28, జనవరి 2026, బుధవారం

పతనానికి మూలకారణము

----------------------------


సృష్టిలో సర్వసాధారణంగా తాను ఎంతటి గొప్ప వ్యక్తి అయనా , ఏదో ఒకటి 

కోరుకుంటూనే యుంటాడు..... ముందుగా ధనం కోరుతాడు..... అది పుష్కలంగా 

వుంటే అధికారపదవులూ ,ఉద్యోగమూ, వగైరా కోరుకుంటాడు..... దీనినే 

 భావ దారిద్ర్య మంటారు..... ఈశ్వరుని లో అటువంటి గుణం ఎక్కడా వుండదు..... 

కానీ లోక విడంబనం కోసం ఆయన , ఆది భిక్షువుగా కన్పిస్తాడు..... ఆ గుణం  

ఈశ్వరుని పరమ త్యాగ శీలానికి సంకేతంగా చెప్పుకోవచ్చు...... ఇది ఒకవిధంగా 

లోకానికి గొప్ప ఉపదేశం ఇస్తోంది..... " నశించి పోయే భౌతిక పదార్థాలైన 

ధనకనక,వస్తు, వాహనాలకై నీవు ఆశింౘకు..... అవినాశీ, 

నిత్య సత్యుడూ

ఆనంద స్వరూపుడూ అయిన పరమాత్మకు సర్వమూ సమర్పింౘు" 

అన్నదే , ఆ ఉపదేశం..... 

ఇక్కడ ఒక విషయాన్ని మనం గ్రహింౘాలి..... మనకు ఏది లభించినా 

 అది అంతా భగవదనుగ్రహ ఫలితమే.... మనం నిజానికి భగవంతుడికి 

ఏమీ ఇవ్వవలసిన పని లేదు..... భగవంతుని కి మనం పత్రమో,పుష్పమో, 

ఫలమో, తోయమో ,సమర్పింౘడమన్నది మనం భగవంతుని యందు ౘూపించే కృతజ్ఞత మాత్రమే...... మనకు ఈ దేహాన్నిచ్చి,సంపదలిచ్చి, పుత్ర పౌత్రాదులనిచ్చి ౘల్లగా కాపాడుౘున్న పరమాత్మకు మనం సమర్పించే వస్తువులన్నీ ఆయనకు మనం కృతజ్ఞత ను వెల్లడింౘ డానికే, నిజానికి ఆయనకు కావలసినదేమీ లేదు.... ఆయన సర్వ సంపూర్ణుడు.... 

అయితే భగవంతునికి ఏమి యివ్వాలి అన్న విషయంలో భగవద్గీత ఇలా 

చెప్పింది. 

               *శ్లో". పత్రం పుష్పం, ఫలం, తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి!*

                     *తదహం భక్త్యుపహృతమ్ అశ్నామి ప్రయతాత్మనః!!"*


*_తాత్పర్యము_*


నిర్మల బుద్ధి తో, నిష్కామ భావంతో పరమ భక్తునిచే సమర్పింపబడిన

పత్రమునుగానీ, పుష్పమునుగానీ, ఫలమునుగానీ, జలమునుగానీ 

నేను ప్రత్యక్షంగా, స్వయంగా ప్రీతితో స్వీకరిస్తాను..... 

పై శ్లోకంలో ని పత్రపుష్పఫలతోయ శబ్దాలలోని అంతరార్థం

1. పత్రం : "పతతీతి పత్రం". పడిపోయేది పత్రం.... మనిషిని పడవేసేది

                   మనస్సు.... కాబట్టి పత్రాన్ని సమర్పింౘాలీ అంటే మనమనస్సును

                  దైవాంకితం చేయాలని దాని అంతరార్థం..... 


2. పుష్పం: "పుష్యతీతి పుష్పం". వికసించేది పుష్పం, మనిషిలో వికసించేది 

                  బుద్ధి__ కాబట్టి మన బుద్ధి ని దేవునిపై లగ్నం చేయాలని దీని 

                  అంతరార్థం... 


3. ఫలం : "విశీర్యతే ప్రహారైరితి ఫలం" __ ప్రహారైః_అనగా దెబ్బలచే__ 

                  విశీర్యతే అనగా పగిలేది ఫలము...... జ్ఞాన బోధము అనే దెబ్బలచే

                  పగిలేది మనస్సులోని అహంకారం..... కాబట్టి ఫలాన్ని అనగా 

                  అహంకారాన్ని మనం దైవానికి సమర్పింౘాలని అంతరార్థం.... 


4. తోయం: "త్రాయతే_పాయతీతి". అనగా రక్షింౘు నది కనుక తోయము... 

                  సోహం భావంతో ఉన్నప్పుడు, ధ్యేయాన్ని గుర్తుంౘుకొని , రక్షించేది

                   చిత్తము..... కాబట్టి తోయము అంటే చిత్తము అని అంతరార్థం.... 

                  అంటే మన చిత్తాన్ని భగవంతునికి సమర్పింౘాలని భావము.... 

మనస్సు మన పతనానికి మూలకారణము..... అందుకే దాన్ని మనం ముందుగా భగవంతునికి సమర్పింౘాలి..... శంకరులు ఈ శ్లోకంలో *"భవతు భవదర్థం మమ మనః"* అనగా ఈశ్వరా ! నా మనస్సు నీ స్వాధీనం అగు గాక " అని కోరు కున్నారు.

కామెంట్‌లు లేవు: