19, ఫిబ్రవరి 2026, గురువారం

మానవజన్మ వచ్చినందుకు

  


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏


మానవజన్మ వచ్చినందుకు భగవంతుడు ఇచ్చిన మేధస్సుతో, మనం ఎందుకు జన్మిస్తున్నామో, ఎందుకు మరణిస్తున్నామో, ఆలోచించాలి, అనే

ఉద్దేశంతో శ్రీ భర్తృహరి మహాయోగి ఇలా అంటున్నారు.


శ్లో//భోగా న భుక్తా వయమేవ భుక్తాః /

తపో న తప్తం వయమేవ తప్తాః/

కాలో న యాతో వయమేవ యాతాః/

తృష్ణా న జీర్ణా వయమేవ జీర్ణాః//


(మేము భోగములను అనుభవించలేదు.

భోగములే మమ్మల్ని అనుభవించి, ఇప్పుడు ఇలా శల్యావశిష్టులను చేశాయి.

తపస్సుతో మమ్ము మేము తపింపజేసుకోలేదు.

ధనసంపాదనలో పడి,రాత్రి, పగలు తేడా లేకుండా,

ఎండా, వాన, అనకుండా తిరిగి తిరిగి, 

మమ్ము మేము తపింపజేసుకున్నాము.

కాలం ఎక్కడికీ పోవటం లేదు.

మేమే జనన మరణాలతో వస్తున్నాం, పోతున్నాం.

కాలం గడిచిన కొద్దీ అన్నీ జీర్ణావస్థ చెందుతాయి. కానీ మా ఆశ మాత్రం జీర్ణించి పోవటం లేదు.

ఆ ఆశలు తీర్చుకోవడం చేతగాని మేమే రోజు, రోజుకు, జీర్ణం అయిపోతున్నాం).


శ్లో// వయం యేభ్యో జాతా శ్చిరపరిగతా ఏవ ఖలు తే /

సమం యై స్సంవృద్ధాః స్మృతి విషయతాం తే ౽ పి గమితాః /

ఇదానీమేతే స్మః ప్రతి దివస మాసన్న పతనా /

గతా స్తుల్యావస్థాం సికతిల నదీతీర తరుభిః //


(మమ్ము గన్న తల్లిదండ్రులు గతించి చిరకాలమైనది.

ఎవరితో చిన్నప్పటినుండి కలిసి మెలిసి పెరిగామో,

 ఆ బంధుమిత్రులు స్మృతి పధంలోకి వెళ్ళిపోయారు.

ఈ వార్ధక్య దశలో ప్రతిరోజు మేము చావుకు దగ్గఱవుతున్నాము.

నదీతీరంలో, ఆ చెట్టు కూడా ప్రవాహవేగానికి కోసుకుపోతున్న ఇసుకలో, కూలిపోటానికి సిద్ధంగా ఉన్నది.

ఆ చెట్టుకు, మాకు,తేడా కనిపించటం లేదు ).


ఈ జననము, వార్ధక్యము, మరణము ఎందుకు సంభవిస్తున్నాయో విచారణచేసి, సత్యం గ్రహించడానికి మానవజన్మ వచ్చిందని తెలియజేయడమే భర్తృహరి మహాయోగి ఆశయము.


శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

19-2-'26.

కామెంట్‌లు లేవు: