23, జులై 2022, శనివారం

పరమాత్మ చెప్పిన సత్యం.

 🍁🍁🍁   బ్రహ్మ  పథం   🍁🍁🍁

నిర్వహణ:-గాజుల విష్ణువర్ధన్. M. A.

-------------------🙏-----------------

         పరమాత్ముడి   సందేశం

                   *******

     ద్వాపరయుగం  ఇంకా  కొద్ది రోజులలో   ముగిసిపోయి,  కలియుగం  రాబోతుందనగా   ఒక రోజు శ్రీ కృష్ణుడు   ఇచ్చిన   సందేశం    తెలుసుకుందాం.


    శ్రీకృష్ణుడు  బాలరాముడితో   "  అవతార  సమాప్తి  జరిగి పోతుంది.  మీరు  తొందరగా   ద్వారాకా నగరమును  విడిచి  పెట్టెయ్యండి "  అని చెప్పడాన్ని   ఉద్దవుడు  విన్నాడు.

ఉద్దవుడు శ్రీకృష్ణ   భగవానుడికి  అత్యంత   ముఖ్య సఖుడు,  మరియు  పరమ  ఆంతరంగిక  విశేష భక్తుడు.

ఆయన కృష్ణుడి  వద్దకువెళ్లి "  కృష్ణా"  మేము నీతోకలిసి  ఆడుకున్నాము,  పాడుకున్నాము, అన్నం తిన్నాము,  సంతోషంగా గడిపాము.  ఇలాంటి కృష్ణావతారం   ముగిసిపోతుంది అంటే విని నేను తట్టుకోలేక పోతున్నాను.  నిన్ను విడిచి  నేను ఉండలేను. కాబట్టి  నామనసు  శాంతించే టట్లు  నిరంతరమూ   నీతో ఉండేటట్లు  నాకేదైనా  ఉపదేశం  చెయ్యి " అన్నాడు.

అప్పుడు కృష్ణ  పరమాత్మ   కొన్ని అద్భుతమైన  విషయములను   ఉద్దవుడితో  ప్రస్తావన  చేశాడు.

ఇది మనం  అందరం కూడా  తెలుసుకుని   జీవితంలో   పాటించవలసిన  శ్రీకృష్ణ  పరమాత్మ  చిట్ట చివరి  ప్రసంగం.

దీని తరువాత  కృష్ణుడు  లోకోపకారం కోసం  ఏమీ మాట్లాడలేదు. ఇది లోకమును  ఉద్దరించడానికి   ఉద్దవుడిని  అడ్డుపెట్టి చెప్పాడు.


ఉద్దవా !  నేటికీ  ఏడవ రాత్రి  కలియుగ ప్రవేశం  జరుగుతుంది.  ఏడవరాత్రి  లోపల  ద్వారాకా పట్టణమును   సముద్రం  ముంచేత్తుతుంది.  సముద్ర గర్భంలోకి   ద్వారక  వెళ్లి పోతుంది. ద్వారాకలోఉన్న  వారందరూ  మరణిస్తారు. తదనంతరము   కలియుగం   ప్రవేశస్తుంది.

కలియుగం  ప్రవేశించిగానే   మనుష్యులయందు   రెండు లక్షణములు  బయలు  దేరుతాయి.   ఒకటి   అపారమైన   కోర్కెలు. రెండు  విపరీతమైన   కోపం.

ఎవ్వరు కూడా  తన  తప్పు  తాను  తెలుసుకునే  ప్రయత్నం   కలియుగంలో  చెయ్యరు.

కోర్కెల చేత, అపారమైన   కోపము చేత,  తమ  ఆయుర్ధాయాన్ని   తాము  తగ్గించుకుంటారు.  కోపము చేతను, అపారమైన  కోర్కెల చేతను   తిరగడం వలన   వ్యాధులు  వస్తాయి.   వీళ్లకు  వ్యాధులు    పొటమరించి   ఆయుర్ధాయాన్ని   తగ్గించి వేస్తాయి.

కలియుగంలో  ఉండే మనుష్యులకు  రాను రాను  వేదము   ప్రమాణము కాదు. కోట్ల జన్మల అదృష్టము  చేత, వేదము  ప్రమాణమని   అంగీకరించగల  స్థితిలో,  పుట్టిన వాళ్ళు కూడా   వేదమును  వదిలిపెట్టేసి, తమంత  తాముగా   పాషాండ   మతములను   కౌగలించుకుని,  అభ్యున్నతిని   విడిచిపెట్టి, వేరు మార్గములలో  వెళ్ళిపోతారు.


అల్పాయుర్ధాయంతో  జీవిస్తారు.  రాజయోగం  చేయడం  మరిచి పోతారు.  తద్వారా బ్రహ్మ యోగం   అనబడే   క్రియా యోగం  లేదా,  నేనున్న స్థితికి  చేర్చే  లయయోగం  ఒకటి   ఉండనేది  తెలుసుకునే  ప్రయత్నం  చేయరు. ఆడంబరాలకు   ప్రాధాన్యత నిస్తారు.  ఉపవాసములు  తమ  మనసును  సంస్కరించుకోవడానికి,  ఆచారమును   తమంత తాము   పాటించడానికి  వచ్చాయి. రానురాను  కలియుగంలో   ఏమవుతుందంటే,  ఆచారములు  విడిచి  పెట్టేయడానికి  ప్రజలు  ఇష్టపడతారు.


ఆచారం  అక్కర్లేదనే పూజలు  ఏమీ ఉంటాయో  వాటియందు  మక్కువ  చూపిస్తారు.  వాటి వలన  ప్రమాదము  కొని తెచ్చుకుంటున్నామని   తెలుసుకోరు.  అంతశ్శుద్ధి  ఉండదు.  చిత్త శుద్ధి ఏర్పడదు.


మంచి  ఆచారములు  మనస్సును  సంస్కరిస్తాయి  అని తెలుసుకోవడం  మానివేసి,  ఏపూజచేస్తే,  ఏరూపమును   ఆశ్రయిస్తే,  ఆచారం  అక్కర్లేదని  ప్రచారం ఉంటుందో,  అటువైపుకే   తొందరగా  అడుగు వేస్తారు. కానీ  దానివలన  తాము  పొందవలసిన  స్థితిని  పొందలేము  అని తెలుసుకోలేకపోతారు.


ఇంద్రియములకు  వషులు  అయిపోతారు. రాజులే  ప్రజల సొమ్ము దోచుకుంటారు.  ప్రజలు రాజుల మీద  తిరగబడతారు.


ఎవడికి పాండిత్యమును బట్టి, యోగ్యతను బట్టి  గౌరవము ఉండదు.

కలియుగంలో  ఏ రకంగా  అర్జించాడన్నది   ప్రధానం అవుతుంది.


ఎవడికి  ఐశ్వర్యం  ఉన్నదో వాడే  పండితుడు. భగవంతుని  పాదములను  గట్టిగా  పట్టుకుని తరించిన   మహాపురుషులు  ఎందరో   ఉంటారు. అటువంటి  మహాపురుషులు  తీరుగాడిన   ఆశ్రమములు   ఎన్నో ఉంటాయి.


కలియుగంలో  ప్రజలు  అందరూ  గుళ్ల చుట్టూ  తిరిగేవాళ్ళే కానీ,  అటువంటి  మహాపురుషులు  తీరుగాడిన   ఆశ్రమాల  సందర్శనం  చేయడానికి  అంత ఉత్సాహమును చూపరు. అటువంటి ఆశ్రమములో  కాలు పెట్టాలి, అటువంటి మహాపురుషుల  మూర్తులను   సేవించాలి.


కానీ అక్కడకు వెళ్లకుండా,  హీనమయిన   భక్తితో,  ఎవరిని పట్టుకుంటే తమ కోర్కెలు సులువుగా  తీరగలవు  అని ఆలోచన  చేస్తారు. ఈశ్వరుని యందు  భేదమును  చూస్తారు.


కాబట్టి  నీకు  ఒకమాట  చెపుతాను.  ఈ వాక్యమును  నీవు  బాగా  జ్ఞాపకం  పెట్టుకో.  ఇంద్రియముల చేత  ఏది సుఖమును  ఇస్తున్నదో అది అంతా డొల్ల.  అది నీ మనుష్య జన్మను  పాడు చేయడానికి   వచ్చినదని  గుర్తు పెట్టుకో. దీనినుంచి  దాటాలని  నీవు  అనుకున్నట్లయితే  ఇక్కడి నుండి  బాధరికాశ్రమమునకు   వెళ్ళిపో !


కలియుగంలో గాని   ఏయుగంలో గాని  నీ శ్వాసను  గట్టిగా  పట్టుకోవడం  నేర్చుకో. ధ్యానం చేయడం  విడిచి పెట్టకు. నీ దారి శ్వాస దారి కావాలి.  శ్వాస   దారియే  నా దగ్గరకు  నిన్ను చేరుస్తుంది. నువ్వు చేసే ప్రతి శ్వాస క్రియ లోనూ  నేను  వున్నాను.   వుంటాను.  ఇది విశ్వసించు  ఉద్దవా !   ప్రయత్న  పూర్వకంగా   కొంతసేపు  మౌనంగా  ఉండడానికి  ప్రయత్నించు.  మౌనము, ధ్యానము, ఇంద్రియ నిగ్రహము చేయుట, నోటిలోని మౌనం    మనసులోని  మౌనంతో  ధ్యానంలో  కూర్చొనుట, ఈశ్వరుని  సేవించుట   మొదలగు   పనులను  ఎవరు   పాటించడం  మొదలు పెట్టారో వారు  మెట్లేక్కడం  మొదలు పెడతారు.


ఇది శ్రీకృష్ణ  పరమాత్మ  ఉద్దావుడికి ఇచ్చిన  చివరి సందేశం....


ఈ సందేశం  ఉద్దావుడికే అనుకుంటే పొరపాటు. ఇది మనందరికోసం  పరమాత్మ  చెప్పిన  సత్యం.


సర్వేజనా సుఖినోభవంతు.

ఓం నమో వెంకటేశాయ.

కామెంట్‌లు లేవు: