8, సెప్టెంబర్ 2024, ఆదివారం

సప్త చిరంజీవులు

 🤔సప్త చిరంజీవులు

చిరంజీవులంటే చావులేనివారని అర్థం

అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః ।

కృపః పరశురామశ్చ సప్త ఏతైః చిరంజీవినః ॥

సప్తైతాన్ సంస్మరేన్నిత్యం మార్కండేయమథాష్టమం ।

జీవేద్వర్షశ్శతమ్ సొపి సర్వవ్యాధి వివర్జిత ॥


శ్రీకృష్ణుని శాపము వలన అశ్వత్థాముడు వామనానుగ్రహమువలన బలిచక్రవర్తి లోకహితముకై వ్యాసుడు శ్రీరామభక్తితో హనుమంతుడు రామానుగ్రహమువలన విభీషణుడు విచిత్రజన్మము వలన కృపుడు ఉత్క్రుష్టతపోధనుడైన పరశురాముడు సప్తచిరంజీవులైరి । వీరికుత్తరమున శివానుగ్రహముచే కల్పంజయుడైన మార్కండేయుని ప్రతినిత్యం తలచుకొన్న సర్వవ్యాధి వివర్జితులై శతాయుష్మంతులౌతారని ఈ శ్లొకతాత్పర్యము॥


అశ్వత్థామ - ద్రోణాచార్యుని కుమారుడు. కురుక్షేత్ర యుద్ధం తరువాత కౌరవ పక్షాన మిగిలిన అతి కొద్దిమందిలో ఇతనొకడు. నిద్రిస్తున్న ఉపపాండవులను గొంతుకలు కోసి చంఫాడు. ఆ కారణంగా, ఒళ్ళంతా వ్రణాలతో చావు లేకుండా చిరంజీవిగా జీవించమని శ్రీకృష్ణూడు అతన్ని శపించాడు.

బలి - ముల్లోకాలనూ జయించిన దానవ చక్రవర్తి. ప్రహ్లాదుని మనుమడు. విరోచనుని కుమారుడు. పౌరాణిక గాథల్లో మహా దాతలుగా ప్రసిద్ధికెక్కిన ముగ్గురు - బలి, శిబి, ధధీచి - లలో ఒకడు. వామనావతారంలో వచ్చిన విష్ణుమూర్తి మూడడుగుల నేలను అతనినుండి దానంగా పొంది, రెండు అడుగులతో యావద్విశ్వాన్నీ ఆక్రమించి, మూడో అడుగు ఎక్కడ పెట్టమని అడగ్గా, తన తలను చూపించాడు. త్రివిక్రముడైన వామనుడు అతన్ని పాతళానికి తొక్కేసాడు.

హనుమంతుడు అత్యంత ప్రసిద్ధుడైన చిరంజీవి. బ్రహ్మచారి. రామకార్యం కోసం లంకకు లంఘించి, సీత జాడ కనుక్కున్న పరోపకారి. హనుమతుడు చేసిన 

ఉపకారానికి రాముడిచ్చిన బహుమానం అత్మీయమైన కౌగిలింత. రాముణ్ణి తన గుండెలో దాచుకున్నవాడు, రాముడి గుండెలో ఒదిగిపోయినవాడు -హనుమంతుడు.

విభీషణుడు 

రావణాసురుని తమ్ముడు

 అపహరించి తెచ్చిన సీతను తిరిగి రామునికి అప్పగించమని అన్నకు సలహా ఇచ్చాడు. ఆ తరువాత అన్నను వీడి, రాముని వద్ద శరణు పొందాడు. అతను చిరంజీవి కాదుగానీ దాదాపుగా చిరంజీవి. కల్పాంతము వరకూ చిరంజీవిగా ఉండే వరం పొందాడు.

కృపుడు

కౌరవ పాండవుల కుల గురువు. ద్రోణుని బావమరది. కురుక్షేత్ర యుద్ధంలో బ్రతికి బట్టకట్టిన అతి కొద్ది కౌరవ పక్ష యోధుల్లో మేనల్లుడు అశ్వత్థామతో పాటు కృపుడు ఒకడు.

పరశురాముడు

విష్ణుమూర్తి అవతారం. జమదగ్ని కొడుకు. తండ్రి ఆజ్ఞ మేరకు తల్లిని చంపి మళ్ళీ ఆమెను బతికించమని వరంగా కోరుకున్నవాడు. తన తండ్రిని క్షత్రియుడైన కార్తవీర్యార్జునుడు వధించినందుకు ప్రతిగా యావత్తు క్షత్రియ జాతిపై 21 మార్లు దండెత్తి వారిని వధించాడు.

వ్యాసుడు

భారత, భాగవత గ్రంథాలను రచించాడు. భారత దేశంలో వివిధ భాషల్లో ఉన్న భారత భాగవత గ్రంథాలకు ఈతని రచనలే మూలం. వశిష్టుని మునిమనుమడు, శక్తి మహర్షి మనుమడు, పరాశరుని కుమారుడు. భీష్మునికి వరుసకు అన్న.


ఈ ఏడుగురు చిరంజీవులని 

పురాణాలు 

 చెపుతున్నాయి. ఈ ఏడుగురితో పాటు మరొక చిరంజీవి యైన 

మార్కండేయుని

కూడా కలిపి అష్ట చిరంజీవులని కూడా అంటారు. మార్కండేయుడు శివుని అనుగ్రహాన చిరంజీవి అయ్యాడు.

కామెంట్‌లు లేవు: