25, మార్చి 2026, బుధవారం

వాల్మీకి రామాయణం - 14)

 శ్రీరామ (21)


               ( వాల్మీకి రామాయణం - 14)


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏


  (25-3-'26 ' ఉదయం ' పోష్టు తరువాయి భాగము)


జనకమహారాజు ఆహ్వానాన్ని పురస్కరించుకుని దశరథ మహారాజు , విశ్వామిత్రాది ఋషులతోను, బంధువులతోను జనకుని సభకు వచ్చాడు.

ధర్మాత్ముడు, మా కులగురువు, అయిన వసిష్ఠమహర్షి నా పక్షమున మా వంశక్రమమును చెప్పగలడని జనకునకు తెలియజేశాడు.

వసిష్ఠమహర్షి జనకునితో ఇలా అన్నాడు.

శ్లో// అవ్యక్తప్రభవో బ్రహ్మా శాశ్వతో నిత్య అవ్యయః /

తస్మాన్మరీచిః సంజజ్ఞే మరీచేః కాశ్యపః సుతః //

(అవ్యక్తమునుండి జన్మించిన వాడు, శాశ్వతంగా ఉండేవాడు, నిత్యుడు, వినాశము లేనివాడు, అయిన బ్రహ్మదేవుని నుండి మరీచియు, మరీచినుండి కాశ్యపుడును జన్మించిరి).

కాశ్యపుని కుమారుడు సూర్యుడు.

సూర్యుని కుమారుడు మనువు.

మనువునకు ఇక్ష్వాకువుజన్మించాడు.

ఆయనే అయోధ్యకు మొదటి రాజు.

ఇక్ష్వాకుని పుత్రుడు "కుక్షి".

అతని కుమారుడు "వికుక్షి".

వికుక్షి కుమారుడు "బాణుడు"

"అనరణ్యుడు" బాణుడి కుమారుడు.

అనరణ్యుని పుత్రుడు "పృథు చక్రవర్తి".

పృథువు కుమారుడు "త్రిశంకువు".

అతనికి "దుంధుమారుడు", (అతనికే "యువనాశ్వుడు"అనే పేరు కూడా ఉంది)

యువనాశ్వుని కుమారుడు "మాంధాత".

మాంధాత కుమారుడు. "సుసంధి".

సుసంధికి "ధ్రువసంధి" , "ప్రసేనజిత్" అనే ఇద్దరు కుమారులు.

ధ్రువసంధి కుమారుడు "భరతుడు".

భరతుని కుమారుడు "అసితుడు".

శత్రువులచేత ఓడింపబడి అడవులకు వెళ్లిన అసితుడు "చ్యవన మహర్షి" అనుగ్రహం వల్ల "సగరుడు"అనే పుత్రుని పొందెను.

సగరుని పుత్రుడు "అసమంజుడు".

అసమంజుని కుమారుడు "అంశుమంతుడు"

అంశుమంతుని కుమారుడు "దిలీపుడు".

దిలీపుని కుమారుడు "భగీరథుడు".

భగీరథుని కుమారుడు "కకుత్థ్సుడు".

కకుత్థ్సుని కుమారుడు "రఘుమహారాజు".

రఘువు కుమారుడు " పురుషాదకుడు " కల్మాషపాదుడు,అనే నామములతో పిలువబడే "ప్రవృద్ధుడు" 

అతని కుమారుడు"శంఖణుడు".

శంఖణుని కుమారుడు. "సుదర్శనుడు".

అతని కుమారుడు"అగ్నిపర్ణుడు".

అగ్నిపర్ణుడి కుమారుడు "శీఘ్రగుడు".

అతని కుమారుడు. "మరువు".

మరువు కుమారుడు "ప్రశుశుక్రుడు".

అతని కుమారుడు "అంబరీషుడు".

అంబరీషుని కుమారుడు "నహుష చక్రవర్తి".

నహుషుని కుమారుడు "యయాతి".

అతని కుమారుడు "నాభాగుడు"

నాభాగుని కుమారుడు "అజ మహారాజు".

అజ మహారాజు పుత్రుడు "దశరథ మహారాజు"

దశరథ మహారాజు కుమారులు రామ,లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు.

పరిశుద్ధమైన వంశచరిత్ర కలిగిన వారు, వీరులు,‌

పరమ ధార్మికులు, సత్యవాదులు అయిన ఇక్ష్వాకు వంశంలో పుట్టిన ఈ రామ, లక్ష్మణుల కొరకు నీ కుమార్తెలైన "సీత" "ఊర్మిళ" లను వరించు చున్నాను.

రామ లక్ష్మణులకు, నీ కుమార్తెలయిన సీత, ఊర్మిళ లను ఇచ్చి వివాహము చేయుము, అని వశిష్ఠ మహర్షి చెప్పి, ముగించాడు.

                         

అప్పుడు వసిష్ఠమహర్షికి చేతులు జోడించి జనక మహారాజు ఇలా అన్నాడు.

సత్కుల ప్రసూతులైన వారు,కన్యాదాన సమయంలో తమ కులమును గూర్చి పూర్తిగా చెప్పవలెను.

మా వంశమునకు మూల పురుషుడు "నిమి" చక్రవర్తి.

ఆ నిమి చక్రవర్తి కుమారుడు"మిథి".

ఆయనే ఈ మిథిలానగరాన్ని నిర్మించిన మొదటి జనకుడు.

మిథి కుమారుడు ఉదావసువు.

ఉదావసువు కుమారుడు నందివర్థనుడు.

అతని కుమారుడు సుకేతువు.

సుకేతువునకు,ఈ శివ ధనుస్సును పొందిన వాడు,ప్రఖ్యాతుడు అయిన"దేవరాతుడు"జన్మించాడు.

దేవరాతుని కుమారుడు బృహద్రథుడు.

అతని కుమారుని పేరు"మహావీరుడు".

ఆయన పుత్రుడు సుధృతి.

సుధృతి కుమారుడు దృష్టకేతువు.

ఆయన కుమారుడు హర్యశ్వుడు.

హర్యశ్వునకు మరుడు అను పుత్రుడు జనించెను.

మరుని పుత్రుడు ప్రతింధకుడు.

ప్రతింధకుని కుమారుడు కీర్తిరథ మహారాజు.

కీర్తిరథునకు దేవమీఢుడు జన్మించాడు.

దేవమీఢుని పుత్రుడు విబుధుడు.

విబుధుని కుమారుడు మహీధ్రకుడు.

అతని కుమారుడు కీర్తిరాతుడు.

కీర్తిరాతునకు మహారోముడు జన్మించాడు.

మహారోముని కుమారుడు స్వర్ణరోముడు.

స్వర్ణరోముని కుమారుడు హ్రస్వరోముడు.

ధర్మాత్ముడైన హ్రస్వరోమునకు నేను జ్యేష్ఠ కుమారుడను.

నా తమ్ముడైన కుశధ్వజుడు రెండవ కుమారుడు.

జ్యేష్ఠుడనైన నన్ను రాజ్యాభిషిక్తుని చేసి,కుశధ్వజుని నా పోషణలో ఉంచి, హ్రస్వరోమ మహారాజు తపస్సు ఆచరించేందుకు అరణ్యములకు వెళ్లాడు.

నేను కుశధ్వజుని సాంకాస్య పురమునకు రాజును చేసాను.

ఇదీ మా వంశ వృత్తాంతము.

ఓ మహర్షీ! మీకు మంగళ మగుగాక.

మీరు చెప్పినట్లు నా జ్యేష్ఠ కుమార్తె సీతను రామునకు, రెండవ కుమార్తె ఊర్మిళను లక్ష్మణునకు ఇచ్చి వివాహం చేస్తాను.


శ్లో//వీర్య శుల్కాం మమ సుతాం సీతాం సురసుతోపమామ్/

ద్వితీయా మూర్మిళాం చైవ త్రిర్దదామి నసంశయః//

(వీర్య శుల్కయు,దేవకన్యతో సమానురాలును అగు నా పుత్రిక యైన సీతను రామునకు, రెండవ కుమార్తె అయిన ఊర్మిళను లక్ష్మణునకు ఇచ్చి వివాహము చేసెదనని ముమ్మారు నొక్కి వక్కాణించుచున్నాను.

ఈ విషయమున సందేహము లేదు).

ఇక్కడ "త్రిః దదామి" అను పదమునకు మనో,వాక్కాయములను మూడు కరణముల చేత అనగా త్రికరణశుద్ధిగా ఇచ్చుచున్నాను అని అర్థం చేసుకోవాలని వ్యాఖ్యాతలు చెప్పారు.


జనకుడు దశరథ మహారాజుతో ఇలా అన్నాడు.

ఓ మహారాజా ! ఈరోజు మఖా నక్షత్రము. 

ఎల్లుండి సంతానప్రదుడైన " భగుడు" అధిదేవతగాగల ఉత్తర ఫల్గునీ నక్షత్ర మందు వివాహముజరిపింపుము.

ఈ లోపు గోదానము, మొదలైన శాంతి కార్యములు చేయింపుము"


(సశేషం)

శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

25-3-'26.

కామెంట్‌లు లేవు: