25, ఏప్రిల్ 2023, మంగళవారం

శాఖ చంద్ర న్యాయం

 శాఖ చంద్ర న్యాయం - వేదాంతం 


పౌర్ణమి రోజున చంద్రుడు పూర్తి బింబముగా కనపడతాడు, వెన్నెల పిండి ఆరబోసినట్లు గా ఉంటుంది కాబట్టి పున్నమి చంద్రుడు ప్రతివారికి ఆకాశం వైపుచూస్తే చాలు కనపడతాడు. ఇంకొక విశేషము ఏమిటంటే పున్నమి చంద్రుడు రాత్రి పూర్తిగా అంటే సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 6 గంటలవరకు ఆకాశంలో ప్రకాశిస్తూవుంటాడు కాబట్టి ఆ రోజు రాత్రి చంద్రుని ఎవరు చూపించనవసరం లేకుండానే అందరు చూడగలరు. 


కానీ అమావాస్య మరుసటి రోజు చంద్రుడు రేఖామాత్రంగా ఉండి ఆకాశంలో కేవలం 48 నిమిషాలు మాత్రమే ఉంటాడు కాబట్టి ఆ రోజు అంటే అమావాస్య వెళ్లిన పాడ్యమి నాడు చంద్రుని చూడటం చాలా కష్టం. దానికి కారణం చంద్రుడు చిన్నగా ఉంటాడు మరియు కొద్ది సమయం మాత్రమే ఉంటాడు. 


ఒక గురువు గారు ఆకాశంలో వున్న చంద్రుని తన శిష్యునికి చూపించదలచారు. అప్పుడు ఆయన ముందుగా అక్కడ వున్న ఒక చెట్టు కొమ్మను శిష్యునికి చూపించారు అది కంటికి దగ్గరగా వుంది కాబట్టి దాన్ని శిష్యుడు గుర్తించగలిగాడు. ఇక ఇప్పుడు చంద్రుని చూపించాలి దానికోసం గురువుగారు ఆ వృక్ష శాఖ లోని ఒక పత్రాన్ని చూపి దాని సందులో చంద్రుడు ఉన్నాడని చెప్పారు. తెలివైన శిష్యుడు ఆ శాఖ మధ్యనుండి గురువుగారు చెప్పిన విధంగా నిశితంగా పరిశీలించి చూసి సూక్ష్మ మాత్రంగా ఉన్న చంద్రుడిని చూసాడు. ఒక్కసారి చంద్రుని చూస్తే తరువాత శిస్యునికి మరల వృక్షశాఖతో నిమిత్తం లేదు ఆకాశంలో ఎటువంటి ఉపాధి లేకుండా చంద్రుని మరల చూడగలడు. ఎందుకంటె ఇప్పుడు శిష్యునికి చంద్రుడు ఎక్కడ వున్నదో పూర్తిగా జ్ఞానం కలిగి వున్నాడు. ఆ జ్ఞానం కలిగేటంతవరకే శాఖ యొక్క ఉపయోగం. ఒక్కసారి శిష్యునికి చంద్రుని గూర్చిన జ్ఞానం కలిగిన తర్వాత శాఖ పూర్తిగా మరచిపోతారు. కేవలం మనస్సు చంద్రుని మీద లగ్నం చేయగలుగుతాడు.


నిజానికి చంద్రుని చూడడానికి వృక్షశాఖతో పనిలేదు. కానీ గురువుగారు వృక్షశాఖను తన పనికి వాడుకున్నారు. ఎందుకంటె శిష్యుని దృష్టిని కేంద్రీకరించడానికి శాఖ ఒక ఉపయుక్తంగా లేక ఉపకరణంగా పనికి వచ్చింది. అదే వృక్ష శాఖ లేదనుకోండి అప్పుడు గురువు గారు శిష్యునికి చంద్రుని చూపించడం కుదిరే పని కాదు. ఎందుకంటె పాడ్యమినాడు చంద్రుడు చాలా సూక్ష్మంగా ఉండటమే కాకుండా కేవలం ఆకాశంలో 48 నిమిషాలు మాత్రమే ఉంటాడు. కాబట్టి శాఖ చంద్రదర్శనానికి చాలా తోడ్పడ్డదని మనకు తెలుస్తున్నది.


ఇక విషయానికి వస్తే భగవంతుడు నిర్గుణుడు, నిరాకారుడు, నామ రహితుడు మరి అటువంటప్పుడు భగవంతుని దర్శించుకోవడం ఎలా ఎందుకంటే మన మనస్సు ఎల్లప్పుడూ ఏదో ఒక భౌతికమైన విషయం మీదనే లగ్నం అవుతుంది అది ప్రస్తుతం వున్నదో లేక గతంలో వున్న దాని భావనో ఏదో ఒకటి కావచ్చు. కాబట్టి మనస్సుకి ఒక చక్కటి శిక్షణ ఇవ్వాలి దానికోసం ముందుగా మనస్సుని ఏదో ఒక విషయం మీద స్థిరపరచాలి తరువాత నెమ్మదిగా శాఖమీది నుంచి దృష్టిని చంద్రుని వైపు మళ్లించినట్లు మనస్సుని భగవంతుని మీదకు మళ్లించవచ్చు.


కాబట్టి మన ఆరాధనా పద్దతులలో విగ్రహారాధన, యజ్ఞ యాగ, జపాది పద్ధతులు కేవలం సాధకుని మనస్సు స్థిరపరచటానికి ఏర్పాటు చేసిన విధానాలుగా మనం తెలుసుకోవాలి. ఒక విగ్రహారాధనను మనం చంద్రుని దర్శించుకోవడానికి ముందుగా శాఖను చూడటం లాగ తెలుసుకోవాలి. ఎలాగైతే చంద్రుని దర్శించుకున్న తర్వాత శాఖ ప్రయోజనం లేదో అలాగని నిరాకారుడైన భగవంతుని చేరుకొన్న సాధకునికి విగ్రహారాధనతో నిమిత్తం లేదు. ఇది తెలుసుకొని సాధనలో పట్టు సాధించాలి.


భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే విగ్రహారాధన నుంచి మనస్సు నిరాకారుని వైపు మళ్లించటం చెప్పినంత తేలిక కాదు నిరంతర అకుంఠిత సాధన చేస్తేనే కానీ అది సాధించగలడు. పట్టుదల, అవిరామ కృషి మాత్రమే సాధకుని దీక్షను ముందుకు సాగించగలవు. సాధనలో ఎన్నో అవాంతరాలు, ఇబ్బందులు, సాధకబాధకాలు వస్తూ వుంటాయి. కానీ నిజమైన సాధకుడు వాటినన్నిటిని అధిగమించి తన సాధనను ముందుకు కొనసాగించాలి. నిజానికి ఆధ్యాత్మిక జీవనం చాలా కష్టతరమైనది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇసుకను పిండి నూనెను పట్టినట్టు. ఎంతో దుర్లభమైన సాధన చేస్తేగాని మోక్షం సిద్దించదు. మనకు అనేకమంది వాచావేదాంతులు తారసపడి మనలను తప్పుడు త్రోవలో పంపడానికి ప్రయత్నిస్తుంటారు వాటిని చాలా జాగ్రత్తగా ఎదుర్కోవాలి. ముఖ్యంగా ఈ రోజుల్లో నిజమైన సాధకులు చాలా తక్కువగా వున్నారో లేక లేరో నాకు ఇంకా పూర్తిగా తెలియడం లేదు. ఒక్క మాట మాత్రం చెప్పగలను మన చుట్టూ ఉన్న సమాజంలో మాత్రం నిజమైన సాధకులు లేకపోవచ్చు. ఎక్కడో అరణ్యాలలోనో లేక హిమాలయాలలోనో ఉంటే ఉండవచ్చు. పై పై డాంబికాలు పోయి తామే సద్గురువులమనే కుహనా వేదాంతులు మనకు అడుగడుగునా కనిపిస్తారు. వారితో జాగ్రత్త. నీగమ్యం నిర్ధారించుకొని అడుగు ముందుకు వేయి.


ఓం తత్సత్


ఓం శాంతి శాంతి శాంతిః


ఇట్లు భార్గవ శర్మ


కామెంట్‌లు లేవు: