14, మార్చి 2021, ఆదివారం

మన మహర్షులు- 49 దేవల మహర్షి -

 మన మహర్షులు- 49


దేవల మహర్షి -


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹



పూర్వం దేవుడనే మనువుండేవాడు. అతని కొడుకు ప్రజాపతి. ప్రజాపతి కొడుకు ప్రత్యూషుడు, ప్రత్యూష్యుడికి ఇద్దరు కొడుకులు. మొదటివాడు దేవలుడు రెండవవాడు

విభువు.


దేవలుడు నల్లగా ఉండేవాడు. అందుకే అతడిని 'అసితుడని' కూడా పిలిచేవాళ్ళు.


దేవలుడు పెద్దవాడయ్యాక విద్యాభ్యాసానికి వ్యాసుడి దగ్గరకి పంపాడు తండ్రి దేవలుడు చక్కటి గుర్తుభక్తితో విద్య నేర్చుకున్నాడు. వ్యాసుడు తాను రాసిన మహాభారతాన్ని వ్యాప్తి చెయ్యమని పితృలోకం పంపించాడు దేవలుడిని. గురువు గారు చెప్పినట్లే చేశాడు దేవలుడు. గురువుగారిని మించిన శిష్యుడని అందరూ మెచ్చుకున్నారు.


దేవలుడు గొప్ప తపస్విగా, సత్యవ్రతుల్లో మొదటివాడుగా బ్రహ్మనిష్ఠ గలవాడుగా

పేరుపొందాడు.


ఒకసారి జైగీషవ్యుడు దేవలుడున్న చోటికి వచ్చి తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడు. బృహస్పతి లాంటి పెద్దలందరు వచ్చి దేవల జైగీషవ్యులున్న ప్రదేశాన్ని దివ్యతీర్థంగా ప్రశంసించారు. దేవలుడు అందరి దగ్గర సెలవు తీసుకుని సింధునదీ తీరానికి వెళ్ళిపోయాడు.


దేవలుడు ఒక చెఱువులో స్నానం చేస్తుంటే 'హూహూ' అనే పేరుగల గంధర్వుడు అదే చెఱువులో తన భార్యలతో స్నానం చేస్తూ దేవలుడి పాదాలు పట్టుకుని బాధపెట్టడం మొదలుపెట్టాడు. దేవలుడు కోపంతో గంధర్వుడిని మొసలిగా పుట్టమని శపించాడు.


గంధర్వుడు దేవలుడిని రక్షించమని ప్రార్థించాడు.


 నువ్వు మొసలివై ఒక ఏనుగుని పట్టుకున్నప్పుడు ఏనుగుని రక్షించడానికి విష్ణుమూర్తి వస్తాడు. అప్పుడు నీకు శాపవిమోచనం

అవుతుందని చెప్పాడు.

 దేవలుడు .


మనకి' గజేంద్రమోక్షం' కధ  తెలుసు కదా... ఆ గజేంద్రుణ్ణి పట్టుకున్న మొసలే ఈ గంధర్వుడు.


దేవలుడు కఠోర దీక్షలో వుండి తపస్సు చేసుకుంటుంటే రంభ వచ్చి తనను వివహమాడమని  అడిగింది. దేవలుడు అందుకు అంగీకరించలేదు. తన మాట వినలేదు గనుక శూద్రుడిగా పుట్టమని దేవలుడిని శపించింది.


రంభ శాపం వల్ల దేవాంగకులంలో పుట్టిన దేవలుడు రకరకాల వస్త్రాల్ని తయారు చెయ్యడం మొదలుపెట్టి తన కొడుకులు దివ్యాంగుడు, విమలాంగుడు, ధవలాంగుడు ముగ్గురితో కలసి నేత పరిశ్రమని లోకంలో వ్యాపించేలా చేశాడు.


 ఒకసారి నారదుడు దేవలుడి దగ్గరకి వచ్చి ఈ ప్రపంచం ఎల్లా పుట్టిందీ,

ప్రళయకాలంలో ఏమవుతోంది? మొదలయిన విషయాలు అడిగి తెలుసుకున్నాడు.


 దేవలుడు తీర్థయాత్రలు చేస్తూ గంగాస్నానం చేసి విష్ణుజపం చేస్తుండగా అతడికి

పితృదేవతలు కనిపించి పున్నామ నరకం నుంచి రక్షించమని వేడుకున్నారు.


నాయనా! బ్రహ్మచర్యం వలన ముని ఋణం తీరుతుంది. అగ్నిహోత్రానికి సంబంధించిన పనులవల్ల దేవ ఋణం తీరుతుంది. పెళ్ళిచేసుకుని మంచి సంతానం పొందితేనే పితృదేవతల ఋణం తీరుతుంది. కాబట్టి నువ్వు వివాహం చేసుకుని మాకు మోక్షంకలిగేలా చెయ్యమన్నారు పితృదేవతలు.


అయ్యా! నేను పెద్దవాడ్నయ్యాను. ఈ వయస్సులో నాకు పిల్లనెవరిస్తారు? అని అడిగాడు దేవలుడు.


కౌండిన్యుడనే మహామునికి ఒక కుమార్తెవుంది. ఆమెని నువ్వు పెళ్ళి చేసుకో

ఆమెను నీ కోసమే బ్రహ్మ సృష్టించాడని చెప్పారు పితృదేవతలు


దేవలుడు బయలుదేరి కౌండిన్యుడి ఇంటికి వెళ్ళి అతని కుమార్తెనిచ్చి పెళ్ళి చెయ్యమని అడిగాడు. దేవలుడి గురించి తెలిసిన కౌండిన్యుడు తనకుమార్తెను దేవలుడికిచ్చి పెళ్ళి జరిపించాడు. కొంతకాలానికి దేవలుడికి సువర్చల అనే కూతురు కొంతమంది కొడుకులు పుట్టారు


అలా పితృదేవతల ఋణం కూడా తీర్చుకున్నాడు దేవలుడు. 


దేవల మహర్షి మహాధర్మశాస్త్రాన్ని ప్రతిపాదించాడు. ఈయన రాసిన 'దేవలస్మృతి' ఇంకా పూర్తిగా దొరకలేదు


దేవల మహర్షి, దివ్యర్షి, మహాతపస్వి, యోగీశ్వరుడు, ధర్మశాస్త్ర ప్రవక్త, మహా

పురుషుడుగా ప్రసిద్ధికెక్కాడు. భారతదేశ మహర్షుల్లో గొప్ప ఋషిగా పేరు పొందాడు.🙏


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷

కామెంట్‌లు లేవు: