊర్థ్వబాహువు, సవనుడు, అనఘుడు, సుతపసుడు, శుక్రుడు జన్మించారు.


భృగువుకి ఖ్యాతి యందు ధాత, విధాత, కవి, లక్ష్మి జన్మించారు. దాతకు ప్రాణుడు, ప్రాణునికి ద్యుతిమంతుడు, అతనికి రాజవంతుడు జన్మించారు. విధాతకు నియతి వలన మృకండుడు, మృకుండునికి మార్కండేయుడు జన్మించారు. వరణునికి కుమారునిగా జన్మించిన రెండవ జన్మలో భృగువుకి భూతుడు, చ్యవనుడు, వజ్రశీర్షుడు శుచి, శుక్రుడు, సవనుడు జన్మించారు.


మరీచికి కళయందు కశ్యపుడు, పూర్ణిముడు, ఊర్ణ యందు ఆరుగురు కుమారులు జన్మించారు. ఈ ఆరుగురు తరువాత జన్మలలో కాలనేమి పుత్రులు గాను, దేవకి వసుదేవులకు కృష్ణుడి కన్నా ముందు ఆరుగురి పుత్రులుగా జన్మించి కంసుడిగా పుట్టిన తండ్రి కాలనేమి చేతిలో చంపబడ్డారు.


వినతకు అనూరుడు, గరుడుడు కాకుండా అరిష్టనేమి, తార్ఖ్యుడు, అరుణి, శ్రీవారుణి జన్మించారు. సగరుడు అరిష్టనేమి కుమార్తె సుమతిని వివాహం చేసుకుని సూర్య వంశ మూలకర్త అయ్యాడు. హేతి తపస్సపన్నుండైనా శాపగ్రస్తుడు అవ్వటం వలన రాక్షస జాతికి జన్మనిచ్చాడు.


వివస్వంతుడు విశ్వకర్మ కుమార్తె సంజ్ఞను వివాహం చేసుకున్నాడు. వీరికి అశ్వనీ దేవతలు, నాసత్యుడు, దస్రుడు జన్మించారు. పృథువుకు అంతర్ధానుడు, అంతర్ధానుడికి హవిర్భానుడు, హవిర్భానుడికి ప్రాచీనబర్హి, శుక్రుడు, గయుడు, కృష్ణుడు, వ్రజుడు, అజినుడు జన్మించారు. ప్రాచీనబర్హికి ప్రచేతసులు జన్మించారు.


అంగీరసునికి స్మృతి యందు అనుమతి, కుహువు, సినీవాలి, ఖ్యాతి యందు ఉతథ్యుడు, బృహస్పతి, సంవృత్తుడు జన్మించారు. బృహస్పతి వంశంలో పావకుడు, పరమానుడు, శుచి జన్మించారు.


పులస్త్యుడికి హవిర్భువు, ప్రీతి, మానిని భార్యలు. మానినికి విశ్రవసుడు జన్మించాడు. విశ్రనసువుకి కైకసి వలన రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, శూర్పణఖ పుట్టారు. విశ్రవసునికి మరోభార్య దేవవర్ణి వలన కుబేరుడు జన్మించాడు.


పులహునికి క్షమయందు కర్దముడు, ఉర్వరీయుడు, సహిష్ణువు జన్మించారు. క్రతువుకి అరవైవేల వాలఖిల్యులు జన్మించారు. కర్దమునికి ఆకూతి యందు కపిలుడు జన్మించాడు. అత్రి అనసూయలకు దత్తాత్రేయుడు, చంద్రుడు, దుర్వాసుడు జన్మించారు.


చంద్రవంశంలో వరుసగా బుధుడు, పురూరవుడు, ఆయువు, నహుషుడు, యయాతి మొదలైన వారు జన్మించారు. యయాతికి దేవయాని, శర్మిష్ట వలన యదువు మొదలైన ఐదుగురు పుత్రులు జన్మించారు.


భూమండలం పైన సూర్య చంద్రులు వంశ మూలకర్తలగా అనేక వంశాలు అభివృద్ధి చెంది విస్తరించాయి.


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

కామెంట్‌లు లేవు: