28, జనవరి 2026, బుధవారం

గార్దభశాసనం

 గార్దభశాసనం

ఈ శాసనం అద్దంకిలోని వినాయకుడి గుడికి దక్షిణంగా, జాతీయ

రహదారికి ఆవలగా ఒకప్పుడు ఉండేది. జాతీయ రహదారి తన ఎత్తును

పెంచుకుంటూ భూమిపొరల్లో ఈ శాసనాన్ని దాచేసింది. రహదారి విస్తరణ

శాసనం యొక్క నోరు నొక్కేసింది. శాసనాన్ని భూమిపొరల్లో దాచేసింది. ఈ శాసనాన్ని

మా తరంతో పాటు ఇప్పటితరంకూడా చూశారు. శాసనం పైభాగంలో సూర్య

చంద్రులు మధ్యలో శివలింగంఅడుగున గాడిద బొమ్మను చిత్రించారు. అనగా పరమేశ్వరుని సాక్షిగా సూర్యచంద్రులుండే

దాకా ఈ శాసన విషయం సత్యమని అర్థం. మరి శాసనంపై గాడిద బొమ్మ

ఎందుకు? ఈ గ్రామంలో (అద్దంకిలో నూటొక్క బావులు, నూటొక్క గుళ్ళు

లేవనే వాడు గాడిదకడుపున పుడతాడనేది శాసన విషయం. మనకిప్పుడు గ్రామంగా

కనపడే అద్దంకి ఒకప్పటి తెలుగువారి రాజధాని. ఇంకొక విషయమేమిటంటే ఈ

శాసనం రెడ్డిరాజుల నాటిది కాదని చెప్పవచ్చును. ఎంచేతనంటే రెడ్డిరాజుల నాటికి

అద్దంకి వారి రాజధాని. గ్రామం మాత్రం కాదు. రాజధాని హెూదా కోల్పోయిన

తర్వాత అద్దంకి ఒక గ్రామంగా మారి ఉండవచ్చును. ఆ సందర్భంలో అద్దంకి

గొప్పదనాన్ని చెప్పడానికి వేసిన శాసనంగా దీన్ని భావించవచ్చును. మరొక విషయం

కూడా ఈ విషయాన్ని నిర్ధారణ చేస్తున్నది. అది ఏమిటంటే అద్దంకి కోట చుట్టు

ఒక్క రెడ్డి గారి పాలెం కూడా లేదు. చుట్టుపక్కల రెడ్డి గార్లుండే పల్లెలు ఉన్నాయి

కాని కోట చుట్టూ లేవు. అద్దంకిలోని ప్రముఖ దేవాలయాల జాబితా ఇలా ఉంది.

అద్దంకి కోటకు వెలుపల వేయిస్థంభాల గుడి, వినాయకుడి గుడి కలదు. ఇవి

హైదరాబాద్, ఒంగోలు పోయే జాతీయరహదారికి ఇరువైపులా కలవు. రహదారికి

పడమటగా వేయిస్థంభాల గుడి, తూర్పుగా వినాయకుడి గుడి. వినాయకుడి

గుడికి ఎదురుగా నిలబడి ఉన్న గార్దభశాసనం ఇలాంటి గుళ్ళు మా ఊళ్ళో

నూరునొక్కటి గలవని చెప్పేది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అద్దంకికి గొప్ప స్థానం

ఉంది. ఇంతేగాక చారిత్రాత్మకమైన ప్రాధాన్యత కలదు. ఊరికి ఉత్తరాన ఉన్న

అద్దంకి కొండలో రాక్షస గూళ్ళు కలవు. దీనిని బట్టి అద్దంకి ఒక

జనావాసయోగ్యమైన పురాతన ప్రదేశంగా గమనించవచ్చును. గొప్ప

సైనికస్థావరమని(బోయకొట్టము) అద్దంకి పండరంగని పద్యశాసనం చెబుతుంది.

 పద్యశాసనం తెలుగువాడు తల ఎత్తుకుని తిరిగేలా చేసింది. పూర్తి ఛందస్సుగల

తరువోజ పద్యంతో మన భాష ప్రాచీనతకు నిలువెత్తు సాక్ష్యంగా

నిలిచింది. రెడ్డి రాజుల రాజధానిగా తెలుగువారి శౌర్యపరాక్రమాలను,

తెలుగువెలుగులను దేశం నలుదిశలా చాటింది. అద్దంకి కళలకు కాణాచిగా

విఖ్యాతినొందింది. అర్థాంతరంగా ఆగిపోయిన శేషభారతాన్ని పూరించింది.

ఆలయాలతోరణంగా వెలసిల్లింది.  

 గార్దభశాసన విషయానికి వస్తే నుయ్యి ఇంట్లో వాడకానికి పనికి వచ్చే

జలవనరు. బావి అంటే ఊరి మొత్తానికి పనికి వచ్చే జలవనరు. ఆ ప్రకారం

చూస్తే అద్దంకి గ్రామంలో నూటొక్క బావులున్నాయంటే నూటొక్క పాలేలు

ఉన్నాయని అర్థం. ఆ పాలేలలో పాలెంకు ఒక గుడి చొప్పున నూటొక్క

దేవాలయాలు ఉన్నాయని అవగతమౌతుంది.

అద్దంకి కోటకు చుట్టూ ఈ పాలేలు ఆనుకొని ఉన్నాయి. కోటలోకి

రావాలంటే ఈ పాలేలను దాటుకుంటూ లోనికి ప్రవేశించాలి. అద్దంకి లోని ప్రసిద్ధ

దేవాలయాలు వరుసగా 1)వేయిస్థంభాల గుడి 2)శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి

ఆలయం, పాత అద్దంకి. 3) శ్రీ రామలింగేశ్వరస్వామి వారి ఆలయం 4) పోలేరమ్మ

గుడి 5)శ్రీ కాళికా సమేత కమఠేశ్వర స్వామి వారి ఆలయం 5)శ్రీ మాధవ

స్వామివారి దేవాలయం 6) వినాయకుని గుడి 7) శ్రీ వీరభద్ర స్వామి వారి ఆలయం

8)శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం 9)శ్రీ రంగనాయక స్వామి వారి ఆలయం

10)శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయం 11)నాంచారమ్మ గుడి 12 గంగమ్మ

గుడి 13)గాజుల పాలెం శివాలయం. 14) సింగరకొండ లక్ష్మీనరసింహ స్వామివారి

ఆలయం 15)సింగరకొండ ఆంజనేయస్వామి వారి ఆలయం. ఇవి గాక అద్దంకి

చుట్టుపక్కల చిన్న చిన్న దేవాలయాలు ఉండవచ్చును. అద్దంకి కోట చుట్టూ ఉండే

పాలేలు 1)చినగానుగపాలెం, 2) పెద గానుగ పాలెం. 3) పసుమర్తి వారిపాలెం.

 4)గురకాయపాలెం. 5)

బలిజపాలెం, 6) నర్రావారి పాలెం. 7)గుంజివారి పాలెం,

8)గాజుల పాలెం. 9) చాకలిపాలెం 10) పెరికపాలెం. 11)కట్టక్రిందపాలెం

12)కాకానిపాలెం. 13) దామావారిపాలెం. 14) నంబూరివారిపాలెం.

15) మొండితోకపాలెం 16) ముతరాసువారి పాలెం 17) పొలిమి పాలెం

18)నాగులపాలెం 19)బోడెంపూడి వారి పాలెం. 20)నృసింహ పాలెం. 21)బత్తుల

వారి పాలెం. 22) దూదేకుల పాలెం. 23) వడ్డెర పాలెం 24)యాదవపాలెం

25)కడెంపాలెం 26) ముదామువారిపాలెం 27)గుర్రంవారిపాలెం

28)కోటవారిఅగ్రహారం 29)ముజావారి పాలెం 30)కాటిపాపలపాలెం. ఇవి గాక

కోటకు నాలుగైదు మైళ్ళలోపు ఉండే గ్రామాలు 31) నాగులపాలెం 32)

జాళ్ళపాలెం

33)చెర్వుకొమ్ముపాలెం 34) బొమ్మనంపాడు 35) కశ్యపురం 36) కలవకూరు

37)ధర్మవరం 38) సింగరకొండపాలెం 39)గోపాలపురం 40)చక్రాయపాలెం

41)తిమ్మాయపాలెం 42)రామాయపాలెం 43)కొటికలపూడి 44)తిమ్మారెడ్డిపాలెం

45)అనమనమూరు 46) మణికేశ్వరం 47) యర్రబాలెం 48) బొడ్డువానిపాలెం 49)

విప్పర్లవారిపాలెం 50) కొంగపాడు 51)వేలమూరిపాడు 52)

వెంకటాపురం

53)నృసింహపుర అగ్రహారం. ఏతా వాతా చెప్పొచ్చేది ఏమిటంటే కోటలోపల

రాజులు, రాజబంధువుల పరివారము ఆహారం, అవసరాల కోసం కోటచుట్టూ

వృత్తులవారీ కుటుంబాలు పాలేలుగా ఏర్పడ్డాయనిపిస్తుంది. అద్దంకి రాజధాని

వైభవం నుండి గ్రామస్థాయికి వచ్చేసరికి అద్దంకి గ్రామ పరిథిలోని కొన్ని పాలేలు

కాలక్రమేణా రక్షణ కోసం, రాజాశ్రయాల కోసం, బ్రతుకుతెరువు కోసం వెళ్ళి

ఉండవచ్చును. ఎవరు వేయించారో ఈ శిలాశాసనం తెలియదు కాని అద్దంకికి

సంబంధించిన చాలా ముచ్చట్లు తెలుసుకునే అవకాశం కలిగింది. మా అద్దంకిలో

అనేక దేవాలయాలు, అనేక పాలేలు ఉన్నాయన్న సంగతి చెప్పిన ఈ శాసనం

భూమి పొరల్లో దాగున్నది. ఎప్పటికి బయటకు వస్తుందో మనం వేచి చూద్దాం.

-పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి

సెల్ నెం:8179636617

కామెంట్‌లు లేవు: