శ్రీచక్ర వైభవం
రెండవ భాగం
ముందుగా శ్రీ చక్రం ఎలా ఉంటుందో చూద్దాము;
"బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మ మన్వస్ర నాగదళ షోడశ పత్రయుక్తం
వృత్త త్రయంచ ధరణీ సదన త్రయంచ శ్రీ చక్ర రాజ ఉదితః పరదేవతాయాః"
గోపురము వలే కనబడు శ్రీ చక్రము చూడటానికి పైనుండి క్రిందకు క్రమముగా;
1. బిందువు
2. త్రికోణము
3. వసుకోణం
4. అంతర్దశారము
5. బహిర్దశారం
6. చతుర్దశారం
7. అష్టదళపద్మం
8. షోడశదళపద్మం, దాని చుట్టూ మూడు వృత్త రేఖలు
9. మూడు రేఖలతో ధరణీ సదనం (భూపురం)
బిందువు వద్ద పరదేవత అయిన శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారు ఆశీనురాలై ఉంటుంది.
మంత్రం శబ్దంనుండి పుట్టింది , శబ్దము ఆలోచననుండి పుట్టినది .మంత్ర శబ్దములు ఉచ్చరించినపుడు శబ్ద తరంగాలు బయలుదేరుతాయి . ఈ తరంగాలు చక్రాకారంగా ఉంటాయి .ఆయా శబ్దమును బట్టి, ఆచక్రాకారమునకు దళములు, కోణములు ఏర్పడును. మంత్రోచ్చారణ వల్ల శరీరములో సూక్ష్మ నాడీ కూటమునందు కొన్ని స్పందనలు కలిగి అవి చక్రరూపం దాల్చును. చైతన్య రూపమును పొందిన ఈ సూక్ష్మ చక్రములు విశ్వ ప్రాణమును ఆకర్షించి శక్తివంతములగును. ఈవిధముగా శబ్దసమూహమైన మంత్రము చైతన్యవంతమై సిద్ధి ప్రదమగును.అంటే శబ్ద బ్రహ్మం నుండి శ్రీచక్ర ఆవిర్భావం జరిగింది.
.ఈ విషయం గుర్తుంచుకోవాలి
ఈ శ్రీచక్రం త్రిమాతా స్వరూపం…శక్తి -పార్వతి, విద్య – సరస్వతి, స్థితి – శ్రీలక్ష్మి. ఈ ముగ్గురి కలయిక శక్తియే జగన్మాత అనీ, ఆదిశక్తి అని మనం భావించే శ్రీమాత లలితా దేవి . త్రిమూర్తులను సృజించిన మాతృమూర్తి జగన్మాత. జగధ్ధాత్రి చల్లని కటాక్ష వీక్షణాల వలనే సమస్త ప్రకృతి ఏర్పడింది. పంచభూతాలు, ఆరు ఋతువులు, సప్తలోకాలు, అష్టదిక్కులూ, నవరసములు సృజించినది.
. ఈ యంత్రము శక్తి స్వరూపిణులైన శ్రీ విద్య, లలితా దేవి అనే త్రిపుర సుందరి అనే దేవతను సూచిస్తాయి. శ్రీచక్రంలో నాలుగు సమద్విబాహు త్రిభుజాలు ఉర్ధ్వముఖంగా ఉండి శివుణ్ణి అనగా పురుష శక్తిని సూచిస్తాయి. అయిదు సమద్విబాహు త్రిభుజాలు నిమ్న (అధో) ముఖంగా ఉండి శక్తిని అనగా స్త్రీని సూచిస్తాయి. కావున శ్రీ చక్ర యంత్రము వ్యతిరేక దివ్యశక్తుల సంగమమును సూచిస్తుంది
మానవ శరీరంలో ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క స్థానము,, తగిన పనిని కలిగి ఉంటాయి.కన్ను, ముక్కు, చెవి మొదలగునవి వేటి పనులు వాటివే. అలాగే శ్రీచక్రంలో ఒక్కొక్క దేవతకు ఉండవలసిన స్థానములు, చేయవలసిన పనులు, ప్రత్యేకంగా నిర్దేశింపబడి ఉన్నాయి. ఇక్కడ కూడా వేటి పనులు వాటివే..ఈ దేవతలకు యంత్రం రూపమయితే, మంత్రం నాదమవుతుంది. వేదవాక్కులచే (బీజాక్షరములచే ) ఆదేవతలు ప్రత్యక్షమవుతారని, అనుగ్రహిస్తారని, తెలుసుకొన్న మన మహర్షులు మనకు మంత్ర, యంత్ర శాస్త్రాలను అందించారు.
వేదమునకు మూలము నాదము.దాని నుండి బీజాక్షరములు ఉద్భవించి మంత్రములుగా శక్తిని సంతరించుకున్నాయి.
ఇక శరీర విషయానికి వస్తే
మన దేహమే ఈ శ్రీచక్రరాజము . సాధకుడి దేహము ఈ శ్రీచక్రమనే దేవాలయము. మన దేహము నవ రంద్రములతో ఏర్పడిందని మనమెరుగుదుము అటులనే ఈ శ్రీచక్రము తొమ్మిది ఆవరణలతో ఏర్పడిన చక్ర సమూహమే. ఈ శ్రీచక్రము మనిషి శరీరంలో ఉన్న షట్చక్రాలకూ, ఈ శ్రీచక్రము లో ఉన్న తొమ్మిది అవరణలు అవినాభావ సంబధము ఉంది .
ఈ విషయం భావానోపనిషత్ లో వివరించాను. ఆ వ్యాసం కూడా చూడండి
శంకరులు, "సౌందర్యలహరి" లోని పదకొండవ శ్లోకాన్ని, శ్రీచక్ర స్వరూపాన్ని గూర్చి వర్ణిస్తూ, ఇలా రచించారు,
"చతుర్బిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి
ప్రభిన్నాభిః శంభో ర్నవభి రపి మూలప్రకృతిభిః
త్రయశ్చత్వారింశ ద్వసుదళకళాశ్రత్రివలయ
త్రిరేఖాభిః సార్దం - తవ శరణకోణాః పరిణతాః"
భావం
అమ్మా ఈశ్వరీ - శ్రీచక్రం--నాలుగు శివచక్రాలు, వాటినుండి విడివడిన ఐదు శక్తి చక్రాలతో ఉన్నది. ప్రపంచానికి మూలకారణమైన తత్త్వముతో కూడిన నీ నివాసమైన శ్రీచక్రంలోని కోణాలు--అష్టదళాలు --షోడశదళ పద్మాలు-- మేఖలా త్రయము మూడు భూపురాలు కలిసి నలభైనాలుగు అంచులు (కోణాలు ) కలిగి వున్నాయి.
అనగా,అమ్మవారు కొలువై ఉండే శ్రీచక్రము,నాలుగు శివ కోణములు మరియు ఐదు శక్తి కోణములు కలిగి, సృష్టికి మూల కారణమైన తొమ్మిది మూల ప్రకృతులతోనూ (తొమ్మిది చక్రాలు ), అష్టదళపద్మమూ,షోడశదళ
పద్మమూ, మేఖలా త్రయము, రేఖా త్రయము, అనే భూపురత్రయముతోనూ కలిసి, నలభై నాలుగు అంచులు కలిగి ఉంటుంది.
సశేషం
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి